కామారెడ్డి, జూలై 3: దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానను కలెక్టర్ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దవాఖానలోని అన్ని విభాగాలను పరిశీలించి, రోగులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సేవలందించాలని సూపరింటెండెంట్ రాంసింగ్ను ఆదేశించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని, అందుకు తగిన సహకారం అందిస్తానని చెప్పారు.
మాతృ మరణాలు జరగకుండా సమర్థవంతంగా వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో వైద్యారోగ్య శాఖ అధికారులతో సమావేశమై మాతృ మరణాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చిన ఈ కాలంలో ప్రసవ సమయంలో మాతృ మరణాలు సంభవించకుండా జాగ్రత్తపడడం వైద్యాధికారుల కర్తవ్యం అని అన్నారు. ఏఎన్ఎం స్థాయి నుంచి వైద్యాధికారి, జిల్లాస్థాయిలో ఎంసీహెచ్ ప్రోగ్రాం అధికారి వరకు అందరూ బాధ్యతతో ఉండాలని, నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీఎంహెచ్వో డాక్టర్ చంద్రశేఖర్, ఎంసీహెచ్ ప్రోగ్రాం అధికారిణి డాక్టర్ శోభారాణి, డీసీహెచ్ఎస్ డాక్టర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.