గాంధారి, జూన్ 27: అటవీ భూమి కనబడితే చాలు.. అందులో పాగా వేస్తున్నారు గాంధారి మండలంలోని పలు గ్రామాల ప్రజలు. అధికారుల నిర్లక్ష్యంతో విలువైన అటవీప్రాంతం మాయమైపోతున్నది. కనుమరుగవుతున్న అడవుల్లో తిరిగి చెట్లను పెంచడం కోసం కేసీఆర్ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి హరితహారంలో భాగంగా మొక్కలను నాటించినప్పటికీ.. అక్కడ పలువురు దున్ని భూమిని కబ్జా చేస్తున్నా ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. గాంధారి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో సుమారు 20వేల ఎకరాల అటవీ భూమి ఉన్నది. మండల కేంద్రంతోపాటు గ్రామాలను ఆనుకొని ఉన్న ఫారెస్టు భూములను యథేచ్ఛగా దున్ని ఆక్రమిస్తున్నా.. అధికారులు దానిని నియంత్రించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. మరోవైపు అధికారులు మామూళ్లు తీసుకుంటూ.. అటవీ భూముల్లో సాగుచేసుకునేందుకు ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి.
అటవీభూములను ఇష్టానుసారంగా దున్ని పంటలను సాగుచేస్తున్నారు. గాంధారితోపాటు అటవీప్రాంతాన్ని ఆనుకొని ఉన్న చద్మల్, నాగ్లూర్, నేరల్తండా, దుర్గం, సోమారంతండా, కొత్తాబాది తండా, జెమినీ తండా, చందానాయక్తండా, బీర్మల్, గుజ్జుల్, ముదెల్లి, గౌరారం, గండివేట్, సీతాయిపల్లి, చెన్నాపూర్, మేడిపల్లి, పొతంగల్, పేట్సంగెం, తిప్పారం, గొల్లాడితండా సమీపంలోని వందలాది ఎకరాల్లో అడవుల్లోని చెట్లను నరికివేశారు. ఆ ప్రాంతాన్ని దున్ని మక్కజొన్న, సోయా పంటలను సాగుచేస్తున్నారు. అధికారులు తూతూ మంత్రంగా దాడులు చేసి చేతులు దులుపుకొంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
గత ప్రభుత్వ పాలనలో హరితహారంలో భాగంగా అటవీశాఖ అధికారులు మండలంలోని ముదెల్లి, గౌరారం, బూర్గుల్, నాగ్లూర్ తదితర గ్రామాల్లోని అటవీభూముల్లో మొక్కలు నాటారు. ఆ మొక్కలు ప్రస్తుతం ఎక్కడా కనిపించడంలేదు. కారణం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి మొక్కలను సంరక్షించకపోవడమే. కోతుల ఆహార కొరతను తీర్చడం కోసం ఏర్పాటు చేసిన ఆహారశాలను సైతం ఆక్రమణదారులు వదలడం లేదు.
గాంధారి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని చద్మల్, నేరల్, నాగ్లూర్, యాచారం, దుర్గం అటవీప్రాంతాల్లో వేలాది ఎకరాల భూములు ఉన్నాయి. కొన్నేండ్లుగా అడవులను నరికి భూములను ఆక్రమిస్తున్నారు. తమ కుటుంబసభ్యుల బలం, తమ పలుకుబడిని ఉపయోగించి ఎంతంటే.. అంత అడవిని నరుకుతూ.. ఫారెస్ట్ భూమిని కబ్జా చేస్తున్నారు. పలు తండాల్లోని పెద్ద మనుషులు ఒక్కొక్కరు 50 నుంచి వంద ఎకరాల వరకు ఫారెస్ట్ భూమిని కబ్జా చేసి పంటలను సాగుచేస్తున్నట్లు సమాచారం. దీనికితోడు ప్రభుత్వం ఇచ్చిన పోడు భూముల పట్టాలను ఆసరాగా చేసుకొని కొత్తగా అటవీ భూముల్లో సాగుచేస్తున్నారు.
అటవీభూములను కబ్జా చేసి పంటలను సాగుచేస్తున్నా.. అటువైపు వెళ్లాలంటేనే అధికారులు జంకుతున్నారు. కారణం గతం లో అధికారులు వారి వద్ద నుంచి డబ్బులు తీసుకొన్నారనే ఆరోపణలు ఉన్నాయి. 15ఏండ్లుగా భూములను సాగుచేస్తున్న తమను ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారని పలువురు అధికారులపై తిరుగబడుతున్నారు. భూములను కబ్జా చేస్తున్న వారు ఎంతటికైనా తెగిస్తారనే భయంతో ఫారెస్ట్ అధికారులు అటువైపునకు వెళ్లడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
అటవీభూములను ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. గాంధారి రేంజ్ పరిధిలో 36వేల ఎకరాల అటవీ భూమి ఉండగా.. 2019 వరకు 18 వేల నుంచి 19 వేల ఎకరాల భూమి ఆక్రమణకు గురైంది. గాంధారి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో అటవీభూముల్లో పోడు వ్యవసాయం చేసుకుంటున్న వారికి 2010లో 900ఎకరాలకు సంబంధించి పట్టాలు ఇవ్వగా, 2023లో 4600 మందికి పట్టాలను ప్రభుత్వం అందజేసింది. అటవీభూమిని ఆక్రమిస్తున్న వారి వివరాలు సేకరించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.