కూనూర్ : ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ చేయడం మనం చూస్తుంటాం. కొన్ని ప్రాంతాల్లో బంగారం, వెండి బహుమతులు కూడా ఇస్తుంటారు. మరికొన్నిచోట్ల ఓటర్లను మచ్చిక చేసుకునేదుకు టీవీలు, స్మార్ట్ఫోన్లు ఇచ్చారు. అయితే, ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఓటర్లకు కావాల్సిన వస్తువులను చేరవేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. యువజన సంఘాలకు జిమ్ కిట్లు, స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేసి ఆకట్టుకునే ప్రయత్నం చేసినట్లే.. గిరిజనులకు వాళ్లు పెంచుకునే కోడిపిల్లల్ని కూడా పంచేందుకు సిద్ధమయ్యారు మన నేతలు.
తమిళనాడులో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో.. ఓటర్లను ప్రసన్నం చేసుకుని అధికారంలోకి రావాలని ఎవరికి వారే లెక్కలు వేసుకుంటూ పంపిణీ కార్యక్రమాలను ప్రారంభించారు. ఓ అభ్యర్థి ఒక అడుగు ముందుకేసి కూనూర్లో గిరిజనులు పెంచుకునే కోడిపిల్లలు పంచాలని అనుకున్నాడంట. ఇంకేం ఓ వ్యానులో 4,500 కోడిపిల్లల్ని తరలించే పని చేపట్టగా.. అపోజిషన్ వాళ్లు ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్కు ఉప్పందించారు. ఇంకేం ఆగమేఘాల మీద లఘించుకొని వచ్చిన అధికారులు.. వ్యానులో తరలింపునకు సిద్ధంగా ఉన్న కోడిపిల్లల్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని కూనూర్ సబ్ కలెక్టర్కు స్వాధీనపర్చారు. వీటిని సమీపంలోని మూడు గిరిజన గ్రామాల్లో పంపిణీ చేసేందుకు తీసుకెళ్తున్నట్లు పట్టుబడిన వారు ఒప్పుకోవడంతో సదరు అభ్యర్థిపై కేసు నమోదైంది. తమిళనాడులో ఒకే దశలో ఏప్రిల్ 6న ఎన్నికలు జరుగనున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం ఈ నెల 12 నుంచి మొదలవుతుంది. మే 2 న ఫలితాలు వెలువడతాయి.