భారతీయ న్యాయ(రెండవ) సంహిత-2023
బ్రిటిష్ కాలంనాటి చట్టాలకు కాలం చెల్లింది. దేశంలో పాత చట్టాలు భారతీయ శిక్షాస్మృతి (1880), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ (1872), క్రిమినల్ ప్రొసిజర్ కోడ్(1973) స్థానంలో కొత్త చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అనే కొత్త చట్టాలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త చట్టాలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పలు మార్పులు, చేర్పులు చేశారు. అవసరం లేని పదాలను తొలగించారు. పాత చట్టాలను ప్రక్షాళన చేశారు. కొత్త చట్టాల అమలుతో నిబంధనలు, సెక్షన్లు మారాయి. ఈ నేపథ్యంలో కొత్తగా మార్పులు చేసిన అంశాలు సంక్షిప్తంగా….
1834లో అప్పటి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం మొదటి లా కమిషన్ను ఏర్పాటు చేసింది. దీనికి చైర్మన్గా లార్డ్ థామస్ బాబింగ్టన్ మెకాలే వ్యవహరించారు. ఈ లా కమిషన్ ముఖ్య లక్ష్యం భారత్లో న్యాయపరిధి, అధికారం, అప్పట్లో పనిచేస్తున్న కోర్టుల నిబంధనలు, పోలీసు వ్యవస్థ, భారత్లో అమల్లో ఉన్న చట్టాలను పరిశీలించి అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వడం. ఈ కమిషన్ అప్పటి ప్రభుత్వానికి వివిధ చట్టాలపై సలహాలు, సూచనలు అందించింది. వీటిల్లో ముఖ్యమైంది ‘ఇండియన్ పీనల్ కోడ్’ (భారతీయ నేరన్యాయ చట్టం). దీన్ని బ్రిటిష్ ప్రభుత్వం 1860లో అమల్లోకి తెచ్చింది. అప్పటినుంచి ఎప్పటికప్పుడు అవసరమైన మార్పులు చేర్పులతో ఇప్పటివరకు ఇది మనదేశంలో అమలవుతుంది.
ప్రస్తుతం అమల్లో ఉన్న ఈ క్రిమినల్ చట్టాలను సమీక్షించి, వీటిల్లో అవసరమైన మార్పులు చేర్పులను చేయడం ద్వారా శాంతి భద్రతలను మరింత పటిష్టం చేయాలని, తద్వారా న్యాయ సంబంధ విధానాలను మరింత సరళీకృతం చేయాలని ఆ విధంగా చేసిన మార్పులు సామాన్యునికి సుఖమయ జీవితానికి హామీగా ఉండగలవని ప్రభుత్వం భావించింది. అంతేకాదు, అమల్లో ఉన్న చట్టాలు వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా, సామాన్యుడికి సత్వర న్యాయం అందించేవిగా ఉండాలని కూడా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో వర్తమాన అవసరాలు, ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని విభిన్న భాగస్వాములను సంప్రదించి, పౌరులే కేంద్రంగా వారికి భద్రమైన జీవితం స్వేచ్ఛకు విఘాతం కలగని రీతిలో చట్ట నిర్మాణం కొనసాగించడానికి ఉపక్రమించింది.
