వినాయక్నగర్, జూన్ 6: సోనియా పుట్టిన రోజు సందర్భంగా డిసెంబర్ 9న నిర్వహించే తెలంగాణ తల్లి ఉత్సవాలను ఖండిస్తున్నామని, సోనియా మెప్పు కోసం సీఎం రేవంత్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మండిపడ్డారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో సీఎం రేవంత్ బుద్ధి తెచ్చుకొని ప్రవర్తిస్తారనుకుంటే మళ్లీ అవే అహంకారపు మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి, ప్రజలంతా ఏకమై బుద్ధి చెప్పినా ఆత్మ విమర్శ చేసుకోకుండా బీజేపీపైన ఏడవడం సరికాదని హెచ్చరించారు. 15స్థానాలు గెలుస్తామని బీరాలు పలికిన రేవంత్.. సొంత జిల్లాలో ఎంపీ,ఎమ్మెల్సీ స్థానాల ఓటమికి బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చిహ్నాలు, గుర్తులు మార్చే శ్రద్ధ, పాలనపైన పెట్టి.. ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తే బాగుంటుందన్నారు. మత రాజకీయాలతో ఓవర్గం మెప్పు కోసం తెలంగాణ అమరుల ఆశయాలు, ఆకాంక్షలు, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాలని చూస్తే ఊరుకోమని ధన్పాల్ హెచ్చరించారు.