రుద్రూర్/ కోటగిరి/ పొతంగల్, బోధన్ రూరల్, జూలై 3 : రైతుల అభిప్రాయం మేరకే ప్రభుత్వ రైతు భరోసా పథకం అమలుపై సరికొత్త విధానాన్ని అమలు చేయనున్నట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. జిల్లాలోని వివిధ సొసైటీల్లో బుధవారం మహాజన సభలు నిర్వహించి, రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. కొత్తపల్లి సహకార సంఘం, కోటగిరి సహకార సంఘం ఆవరణలో చైర్మన్లు సునీల్కుమార్, కూచి సిద్ధు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కోటగిరి మండల వ్యవసాయాధికారి శ్రీనివాస్ అభిప్రాయాలను సేకరించారు. పడావు, గుట్ట భూములను ఇవ్వకుండా, ఐదెకరాల వరకు పంట సాగు చేసే వారికి పెట్టుబడి సాయం ఇవ్వాలని రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు. మరికొందరు రైతులు పదెకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలని కోరగా.. మరికొందరు సాగు చేసేవారందరికీ అందజేయాలని తీర్మానం చేశారు. సమావేశంలో వైస్ చైర్మన్ గజేందర్, జాయింట్ రిజిస్ట్రార్ వసంత, లావణ్య, సీఈవోలు, ఏఈవోలు గౌస్, గంగాసాగర్ పాల్గొన్నారు. రుద్రూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, రాయకూర్లో ప్రత్యేక మహాజన సభలు నిర్వహించారు. రుద్రూర్లో నిర్వహించిన సభకు జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్ హాజరై రైతుభరోసాపై అవగాహన కల్పించారు.
ఐదెకరాలు ఉన్న వారికి పెట్టుబడి సాయం అందించాలని రైతులు అన్నారు. బీడు భూములు, ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వారికి రైతు భరోసా ఇవ్వవద్దని రైతులు అభిప్రాయపడ్డారు. జడ్పీటీసీ నారోజి గంగారాం, రాయకూర్ విండో చైర్మన్ సంగమేశ్వర్, ఏవో నగేశ్రెడ్డి, రుద్రూర్ విండో చైర్మన్ సంజీవ్రెడ్డి, ఏఈవో శ్రావణి, జిల్లా ప్రత్యేకాధికారి జియావుద్దీన్, కార్యదర్శులు సాయికిరణ్, లక్ష్మణ్ పాల్గొన్నారు. పొతంగల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ప్రత్యేక మహాజన సభ నిర్వహించారు. ప్రత్యేకాధికారి జియావుద్దీన్ రైతుల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. 10 ఎకరాల వరకు పెట్టుబడి సాయం అందించాలని, ప్రతి సీజన్లో జూన్, డిసెంబర్లో సాయం అందేలా చూడాలని కోరారు. సమావేశంలో సొసైటీ చైర్మన్ శాంతేశ్వర్ పటేల్, సీఈవో భరత్, ఏవో శ్రీనివాస్రావు, డైరెక్టర్లు, పాలకవర్గసభ్యులు పాల్గొన్నారు. సాలూరా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రైతుభరోసాపై రైతుల అభిప్రాయాలను సేకరించారు. చాలా మంది రైతులు ఎకరానికి బోనస్ రూ. 500తోపాటు భూమిని సాగు చేసే వారికే సాయం అందించాలని అన్నారు. నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని బోధన్ వ్యవసాయ అధికారి సంతోష్ నాయక్ తెలిపారు.