నిజామాబాద్, జూన్ 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి): వానాకాలం మొదలైనప్పటికీ వర్షాలు లేక ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లుగా పంటల సాగు దాపురించింది. వ్యవసాయ శాఖ సాగు అంచనాలను సిద్ధం చేసింది. నిజామాబాద్ జిల్లాలో 5.39లక్షల ఎకరాల్లో పంటల సాగు ఉంటుందని పేర్కొనగా ఇందులో ఇప్పటి వరకు స్వల్పంగానే సాగైంది. కామారెడ్డి జిల్లాలో 5.18లక్షల ఎకరాల్లో పంటల సాగుకు ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ రైతులు మాత్రం పంటలు వేసేందుకు నడుంకట్టిన సందర్భాలే కనిపించడం లేదు. వర్షాభావ పరిస్థితులు రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ప్రస్తుతం ఎస్సారెస్పీ, నిజాంసాగర్ ప్రాజెక్టుల్లోనూ నీటి నిల్వలు అడుగంటాయి. చెరువులు, కుంటల్లోనూ జలకళ తప్పింది. దీంతో వానలు తప్పా మరే ఆధారం లేకుండా పోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎస్సారెస్పీకి రివర్స్ పంపింగ్ ద్వారా నీళ్లను ఎత్తిపోసి చెరువులు, కుంటలు నింపారు. కాళేశ్వరం జలాలను నిజాంసాగర్కు హల్దీ కాలువ ద్వారా పంపించి చారిత్రక ప్రాజెక్టు కింద ఆయకట్టుకు ఊపిరిపోసేది. కానిప్పుడు కాంగ్రెస్ పాలకుల్లో అలాంటి చొరవే కానరావడం లేదు. బోర్ల కింద సాగుకు రైతులు భయపడాల్సి వస్తున్నది. భూగర్భ జలం కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో ఏంచేయాలో తెలియక గందరగోళంలో కొట్టుమిట్టాడుతున్నారు.
వర్షాలు లేకపోవడంతోపాటు పెట్టుబడి సాయం అందివ్వకపోవడం కూడా పంటల సాగు విస్తీర్ణం పెరగకపోవడానికి ప్రధానంగా కారణంగా తెలుస్తున్నది. అత్యధిక మంది రైతులు సన్న, చిన్నకారు వర్గాలే ఉన్నారు. వీరికి పంటల సాగు కోసం పెట్టుబడికి పైసల్లేక విలవిల్లాడుతున్నారని తెలిసింది. రైతుభరోసా కింద ఏటా ఎకరానికి రూ.15వేలు ఇస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ ఊసే ఎత్తడం లేదు. గత యాసంగి సీజన్లో అరకొరగా పెట్టుబడి సాయం ఇచ్చినట్లే ఈసారి కూడా అలాంటి ఏర్పాట్లే చేస్తున్నది. సమయానికి పెట్టుబడి సాయం అందివ్వకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఓవైపు అప్పులు చేసేందుకు ధైర్యం చాలక, పెట్టుబడి సాయం రాక రైతులు సాగుకు దూరంగా ఉంటున్న సందర్భాలు కూడా వెలుగు చూస్తున్నాయని తెలుస్తున్నది. కేసీఆర్ హయాంలో రైతుబంధు పథకం ద్వారా కర్షకుల బతుకులు గాడిలో పడ్డాయి. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలకే పన్నులు రూపంలో రైతులు చెల్లించే పరిస్థితి ఉండేది. అలాంటిది కేసీఆర్ చొరవతో పెట్టుబడి సాయం కింద నగదు నేరుగా రైతులకే అందించే ఏర్పాటు జరిగింది. భూమి విస్తీర్ణాన్ని అనుసరించి ఎకరానికి రూ.5వేల చొప్పున ఏటా రెండుసార్లు మొత్తం రూ.10వేల చొప్పున ఎకరానికి రైతుబంధును అందించేది.