బాన్సువాడ, జూలై 2: మాజీ సీఎం కేసీఆర్ సహకారంతో బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అప్పట్లో కేసీఆర్ అడిగినన్ని నిధులు ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్ పార్టీలో చేరాను తప్పితే పదవుల కోసం కాదని తెలిపారు. అధికార పార్టీలో చేరిన పోచారంను సీనియర్ నేత కాసుల బాల్రాజు మంగళవారం బాన్సువాడలోని ఆయన నివాసంలో కలిశారు. అనంతరం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాజీ స్పీకర్ మాట్లాడారు. ఏ పార్టీలో ఉన్నా నిజాయితీ, నిబద్ధత ముఖ్యమని, ఏం చెబుతామో అదే చేయాలన్నారు. అందరినీ కలుపుకొని పోతానని, ఏకపక్ష నిర్ణయాలు ఉండవన్నారు. కాసుల బాల్రాజుకు రాష్ట్ర స్థాయిలో ఉన్నత పదవి రాబోతున్నదని చెప్పారు.
ఎప్పుడైనా లోకల్ లోకలే అని, బయటి నుంచి వచ్చిన వారు అద్దెకు ఉండేవారు మాత్రమేనని పోచారం వ్యాఖ్యానించారు. బాల్రాజుకు కార్పొరేషన్ చైర్మన్ పదవి వస్తే వాళ్లకు కడుపునొప్పి ఎందుకని ప్రశ్నించారు. తనకు బయట ఒకటి, లోపల ఒకటి ఉండదన్నారు. శ్రీనన్నది మాట గట్టిగా ఉన్నా మనస్సు మెత్తనిదని కాసుల బాల్రాజు అన్నారు. పోచారం చేరిక గురించి సీఎం రేవంత్ ఫోన్ చేసి అభిప్రాయం అడిగారని, ఇద్దరం కలిసి బాగా పని చేస్తామని చెప్పానన్నారు. కొంత మంది దుష్ట శక్తుల నుంచి పార్టీని కాపాడుకోవాలంటే పోచారం కాంగ్రెస్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.