ఖలీల్వాడి, జూన్ 30: మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్కు ఇందూరు ప్రజలు అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. నిజామాబాద్ నగరంలోని ప్రగతినగర్లో ఉన్న డీఎస్ ఇంటి నుంచి బైపాస్ రోడ్డులోని వ్యవసాయ క్షేత్రం వరకు అశేష జనవాహిని అంతిమయాత్రలో పాల్గొని నివాళులర్పించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో రహదారి మొత్తం జనసంద్రంగా మారింది. బైపాస్ రోడ్డులోని డి.శ్రీనివాస్ కుటుంబీకులకు చెందిన వ్యవసాయక్షేత్రంలో ఆదివారం ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. సంతాప సూచకంగా పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి శ్రద్ధాంజలి ఘటించారు. పెద్దకుమారుడు సంజయ్ తన తండ్రి డీఎస్ చితికి నిప్పంటించారు. అంతకుముందు హెలికాప్టర్ ద్వారా నిజామాబాద్ చేరుకున్న సీఎం రేవంత్రెడ్డి..
ప్రగతినగర్కు చేరుకొని డీఎస్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఎంపీ ధర్మపురి అర్వింద్, కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీఎం వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్రెడ్డి, షబ్బీర్ అలీ ఉన్నారు. ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు సుదర్శన్రెడ్డి, భూపతిరెడ్డి, రాకేశ్రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్సీలు జీవన్రెడ్డి, మహేశ్కుమార్గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, నగర మేయర్ దండు నీతుకిరణ్ తదితరులు డీఎస్ పార్థివదేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, డీఐజీ సుధీర్బాబు, సీపీ కల్మేశ్వర్ సింగేనవార్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్, మున్సిపల్ కమిషనర్ మకరంద్ తదితర అధికారులు డీఎస్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
మాజీ మంత్రి డి.శ్రీనివాస్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని సీఎం రేవంత్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన డీఎస్.. ఉమ్మడి రాష్ట్రంలో కీలక నేతగా కొనసాగారని గుర్తుచేశారు. నిజామాబాద్ అభివృద్ధికి కృషి చేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులోనూ కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. త్వరలోనే డీఎస్ కుటుంబసభ్యులను సచివాలయానికి పిలిపించుకొని చర్చించిన తర్వాత డీఎస్ జ్ఞాపకార్థం ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అన్నివిధాలుగా డీఎస్ కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్నారు.