న్యూఢిల్లీ: నీట్ యూజీ (NEET UG) రీటెస్ట్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. గ్రేస్ మార్కులు, పేపర్ లీక్ సమస్య వల్ల 1563 మంది అభ్యర్థులకు మరోసారి పరీక్ష నిర్వహించింది. తాజాగా వారికి ఫలితాలతోపాటు ర్యాంకులను ఎన్టీఏ ప్రకటించింది. రీటెస్ట్కు హాజరైన విద్యార్థులు ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ exams.nta.ac.in/NEET/ లో చూసుకోవచ్చు.
నీట్ యూజీ పరీక్షలో సమయం వృథా కారణంగా 1,563 మంది అభ్యర్థులకు గ్రేస్ మార్కులు కలిపారు. దానిని రద్దుచేసిన సుప్రీంకోర్టు గ్రేస్మార్కులను మినహాయించి తిరిగి పరీక్షను ఎంచుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ నేపథ్యంలో 1,563 మంది అభ్యర్థుల కోసం జూన్ 23న ఎన్టీఏ మరోసారి పరీక్ష నిర్వహించింది. దీనికి 813 మంది మాత్రమే హాజరయ్యారు. మిగిలిన 48 శాతం మంది అభ్యర్థులు గ్రేస్ మార్కులు మినహాయించి ఒరిజినల్ స్కోర్లను ఎంచుకున్నారు.
నీట్ యూజీ పరీక్ష దేశవ్యాప్తంగా మే 5న నిర్వహించారు. దీనికి 24 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. జూన్ 4న పరీక్ష ఫలితాలను ఎన్టీఏ ప్రకటించింది. అందులో 67 మంది విద్యార్థులు 720 మార్కులు సాధించారు. వారిలో ఆరుగురు హర్యానాలోని ఝజ్జర్ కేంద్రానికి చెందినవారే కావడం అనుమానాలకు తావిచ్చింది. పేపర్ లీకయ్యిందని, అందుకు ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఒకే ర్యాంకు సాధించారని దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనలకు దిగారు. దీంతో సమగ్ర దర్యాప్తు కోసం కేంద్ర విద్యాశాఖ ఈ కేసును సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్నది.