ఈ నేపథ్యంలో భారతీయ నేరన్యాయ చట్టం (ఇండియన్ పీనల్ కోడ్) స్థానంలో సరికొత్త చట్టాన్ని అమల్లోకి తేవాలని ప్రతిపాదించిన ప్రభుత్వం ఇందుకోసం నేరాలు, శిక్షలకు సంబంధించి నిబంధనలను క్రమబద్ధం చేయాలని నిర్ణయించింది. స్వల్ప నేరాలకు (పెట్టీ కేసులు) సామాజిక సేవను శిక్షగా విధించే నిబంధనను ఇందులో చేర్చాలని తొలిసారి ప్రతిపాదించడం ఈ క్రమబద్ధీకరణలో భాగమే. మహిళలు, పిల్లలు, హత్య, రాజ్య వ్యతిరేక నేరాలకు ఇందులో అధిక ప్రాధాన్యతనిచ్చింది. కొన్ని నేరాలను స్త్రీపురుషులనే తేడాలేకుండా సమానంగా పరిగణించింది. వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాద కార్యకలాపాలు, తీవ్రవాదానికి సంబంధించిన కొత్తతరహా నేరాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు నివారక శిక్షలను (deterrent punishments) అమల్లోకి తెచ్చింది. సాయుధ తిరుగుబాటు, విధ్వంసక, వేర్పాటువాద లేదా దేశ సార్వభౌమత్వం, ఐక్యతకు భంగం కలిగించే కార్యకలాపాలను కూడా ఈ చట్టంలో చేర్చారు. వివిధ రకాల నేరాలకు తగిన విధంగా జరిమానాలు, శిక్షలను పొడిగించారు. వీటన్నింటితో కూడిన బిల్లును ‘భారతీయ న్యాయ సంహిత2023’ పేరుతో లోక్సభలో 2023, ఆగస్టు 11న ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే దాన్ని ఉపసంహరించుకొని స్టాండింగ్ కమిటీ పరిశీలించి చేసిన కొన్ని సిఫారసులను ఇందులో చేర్చి భారతీయ న్యాయ(రెండవ)సంహిత2023 పేరుతో డిసెంబర్ 12న ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది. 2023, డిసెంబర్ 25న ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.సెక్షన్106(2)
మినహాయించి (నిర్లక్ష్యంగా వాహనాన్ని నడుపుతూ వ్యక్తి మరణానికి కారణం కావడం) భారతీయ న్యాయ సంహిత 2023లోని నిబంధనలు 2024, జులై 1నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది.
బిల్లులోని ముఖ్యాంశాలు
8 ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)లోని చాలా అంశాలను భారతీయ న్యాయ (రెండవ) సంహిత 2023లో కొనసాగించారు. ఇందులో సామాజిక సేవ అనే కొత్త శిక్షను చేర్చారు. రాజద్రోహం స్థానంలో దేశ సార్వ భౌమాధికారం, ఐక్యత, సమగ్రతలకు ప్రమాదం వాటిల్లజేసే నేరాలకు సంబంధించి చట్టాలను పొందుపరిచారు. బీఎన్ఎస్2 ఉగ్రవాదాన్ని నేరంగా పరిగణిస్తుంది. ఉగ్రవాదాన్ని దేశ సమగ్రత, భద్రత లేదా ఆర్థిక భద్రతకు, ఐక్యతకు భంగం కలిగించేదిగా నిర్వచించారు. ప్రజలపై జరిపే ఉగ్రదాడులను కూడా ఇందులో చేర్చారు. వ్యవస్థీకృత నేరాన్ని అపరాధంగా పరిగణిస్తారు. కిడ్నాప్, బలవంతపు వసూళ్లు, క్రైమ్ సిండికేట్ కోసం పాల్పడే సైబర్ నేరాలు ఈ వ్యవస్థీకృత నేరాల పరిధిలోకి వస్తాయి. వ్యవస్థీకృత స్వల్ప (పెట్టీ) నేరాలను అపరాధాలుగా బీఎన్ఎస్2లో అంతర్భాగం చేశారు. కులం, భాష లేదా వ్యక్తిగత గుర్తింపు కోసం ఐదుగురు లేక అంతకంటే ఎక్కువమంది హత్యకు పాల్పడితే అటువంటి వారికి జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధించవచ్చు.
విశ్లేషణ
8 నేరానికి సంబంధించి బాధ్యుడిని చేసే వయసును ఎప్పటిమాదిరిగానే ఏడేళ్లను కొనసాగించారు. అయితే నేరానికి పాల్పడిన బాలుడి మానసిక పరిపక్వతను బట్టి ఈ వయసును 12ఏళ్ల వరకు పెంచవచ్చు. ఇది అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించే అవకాశముంది. బాలుడు/బాలిక అంటే 18 సంవత్సరాల లోపు వయస్కులని బీఎన్ఎస్2 పరిగణిస్తుంది. అయితే అన్ని నేరాలకు ఈ వయస్సు వర్తించదు. అత్యాచారం లేదా సామూహిక అత్యాచారాలకు పాల్పడిన సంఘటనల్లో ఈ వయోపరిమితి భిన్నం. అనేక నేరాలు, ప్రత్యేక చట్టాల పాక్షిక ఆచ్ఛాదన కిందికి వెళ్లాయని చెప్పక తప్పదు. చాలా కేసుల్లో ఈ రెండురకాల నేరాలకు అనుసరించే విధివిధానాలు, విధించే శిక్షలు భిన్నంగా ఉండటం గమనార్హం. అత్యాచారం, లైంగిక వేధింపులకు సంబంధించి ఐ.పి.సి.చట్టంలో పేర్కొన్న నిబంధనలనే ఇందులో కొనసాగించారు. అయితే 2013లో జస్టిస్ వర్మ కమిటీ చేసిన సిఫారసులను పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం. అత్యాచారం విషయంలో కేవలం స్త్రీపురుషుల్లో ఒకరినే నేరస్థులుగా పరి గణించకూడదని ఈ కమిటీ సిఫారసు చేసింది. అంతేకాదు భార్య అంగీకారం లేకుండా భర్త లైంగికచర్యలో పాల్గొనడం కూడా నేరంగా పరిగణించాలని సిఫారసు చేసింది. ఈ రెండింటిని ప్రభుత్వం పట్టించుకోలేదు. బీఎన్ఎస్2, ఇండియన్ పీనల్కోడ్లోని సెక్షన్ 377ను (పురుషులపై అత్యాచారం, జంతువులతో సంభోగం అంశాలకు సంబంధించినది) విడిచిపెట్టింది.
