కామారెడ్డి, జూన్ 26 : వ్యవసాయంతోపాటు లాభదాయకమైన పాడిపరిశ్రమ, కోళ్లు, చేపల పెంపకం,ఆయిల్ పామ్, తోటల పెంపకం వంటి వాటిపై రైతులు దృష్టిసారించి ఆర్థికంగా వృద్ధి సాధించాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. పట్టణంలోని కళాభారతి ఆడిటోరియంలో డెయిరీ టెక్నాలజీ కళాశాల, జాతీయ మాంస పరిశోధన సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన కిసాన్మేళాను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల ఆదాయ వనరులను మెరుగుపరచాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా వివిధ పథకాలు అమలు చేస్తూ సబ్సిడీ అందిస్తున్నదని అన్నారు. కిసాన్ మేళా ద్వారా రైతులకు వ్యవసాయంలో సూచనలు, మెలకువలు, సాంకేతిక సలహాలు, శాస్త్ర పరిశోధన ఫలాలు అందిస్తూ అవగాహన కల్పిస్తున్నదని అన్నారు. రైతులు వాటిని ఆకలింపు చేసుకొని సంపద పెంపొందించుకునే దిశగా ఎదగాలని కోరారు. అంతకుముందు పశు సంవర్ధక, ఉద్యాన, మత్స్య శాఖ, విజయ డెయిరీ, పరిశ్రమల శాఖ,నాబార్డు తదితర సంస్థలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. కార్యక్రమంలో జాతీయ మాంస పరిశోధన సంస్థ డైరెక్టర్ బర్బుద్దే, కామారెడ్డి డెయిరీ టెక్నాలజీ కళాశాల అసోసియేట్ డీన్ శరత్చంద్ర, కోరుట్ల పశువైద్య కళాశాల అసోసియేట్ డీన్ శ్రీనివాస్, ఎస్ఆర్ఎంఐ ప్రిన్సిపాల్ సైంటిస్ట్ బస్వారెడ్డి, జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి సింహారావు, జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి, విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ నందకుమారి, కళాశాల విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు.