ఎడపల్లి, జూలై 2: ప్రభుత్వ పాఠశాలలో నీటి ఇబ్బందులపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తంచేస్తూ ధర్నాకు దిగిన ఘటన ఎడపల్లి మం డలం ఠాణాకలాన్లో చోటు చేసుకున్నది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 15 రోజులు గా తాగడానికి, కాలకృత్యాలు తీర్చుకునేందు కు నీటి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం పాఠశాలకు చేరుకొని హెచ్ఎం నరేందర్తో వాదనకు దిగారు. ప్రధానోపాధ్యాయుడి నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ పాఠశాల ఆవరణలోనే వాటర్ట్యాంక్ ఉండి అండర్గ్రౌండ్ పైపుల ద్వారా నీటి సరఫరా అయ్యేదని, పైపులన్నీ మట్టితో జామ్ అవ్వడంతో 15రోజులుగా నీటి సరఫరా లేదన్నారు. దీంతో విద్యార్థులు తాగడానికి ఇంటి నుంచి బాటిళ్లలో నీటిని తెచ్చుకుంటున్నారని తెలిపారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నదని, పాఠశాల పక్కనే ప్రధాన రోడ్డు ఉండడంతో విద్యార్థులకు ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ పాల్దా భాస్కర్ రెడ్డి పాఠశాలకు చేరుకొని తల్లిదండ్రులను శాంతింపజేశారు. ఈ విషయమై ఎంఈవో రామారావును హెచ్ఎం సంప్రదించగా రేపటిలోగా నీటి సరఫరా మెరుగుపరుస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన విరమించారు.