బీఎన్ఎస్2లో తీసుకొచ్చిన మార్పులు
శరీరంపై దాడులు: హత్య, ఆత్మహత్యకు పురికొల్పడం, దాడిచేసి తీవ్రంగా గాయపరచడం వంటి వాటిని ఐ.పి.సి. నేరాలుగా పరిగణించింది. బీఎన్ఎస్2 వీటిని యధాతథంగా ఉంచింది. వీటికి అదనంగా వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదం, కొన్ని కారణాలచేత మూకదాడితో హత్యకు పాల్పడటంవంటివాటిని చేర్చింది.
రాజద్రోహం: బీఎన్ఎస్2 రాజద్రోహాన్ని నేరంగా పరిగణించదు. ఇందుకు బదులుగా మతాంతరీకరణకు పురికొల్పడం, సాయుధ తిరుగుబాటు, విద్రోహచర్యలు, వేర్పాటువాదాన్ని ప్రోత్సహించడం, దేశ సమగ్రత, ఐక్యత, సార్వభౌమాధికారానికి భంగం వాటిల్లజేయడం వంటివాటిని చేర్చారు. దేశభద్రతకు భంగం వాటిల్లచేయడానికి ఆర్థిక, ఎలక్ట్రానిక్ సమాచార వ్యవస్థను వినియోగించడం, ఇందుకు సంబంధించిన పదజాల ప్రయోగం చేస్తూ మాట్లాడటం వంటి అంశాలను కూడా నేరంగా పరిగణిస్తారు.
ఉగ్రవాదం: దేశ సార్వభౌమత్వం, భద్రత, ఐక్యతకు, ఆర్థిక భద్రతకు భంగం వాటిల్లజేసే కార్యకలాపాలను ఉగ్రవాద చర్యలుగా బిఎన్ఎస్2 పరిగణిస్తుంది. దేశంలోని ఒక వర్గం ప్రజలపై దాడులకు పాల్పడటం కూడా ఈ చట్టం కింద నేరంగానే పరిగణిస్తారు. ఇటువంటి చర్యలకు పాల్పడినప్పుడు వ్యక్తి మరణం సంభవిస్తే అందుకు కారణమైనవారికి జీవితఖైదు లేదా మరణశిక్ష, జరిమానా విధించవచ్చు. అదేవిధంగా కేసు తీవ్రతను బట్టి ఐదేళ్ల నుంచి జీవిత ఖైదు వరకు, జరిమానా విధించవచ్చు.
వ్యవస్థీకృత నేరాలు: కిడ్నాప్లు, బలవంతపు వసూళ్లు, కాంట్రాక్ట్ హత్యలకు పాల్పడటం, భూఆక్రమణలు, ఆర్థిక స్కామ్లు, క్రైమ్ సిండికేట్కు అనుకూలంగా సైబర్ నేరాలకు పాల్పడటం వంటివాటిని వ్యవస్థీకృత నేరాలుగా పరిగణిస్తారు. నేర తీవ్రతను బట్టి వీటికి శిక్షలు విధిస్తారు. ఈ కార్యకలాపాలు ఒక వ్యక్తి మరణానికి కారణమైతే రూ.10లక్షల వరకు జరిమానాతో పాటు మరణశిక్ష లేదా జీవితఖైదు విధించవచ్చు. నేరం అంతకంటే తక్కువస్థాయిలో ఉన్నప్పుడు ఐదేళ్ల నుంచి జీవితఖైదు వరకు శిక్షతో పాటు రూ.ఐదులక్షల జరిమానా విధించవచ్చు.
సామూహిక హత్యాకాండ: ఐదు లేక అంతకంటే ఎక్కువమంది వ్యక్తులు మతం, భాష, కులం లేదా వ్యక్తిగత నమ్మకాల వంటి కొన్ని ప్రత్యేక కారణాల నేపథ్యంలో జరిపిన దాడిలో మరణాలు లేదా తీవ్రంగా గాయపడటం సంభవించడాన్ని బీఎన్ఎస్2 నేరంగా పరిగణిస్తుంది. ఇందుకు శిక్ష జీవిత ఖైదు లేదా మరణశిక్ష.
సుప్రీంకోర్టు తీర్పులు: బీఎన్ఎస్2 కొన్ని సుప్రీంకోర్టు తీర్పులను సుస్థిరం చేసింది. వ్యభిచారాన్ని నేరంగా పరిగణించకపోవడం, జీవితఖైదీ హత్య లేదా హత్యాయత్నం చేసినప్పుడు అతనికి జీవిత ఖైదుకు అదనంగా మరణశిక్ష కూడా విధించేందుకు బిఎన్ఎస్2 వీలు కల్పిస్తుంది.
మహిళలపైలైంగిక నేరాలు
మహిళలపై లైంగిక నేరాలు
అత్యాచారం, ఎదుటివారి బాధలను చూసి ఆనందించే ప్రవృత్తి, వెంటపడి వేధించడం, మహిళ సచ్ఛీలతను శంకించడం వంటి ప్రవృత్తులను ఐ.పి.సి. నేరాలుగా పరిగణించింది. బీఎన్ఎస్2లో వీటిని యధాతథంగా కొనసాగించారు.వీటికి అదనంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసుల్లో 16-18 మధ్య వయస్కులైన బాలురను కూడా మేజర్గా పరిగణించే నిబంధనను చేర్చారు. తప్పుడు వాగ్దానాలు చేసి ఒక మహిళతో లైంగిక చర్యకు పాల్పడటాన్ని కూడా నేరంగా పరిగణిస్తారు.
ఇండియన్ పీనల్ కోడ్
భారత్లో ఇప్పటివరకు 1860లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించిన ఇండియన్ పీనల్ కోడ్ ప్రధాన నేర న్యాయ చట్టంగా కొనసాగుతూ వచ్చింది. ఇందులో పేర్కొన్న అంశాలు (ఎ) మానవ శరీరంపై దాడి, హత్య చేయడం (బి) ఆస్తుల దొంగతనం, బలత్కారంగా లాక్కోవడం (సి) చట్ట విరుద్ధంగా అల్లర్లకు పాల్పడటం (డి) ప్రజారోగ్యం, భద్రత, నైతికత, మర్యాద, మతం (ఇ) పరువునష్టం (ఎఫ్) రాజ్యానికి వ్యతిరేకంగా పాల్పడే నేరాలు. అప్పటినుంచి మనదేశంలో అవసరం వచ్చినప్పుడల్లా వీటికి కొత్త నేరాలను చేర్చడం, శిక్షల్లో మార్పులు చేయడం వంటి చర్యలను ప్రభుత్వాలు చేపడుతూ వచ్చాయి. ఐ.పి.సి.లో పేర్కొన్న కొన్ని నేరాలను, కోర్టులు తర్వాతికాలంలో నేరాలుగా పరిగణించలేదు. పరస్పర అంగీకారంతో స్వలింగ సంపర్కం, వ్యభిచారం, ఆత్మహత్యాయత్నం వంటివి ఇందుకు ఉదాహరణ. లైంగిక నేరాలు, చిన్నారులను బలవంతంగా వ్యభిచారంలోకి దించడం, మందులు, ఆహార కల్తీ, మతగ్రంథాలను అపవిత్రం చేయడం వంటి నేరాలకు తగిన శిక్షలు విధించేందుకు వీలుగా వివిధ రాష్ర్టాలు ఐ.పి.సి.లో చాలా సవరణలు చేశాయి.
మిగతా రేపటి నిపుణలో…
-జమలాపురపు
విఠల్రావు సీనియర్ జర్నలిస్ట్