కామారెడ్డి/బోధన్, జూలై 2: ఆర్టీసీ బస్సులో ప్రయాణం సుఖం, సురక్షితం అంటూ అధికారులు ఒకవైపు ప్రకటిస్తున్నారు. మరోవైపు సమయపాలన ఉండదు. వేళకు సరిగ్గా బస్సులు రావు అన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నత విద్య కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వెళ్లే విద్యార్థులకు రవాణా కష్టాలు తప్పడం లేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలు గ్రామాలకు అసలు బస్సు సౌకర్యమే లేకపోవడంతో విద్యార్థులు కిలోమీటర్ల మేర నడవాల్సిన పరిస్థితి నెలకొన్నది. బస్సు సౌకర్యం ఉన్న గ్రామాలకు సైతం సమయానికి బస్సులు రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరో తరగతి నుంచి ఇంటర్, ఆపై చదువులు చదివే వాళ్లు మండల, జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. పాఠశాల సమయంలో బస్సులు తగినన్ని లేకపోవడం, వచ్చినా రద్దీ ఎక్కువగా ఉంటుండడంతో విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. ఫుట్బోర్డులపై ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంటున్నది. సమయానికి పాఠశాల, కళాశాలకు వెళ్లాలంటే ఈ ఫీట్లు తప్పవని విద్యార్థులు వాపోతున్నారు. గత్యంతరం లేక ఆటోలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంటున్నది.
పలు గ్రామాలకు బస్సు సర్వీసులను సైతం తగ్గించినట్లు తెలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకంతో బస్సులన్నీ రద్దీగా వస్తున్నాయని, దీంతో పాఠశాలకు వెళ్లే విద్యార్థులందరికీ ఇబ్బందులు ఎదురవుతున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. పాఠశాలలకు వెళ్లేందుకు కిలోమీటర్ల మేర విద్యార్థులు నడవాల్సిన పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
రెంజల్, జూలై 2 : రెంజల్ మండలం బాగేపల్లి, కునేపల్లి, కళ్యాపూర్,కిసాన్తండా గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. ఈ గ్రామాల విద్యార్థులు చదువుకునేందుకు రెంజల్ మండల కేంద్రానికి వెళ్లాల్సి ఉండగా ఆటోలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇదే మండలంలో తాడ్బిలోలి, కందకుర్తి రూట్లో కొన్ని సర్వీసులు నడుపుతున్నా అవి కాస్తా నిండిపోతుండడంతో విద్యార్థినులు బస్సు ఎక్కేందుకు కుస్తీ పడుతున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు లేక సాటాపూర్, తహసీల్ కార్యాలయ చౌరస్తాల వద్ద గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉన్నది.
కందకుర్తి రూట్లో బస్సు సర్వీసులను పెంచాలి. ఉదయం, సాయంత్రం మాత్రమే నడపడంతో ఉన్న ఆ బస్సులో సైతం మహిళలే నిండిపోతున్నారు. పాఠశాలకు వెళ్లేందుకు రోజూ బస్సులో నిలబడి వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నది. రోడ్డు బాగున్నా బస్సులు సరిగా నడపడం లేదు.
శక్కర్నగర్, జూలై 2: బోధన్ మున్సిపాలిటీలో విలీనమైన నర్సాపూర్ గ్రామానికి బస్సు సౌకర్యం లేక విద్యార్థులు పైచదువు కోసం కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి. సుమారు 200మంది విద్యార్థులు ఐదో తరగతి పూర్తి కాగానే పైచదువుల కోసం రెండు కిలోమీటర్ల దూరంలోని బోధన్, మూడు కిలోమీటర్ల దూరంలో ఎడపల్లి పాఠశాలలకు వెళ్తున్నారు. రహదారి బాగానే ఉన్నా… బస్సు సౌకర్యం లేదు.
బస్సును సడెన్గా రద్దు చేశారు. గ్రామంలో చాలా మంది విద్యార్థులం కాలినడకనే పాఠశాలకు వెళ్తున్నాం. మా గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలి. అది కూడా పాఠశాలల సమయానికే నడపాలి. మా గ్రామం నుంచి అక్కయ్యలు పాఠశాలలకు రావాలంటే ఇబ్బందిగా ఉన్నది.
వేల్పూర్, జూలై 2: వేల్పూర్ మండలంలోని అమీనాపూర్, వాడి, కొత్తపల్లి, సాహెబ్పేట్ గ్రామాలకు చెందిన విద్యార్థులు పైచదువులకు ఇతర గ్రామాలకు వెళ్లాల్సిందే. ఈ గ్రామాలన్నింటికీ బస్సు సౌకర్యం లేకపోవడంతో సుమారు రెండు, మూడు కిలోమీటర్ల దూరం నడవాల్సిన పరిస్థితి. బస్సు నడిచే ప్రాంతం గుండా వెళ్దామనుకున్నా.. ఆ బస్సులు సమయానికి రాకపోవడంతో గత్యంతరం లేక ఇలా లిఫ్ట్(ఇతరుల బైక్)ను ఆశ్రయించక తప్పదు.