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం సాగు విస్తీర్ణంలో అగ్రభాగం వరి పంటకే రైతులు మొగ్గు చూపుతున్నారు. వ్యవసాయ శాఖ వెల్లడించిన అంచనాల ప్రకారం జిల్లాలో 4లక్షల 23వేల 32 ఎకరాల్లో వరినే సాగు చేయబోతున్నట్లుగా తేల్చారు. కానీ..ఇంత వరకు కేవలం 46వేల ఎకరాల్లోనే వరినాట్లు నోచుకున్నాయి. మక్కజొన్న 39,557ఎకరాల్లో సాగు అంచనాలుంటే అత్యధికంగా 35వేల ఎకరాల్లో సాగైంది. సోయాబీన్ 50,995 ఎకరాలకు 17వేల ఎకరాల్లో విత్తారు. 3273 ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనాలుంటే 237 ఎకరాల్లోనే సాగైంది. కామారెడ్డి జిల్లాలో వ్యవసాయ శాఖ వానాకాలంలో 5లక్షల 18వేల ఎకరాల్లో పంటల సాగు ప్రణాళికలను సిద్ధం చేసింది. ప్రధాన పంటగా వరినే అత్యధిక మంది రైతులు 3లక్షల 15వేల 965 ఎకరాల్లో సాగు చేయబోతున్నట్లుగా అంచనా వేయగా ఇప్పటి వరకు 9వేల ఎకరాల్లోనే నాట్లువేశారు. వరి తర్వాత అధిక మొత్తంలో సోయాబీన్, పత్తి, మక్కజొన్న పంటలతోపాటు అపరాల సాగుకు రైతులు దృష్టి పెట్టే అవకాశాలున్నట్లుగా వ్యవసాయ శాఖ గణాంకాలు ఉండగా ఇప్పటి వరకు మక్కజొన్న 57,617 ఎకరాలకు 9వేల ఎకరాలకు, 85,444 ఎకరాల్లో సోయాబీన్ అంచనాలుంటే కేవలం 13వేలకే పరిమితమైంది. పత్తి ఈసారి కామారెడ్డి జిల్లాలో 28వేల 780 ఎకరాల్లో సాగుకు అవకాశాలున్నట్లుగా వ్యవసాయ శాఖ పేర్కొనగా నేటివరకు 7వేల ఎకరాలకు పరిమితమైంది. అపరాల సాగు సైతం ప్రాధాన్యత స్థాయిలో ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొనప్పటికీ వర్షాభావ పరిస్థితిలు తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి.
ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రైతులెవ్వరూ గందరగోళానికి గురి కావాల్సిన అవసరం లేదు. పంటల సాగులో రైతులకు సలహాలు, సూచనలు అందించేందుకు ఏఈవోలు, ఏవోలు సిద్ధంగా ఉన్నారు. వ్యవసాయాధికారులను సంప్రదించి సలహాలు, సూచనలు స్వీకరించి పంటల సాగులో ముందుకు వెళ్లాలి. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందించే రైతుభరోసా పథకానికి సంబంధించి ఇప్పటి వరకు మాకు ఎలాంటి మార్గదర్శకాలు జారీకాలేదు.
గాంధారి, జూన్ 26: గాంధారి మండల కేంద్రంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో నాలుగైదు రోజులుగా వర్షం కురియక పోవడంతో విత్తనాలు విత్తుకున్న రైతులు వాటిని కాపాడేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. గాంధారిలో నాలుగు రోజుల క్రితం మోస్త్తరు వర్షం కురవడంతో చాలా మంది రైతులు మక్కజొన్న, సోయా, పత్తి, కంది తదితర విత్తనాలను విత్తుకున్నారు. నాలుగైదు రోజులు గడుస్తున్నా చినుకు రాలకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొందరు వేసిన విత్తనాలను కాపాడుకునేందుకు డ్రిప్ స్ప్రింక్లర్లతో పంట భూములకు తడి అందిస్తున్నారు. వరుణ దేవుడు కరుణించాలని ఆకాశం వైపు చూస్తున్నారు.