బోధన్/చందూర్/ మోర్తాడ్/ ఆర్మూర్టౌన్, జూన్ 30: చందూర్ మండలకేంద్రంలో మహాలక్ష్మి అమ్మవారికి బోనాల పండుగను గ్రామస్తులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని వివిధ కుల సంఘాలు బోనాలను డప్పువాయిద్యాల మధ్య ఊరేగించారు. అమ్మవారికి బోనాలు, నైవేద్యాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, గ్రామస్తులు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ ప్రతి ఏడాది పండుగ నిర్వహిస్తామని గ్రామపెద్దలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు అంబర్సింగ్, ఎంపీపీ లావణ్యా రాంరెడ్డి, వైస్ ఎంపీపీ దశాగౌడ్, మాజీ సర్పంచ్ సాయారెడ్డి, సొసైటీ చైర్మన్ ప్యారం అశోక్, సొసైటీ మాజీ చైర్మన్ మాధవరెడ్డి, గ్రామపెద్దలు పాల్గొన్నారు.
బోధన్ పట్టణంలో ఆదివారం పలు కుల సంఘాల ఆధ్వర్యంలో బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మున్నూరు కాపు సంఘం సభ్యులు ఇండ్ల నుంచి బోనాలతో పోస్టాఫీస్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి మహాలక్ష్మి మందిరానికి చేరుకున్నారు. గాండ్ల తేలికుల సంఘం, పద్మశాలీ సంఘం సభ్యులు నైవేద్యాలతో మహాలక్ష్మి ఆలయానికి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. వానలు సమృద్ధిగా కురవాలని గ్రామ దేవతలను వేడుకున్నారు. కార్యక్రమంలో ఆయా కుల సంఘాల పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
మోర్తాడ్, జూన్ 30: మోర్తాడ్ మండలం సుంకెట్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులు గంగాజలాలతో గ్రామదేవతలకు జలాభిషేకం నిర్వహించారు. గ్రామంలో గంగాజలాలు, వలగొడుగుతో ఊరేగింపుగా గ్రామదేవతల ఆలయాల వరకు వెళ్లి పూజలు నిర్వహించారు. గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మల్లేశ్, నవీన్, కులసంఘ పెద్దలు పాల్గొన్నారు.
కోటగిరి, జూన్ 30 : మండలకేంద్రంలోని ముదిరాజ్ సంఘాన్ని ఇటీవల నిర్మించారు. సంఘంలో ఆదివారం ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో ఆదివారం హోమం నిర్వహించారు. వేదపండితుడు రాజేశ్వర్ జోషి ఆధ్వర్యంలో హోమం, ప్రత్యేక పూజలు కొనసాగాయి. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు మాట్లాడుతూ.. ముదిరాజ్ల సంక్షేమానికి కృషిచేసిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సంఘ నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి రూ. 65 లక్షలు మంజూరు చేశారని తెలిపారు. శుభకార్యాలు, వివాహాలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో సాయిలు, గంగాధర్, గణేశ్, హన్మాండ్లు, రాజయ్య, కప్ప సంతోష్, ఎల్లప్ప, వీరేశం తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూర్టౌన్, జూన్ 30: ఆర్మూర్ పట్టణంలో సర్వసమాజ్ ఆధ్వర్యంలో ఊర పండుగ నిర్వహించారు. గ్రామదేవతలకు జలాభిషేకం నిర్వహించారు. సర్వసమాజ్ అధ్యక్షుడు ఆకుల రాజు తదితరులు పాల్గొన్నారు.