ఆర్మూర్ టౌన్, జూలై 4: ధరణి దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వానికి తావు లేకుండా యుద్ధప్రాతిపదికన పరిశీలన ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు. ఆర్మూర్ తహసీల్ కార్యాలయాన్ని గురువారం సందర్శించిన కలెక్టర్.. ధరణి దరఖాస్తుల పరిశీలన, వాటి పరిష్కారం తీరుపై స్థానిక రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. ఆర్మూర్ మండల పరిధిలో ఆయా మాడ్యూల్స్లో పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తుల వివరాలు తెలుసుకున్నారు. ఎక్కువ సంఖ్యలో ధరణి దరఖాస్తులు పెండింగ్లో ఉండడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ధరణి దరఖాస్తులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని నెల రోజులుగా సూచిస్తున్నప్పటికీ ఎందుకు శ్రద్ధ చూపడం లేదని అధికారులను ప్రశ్నించారు. స్పెషల్ డ్రైవ్ చేపట్టి పెండింగ్ దరఖాస్తులన్నింటినీ క్లియర్ చేయాలని ఆదేశించారు. తప్పిదాలకు ఆస్కారం లేకుండా వాస్తవ పరిస్థితులతో కూడిన నివేదికను నిబంధనలకు అనుగుణంగా రూపొందించి ఆర్డీవో లాగిన్కు ఫార్వర్డ్ చేయాలన్నారు. ధరణి దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించిన ప్రగతిపై రోజువారీగా నిశితంగా పరిశీలించాలని ఆర్డీవోకు సూచించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్, సంబంధిత అధికారులున్నారు.