నవీపేట, జూలై 2: నేను నవీపేట పాలిటెక్నిక్లో సివిల్ రెండో సంవత్సరం చదువుతున్నాను. ప్రతిరోజు నిజామాబాద్ నుంచి నవీపేటకు మా కాలేజీకి చెందిన 30మంది విద్యార్థులం ఆర్టీసీ బస్సులో వస్తాం. బస్సులు సమయానికి రాకపోవడంతో కాలేజీకి నిర్ణీత సమయానికి చేరుకోవడం లేదు. దీంతో తరగతులను మిస్సవుతున్నాం. కాలేజీ నుంచి ఇంటికి వెళ్లే టైములో కూడా బస్సులు లేక ఒక్కోసారి రాత్రి ఏడుగంటల వరకు బస్టాండ్లోనే ఉండాల్సి వస్తున్నది.
ఎల్లారెడ్డి, జూలై 2: ఎల్లారెడ్డి మండలంలోని చాలా గ్రామాల్లో విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు నాలుగు నుంచి ఆరు కిలోమీటర్ల వరకు ప్రతిరోజు నడక తప్పడం లేదు. సమయానికి బస్సులు రాకపోవడం.. వచ్చినా నిలపకపోవడంతో వందలాది మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. మండలంలోని మాచాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు శివ్వానగర్, దాల్మల్కపల్లి, రేపల్లె వాడ, మల్లయపల్లి గ్రామాల నుంచి విద్యార్థులు వెళ్తున్నారు. వీరికి ఎల్లారెడ్డి నుంచి మెదక్ వెళ్లే ఆర్టీసీ బస్సు సమయానికి రాకపోవడంతో కాలినడకన, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తున్నది.
బోధన్ రూరల్, జూలై 2: బోధన్ మండలంలోని ఖండ్గాం గ్రామానికి బస్సు సౌకర్యం ఉన్నా.. సమయానికి రాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాథమికోన్నత పాఠశాల అనంతరం పైచదువుల కోసం బోధన్, సాలూరాకు వెళ్లాల్సి వస్తున్నది. బస్సు సమయానికి రాకపోవడంతో సకాలంలో పాఠశాలకు చేరుకోలేక.. మొదటిక్లాసు మిస్సవుతున్నారు. బస్సును సకాలంలో నడపాలని కోరుతున్నారు.
గేటు వద్ద బస్సు ఆపకపోవడంతో సైకిల్ కొనుక్కున్నా. మూడేండ్లు నడుచుకుంటూనే బడికి వెళ్లాను. ఈ సంవత్సరం ఐదు వేలు పెట్టి సైకిల్ కొనుక్కున్నా. మేస్త్రీ పని చేసే మా నాన్న కష్టపడి సైకిల్ కొనిచ్చాడు. ఆర్టీసీ బస్సులు గేటు వద్ద ఆపితే మా ఊరి నుంచి 20మంది బస్సులో బడికి వెళ్లేందుకు సౌకర్యంగా ఉంటుంది.
బోధన్ ప్రాంతంలో గ్రామాల నుంచి పట్టణాలకు, మండల కేంద్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు వచ్చే విద్యార్థులకు సమయానికి రాని బస్సులు, చాలీచాలని బస్సు ట్రిప్లతో ఇబ్బందులు తప్పడం లేదు. డివిజన్లో బోధన్, నిజామాబాద్, బాన్సువాడ డిపోలు బస్సులను నడుపుతున్నాయి. నిజామాబాద్ నగరంలోని డిగ్రీ కళాశాలలు, ఇంజినీరింగ్ కళాశాలలకు బోధన్, ఇతర మండల కేంద్రాల నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున వెళ్తుంటారు. నిజామాబాద్ వెళ్లే బస్సులు రద్దీగా ఉంటున్నాయి. బస్సుల కోసం నిరీక్షించడంతో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు అంటున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికీ అనేక గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడం గమనార్హం. బోధన్ మండలంలోని తగ్గెల్లి, ఫత్తేపూర్, నర్సాపూర్ గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. గతంలో తగ్గెల్లికి, నర్సాపూర్లకు బస్సులు నడిపేవారు. ఎడపల్లి మండలంలోని జైతాపూర్, బ్రాహ్మణ్పల్లి, కోటగిరి మండలం రాంపూర్ తదితర గ్రామాలకు బస్సులు నడపడంలేదు. ఇదే విషయమై బోధన్ డిపో మేనేజర్ శ్రీనివాస్ను వివరణ కోరగా తమ డిపో పరిధిలో బస్సుల విషయంలో ఇబ్బందులు లేవని, సమయానికి అన్ని రూట్లలో బస్సులు నడుపుతున్నామని, సమస్య తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని తెలిపారు.