ప్రభుత్వ కార్పొరేషన్ పదవుల నియామకం ఎటూ తేలడం లేదు. ఆశావాహులకు ఎదురుచూపులు తప్పడం లేదు. గతంలో పేర్లు ప్రకటించిన వారికి పదవులు ఉన్నాయో.. లేవో కూడా తెలియడం లేదు. సరిగ్గా పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్కు ముందు 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తున్నట్లు కాంగ్రెస్ నుంచి ప్రకటనలు వెలువడ్డాయి. అయితే, అధికారికంగా జీవోలు జారీ కాలేదు. అదే సమయంలో ఎలక్షన్ కోడ్ రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. అయితే, కోడ్ ఎత్తేసి నెల రోజులు కావొస్తున్నా నామినేటేడ్ పోస్టుల భర్తీలో కదలిక లేదు. ఉమ్మడి జిల్లాలో నలుగురి పేర్లను వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లుగా ఎంపిక చేసినట్లు ప్రకటించారు. అయితే, ఇప్పటికీ జీవో జారీ చేయడంలో తాత్సారం చేస్తుండడంపై అటు నేతల్లో, ఇటు అనుచరుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. లోక్సభ పోరులో ఆశించిన స్థాయిలో ఓట్లు రాకపోవడంతో.. గతంలో ప్రకటించిన జాబితాలో మార్పులు, చేర్పులు ఉంటాయన్న ప్రచారం జరుగుతున్నది. దీంతో ఉమ్మడి జిల్లాకు చెందిన ఆ నలుగురికి పదవులు ఉంటాయా.. లేక వారి స్థానంలో కొత్త వారికి కేటాయిస్తారా? అన్నది సస్పెన్స్గా మారింది. ఎన్నికల కోడ్ ముగియగానే పదవీ బాధ్యతలు చేపట్టాల్సిన నేతలు ఇంటికే పరిమితం అవుతుండడంపై అనుమానాలు కలుగుతున్నాయి.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి నలుగురు కాంగ్రెస్ లీడర్లకు కార్పొరేషన్ పదవులు ఇచ్చినట్లుగా అధిష్టానం ప్రకటించింది. పదవులను దక్కించుకున్న వారంతా కోడ్ సమయంలోనే ఆయా శాఖల అధికారులతో సంప్రదింపులు జరిపారు. కార్పొరేషన్ల విధులు, విధివిధానాలపైనా అవగాహన పెంచుకున్నారు. తీరా చూస్తే జీవోల జారీలో జాప్యంతో గొంతులో పచ్చి వెళక్కాయ పడ్డదన్నట్లుగా మారింది. మొత్తం 37 కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీలో ఉమ్మడి జిల్లాకు నాలుగు దక్కాయి. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గానికి చెందిన ముగ్గురు నేతలకు పదవులిచ్చినట్లుగా ప్రకటనలు చేశారు. డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డికి కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్గా, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్కు తెలంగాణ మినరల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా, కిసాన్ సెల్ అధ్యక్షుడు అన్వేశ్ రెడ్డికి తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్గా, కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన కాసుల బాలరాజును ఆగ్రోస్ చైర్మన్గా నియమించనున్నట్లుగా సమాచారం అందించారు. ఇవేవీ కార్యరూపం దాల్చకపోవడంతో వారంతా నిట్టూరుస్తున్నారు. కేవలం తాహెర్బిన్ హుందాన్కు ఉర్దూ అకాడమీ చైర్మన్ పదవి ఒక్కటే అధికారికంగా భర్తీచేశారు.
పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో అగ్గికి ఆజ్యం పోసినట్లు అయ్యింది. ఫలితాల ప్రభావం ఆశావహులపై తీవ్రంగా చూపబోతున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రతికూల ఫలితాలు వచ్చిన చోట పదవుల భర్తీలో మొండి చేయి తథ్యంగానే కనిపిస్తున్నది. ఎంపీ ఎన్నికల్లో అభ్యర్థుల విజయం కోసం, పార్టీ విస్తరణకు పనిచేయని నేతలకు చెక్పెట్టేలా పీసీసీ అధినాయకత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఇందులో భాగంగా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి అపజయం దక్కడంతో పదవుల భర్తీలో ప్రాధాన్యతలు మారే అవకాశాలు లేకపోలేదన్న వాదన వినిపిస్తున్నది. అందుకే జీవోల జారీలో తీవ్ర ఆలస్యం చోటు చేసుకుంటున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలోనూ ప్రాధామ్యాలు తారుమారు అయ్యే వీలు కూడా ఉన్నట్లుగా తెలుస్తున్నది. కార్పొరేషన్ నామినేటెడ్ పదవుల భర్తీలో చోటుచేసుకుంటున్న ఆలస్యంతో పోటీ పడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. ముందే ప్రకటించిన పేర్లకు బదులుగా మరికొంత మందికి పదవుల భర్తీలో చోటు కల్పించేందుకు పీసీసీ నాయకత్వం ఆలోచన చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుండడంతో చాలా మంది ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేసుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ లెక్కన జీవోలు జారీ అయ్యేదాకా ఎవరెవరికి ఏయే పదవులు వస్తాయో అన్నది స్పష్టత వచ్చే అవకాశమే లేకుండా పోయింది. పదవుల పంపకం నిమిత్తం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్కు వెళ్లడంతో ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.