కామారెడ్డి,జూలై 1: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో విద్యాధికారులతో సీజనల్ వ్యాధులపై సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వానకాలంలో మలేరియా, పైలేరియా, మెదడు వాపు, డెంగీ, చికున్ గున్యా, టైఫాయిడ్, డయేరియా, అతిసార వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని అన్నారు. పరసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో వ్యాధులను అరికట్టవచ్చని తెలిపారు. వర్షపు నీటిని నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు.నీరు ఎక్కువగా నిల్వ ఉన్న ప్రాంతాల్లో మలేరియా వ్యాధిని వ్యాప్తి చెందించే దోమలు పెరుగుతాయని, నీరు నిల్వ ఉండకుండా చూడాలని అన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డేను పాటించి శుభ్రం చేయడంతో వ్యాధులను అరికట్టవచ్చని తెలిపారు. శుభ్రమైన ఆహారాన్ని తినాలని, ఆకు కూరలు, కూరగాయలు వండే ముందు శుభ్రంగా కడగాలని, ఉడికించిన ఆహారాన్ని తినాలని అన్నారు. ప్రతి ఆదివారం పది నిమిషాల సమయాన్ని కేటాయించి ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డీఆర్డీవో చందర్, డీఎంహెచ్వో చంద్రశేఖర్, వైద్యాధికారులు పాల్గొన్నారు.