మోర్తాడ్/బాల్కొండ, జూలై 4: కేసీఆర్ నాయకత్వంలో ఐదేండ్లుగా మండలాలు, గ్రామాల్లో జరిగిన అభివృద్ధి, ప్రజాసమస్యల పరిష్కారంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు చేసిన సేవలు మరవలేనివని మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బాల్కొండలోని క్యాంపు కార్యాలయంలో గురువారం పదవీకాలం పూర్తయిన ప్రజాప్రతినిధుల సన్మానసభకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్న మనం ప్రజలపక్షాన, రైతుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా, కోతలు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతుబంధు సక్రమంగా ఇవ్వకుండా ఊరూరా మీటింగ్లు పెట్టి కోతలు విధించే కార్యక్రమాలు చేపట్టడాన్ని ఆపి పంట పండిస్తున్న ప్రతి ఎకరానికి రైతుబంధును ఇవ్వాలన్నారు.
అధికారంలోకి రాగానే రైతురుణమాఫీ చేస్తామని చెప్పి పూటకోమాట మారుస్తున్నారని, వీటన్నింటినీ రైతులు గమనిస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి 200రోజులు గడుస్తున్నా హామీల అమలు లేదు, అభివృద్ధి పనుల జాడలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కొందరు ఆఫీసులు పంచుకుంటే, మరికొందరు ఇసుక రీచ్లు పంచుకుంటున్నారని, జేసీబీలు పెట్టి ఇసుకను తోడేస్తూ అక్రమంగా ఇసుకను రవాణాను చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పథకం ఏది అమలు కావాలన్నా చేతులు తడపనిదే పనికాదన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. తనపై, బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు ప్రచారాలు చేస్తూ వస్తున్నారని, ఎన్నికల్లో కూడా అదే చేసినా తన విజయాన్ని ఆపలేకపోయారన్నారు. మరికొన్ని రోజులు గడిస్తే కాంగ్రెస్పై వ్యతిరేకత వస్తుందని, ఇప్పటికే ప్రజలు కేసీఆర్ నాయకత్వమే కావాలని అభిప్రాయ పడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క అభివృద్ధి పనీ చేయలేదని, చేసిన పనులకు బిల్లులు రావాలంటే పర్సంటేజీలు ముట్టాల్సిందేనన్నారు.
పోచారం పార్టీ మారడాన్ని ప్రజలు ఈసడించుకున్నారు
సుదీర్ఘ అనుభవమున్న పోచారం శ్రీనివాసరెడ్డికి బీఆర్ఎస్ పార్టీ ఉన్నతమైన స్థానాన్ని కల్పించిందని, అయినా నాలుగు రోజులు కూడా అధికారంలో లేకుండా ఉండలేకపోయారని ఎమ్మెల్యే వేముల విమర్శించారు. ఎవరి ఒత్తిడితోనో, తాత్కాలిక లబ్ధి కోసమో పార్టీని వీడడంతో జిల్లా ప్రజలు ఈసడించుకున్నారన్నారు. పార్టీని వీడేవాళ్లు వీడతారని, వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని, మళ్లీ ఎవరిని ఆదరించాలో వారికి తెలుసన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజల పక్షాన పోరాడేందుకు సిద్ధం కావాలన్నారు. ప్రజల్లో మార్పు మొదలైందని, తిరిగి బీఆర్ఎస్ను ఆదరిస్తారన్నారు. గతంలో మాదిరిగానే ప్రతిపక్షంలో ఉండి ప్రజలకోసం పనిచేయాలని సూచించారు. జాబ్క్యాలెండర్ అని ఎప్పుడూ యువతను రెచ్చగొట్టే నాయకులు బల్మూరి వెంకట్, తీన్మార్ మల్లన్న పదవులు తీసుకుని పెదవులు మూసుకున్నారన్నారు. అందుకే వర్సిటీ నిరుద్యోగులు స్వచ్ఛందంగా తాము మోసపోయామని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యమం మొదలు పెట్టారని, వారికి బీఆర్ఎస్ పార్టీ మద్దతుగా నిలుస్తోందన్నారు.