కొత్త నీటితో త్రివేణి సంగమం వద్ద గోదావరి జలకళను సంతరించుకున్నది. ఎగువన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరుచుకోవడంతో సోమవారం మధ్యాహ్నం రెంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరి ప్రవహించింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు జూలై 1 నుంచి అక్టోబర్ 28వరకు బాబ్లీ గేట్లు తెరుచుకొని ఉంటాయి. రెండు రాష్ర్టాల అధికారులు ప్రాజెక్టు గేట్లను ఎత్తివేయడంతో దిగువన కందకుర్తి సమీపంలో త్రివేణి సంగమ క్షేత్రం వద్ద నిండుగా ప్రవహిస్తూ కనిపించింది. నదిలోని పురాతన శివాలయం చుట్టూ నీరు చేరడంతో భక్తులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.