నేరానికి పాల్పడిన పిల్లలను తాము చేసిన నేరానికి బాధ్యులను చేయడానికి కనీస వయసును నిర్ధారించడమే దీని ప్రధాన ఉద్దేశం. చిన్నారుల ప్రవర్తనపై మెదడు ప్రభావం ఏవిధంగా ఉంటుందో తెలుసుకోవడానికి చేసిన అత్యాధునిక అధ్యయనాల నేపథ్యంలో, చిన్నారులను ఒక నేరానికి ఎంతవరకు బాధ్యులను చేయాలనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఐ.పి.సి. ప్రకారం ఏడేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు ఎటువంటి నేరాలకు పాల్పడినా వారిని నేరస్థులుగా పరిగణించబోరు. అయితే తాను చేసిన పనికి ప్రతిఫలం ఏవిధంగా ఉంటుందో తెలియని స్థితిలో నేరానికి పాల్పడితే అటువంటి పిల్లలకు 12ఏళ్ల వరకు శిక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. బీఎన్ఎస్2 ఈ నిబంధనలను కొనసాగించింది. 2007 లో ఐక్యరాజ్య సమితి ఈ నేర బాధ్యతను నిర్ధారించే వయస్సును 12 సంవత్సరాల కంటే మరింతగా పెంచాలని దేశాలను కోరింది. ప్రస్తుతం చాలా దేశాల్లో ఈ వయసు మనదేశంలో కంటే ఎక్కువ ఉండటం గమనార్హం. ఉదాహరణకు జర్మనీలో 14 సంవత్సరాలు, ఇంగ్లండ్, వేల్స్ల్లో 10 సంవత్సరాలు, స్కాట్లాండ్లో 12 సంవత్సరాలుగా ఉంది.
చిన్న పిల్లలపై నేరాలకు పాల్పడినవారికి కఠిన శిక్షలను బీఎన్ఎస్2 నిర్ణయించింది.కొన్ని కేసుల్లో మినహాయించి చాలావాటిల్లో 18 సంవత్సరాల వరకు మైనర్లుగా పరిగణిస్తారు. అత్యాచారం, సామూహిక అత్యాచారం, మైనర్లపై అత్యాచారం కేసుల్లో శిక్షలు భిన్నంగా ఉంటాయి. అత్యాచార కేసుల్లో శిక్ష విధించడంలో 18 ఏళ్ల వయస్సు ప్రాధాన్యం వహిస్తుంది. సామూహిక అత్యాచార కేసుల్లో బాధితులు 18 ఏళ్ల వయస్సు లోపు లేదా ఎక్కువ ఉన్నప్పుడు విధించే శిక్షలు భిన్నంగా ఉంటాయి. బాధితుల వయస్సు 12ఏళ్ల లోపు ఉన్నప్పుడు విధించే శిక్షకు, 12-16 మధ్య వయస్సు లేదా అంతకంటే ఎక్కువ వయస్సున్నవారైతే విధించే శిక్షకు తేడా వుంటుంది. లైంగిక నేరాల నుంచి చిన్నపిల్లల రక్షణ చట్టం – 2012కు దీనికి ఎటువంటి సంబంధం లేదు.ఈ చట్టం 18 ఏళ్ల లోపు వయస్కులను మైనర్లుగా పేర్కొంటున్నది.
చిన్నపిల్లలపై జరిగే కొన్ని నేరాల విషయంలో 18 సంవత్సరాలను బీఎన్ఎస్2 పరిగణలోకి తీసుకోదు. అంటే తల్లిదండ్రులనుంచి డబ్బులు వసూలు చేయడం కోసం కిడ్నాప్కు గురైన బాలుడు/బాలిక పదేళ్లలోపు వయస్కులైనప్పుడు మాత్రమే వారిని పిల్లలుగా పరిగణిస్తారు. 11 సంవత్సరాల బాలుడు కిడ్నాప్ అయితే అతడిని పెద్దవాడిగానే బీఎన్ఎస్2 గుర్తిస్తుంది. అదేవిధంగా విదేశాల నుంచి మహిళను దిగుమతి చేసుకున్నప్పుడు ఆమె వయస్సు 21 సంవత్సరాలు దాటితే నేరంగా పరిగణిస్తారు. అదే బాలుర విషయంలో ఈ వయసు 18 సంవత్సరాలు!
ఇండియన్ పీనల్ కోడ్ను రూపొందించినప్పుడు అప్పటికి అన్నిరకాల నేరాలను ఇందులో చేర్చారు. కాలానుగుణంగా కొన్ని ప్రత్యేక అంశాలకు సంబంధించిన నేరాలను, వాటికి విధించాల్సిన శిక్షలను ఇందులో పొందు పరుస్తూ వచ్చారు.
అటువంటి నేరాలను బీఎన్ఎస్2లో తొలగించారు. ఉదాహరణకు మెట్రాలజీ యాక్ట్ – 2009 కింద తూనికలు, కొలతలకు సంబంధించి ఐ.పి.సి.లో
పొందుపరచిన నేరాలను బీఎన్ఎస్2లో తీసివే శారు. అయితే ఆవిధంగా చేర్చిన నేరాల్లో చాలా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వీటికితోడు బీఎన్ఎస్2లో వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదం వంటి నేరాలను కూడా ఇందులో చేర్చారు. ఇప్పటికే ఇవి ప్రత్యేక చట్టాలకింద పొందుపరచి ఉండటంతో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం వుంది. ముఖ్యంగా ఒకే నేరానికి చట్టంలోని వేర్వేరు చట్టాల కింద వివిధ శిక్షలు పేర్కొని ఉండటం ఇందుకు ప్రధాన కారణం. అటువంటి నేరాలను తొలగించడం ద్వారా డూప్లికేషన్ (ద్విగుణనం)ను నివారించవచ్చు.
ఐ.పి.సి.లో వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదం అనే అంశాలను చేర్చలేదు. ఉగ్రవాదాన్ని చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం-1967 (యు.ఎ.పి.ఎ)లో పొందుపరిచారు. వ్యవస్థీకృత నేరాలు, రాష్ట్ర పరిధి నేరాల్లో చేర్చారు. మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నిరోధక చట్టం 1999 (ఎం.సి.ఒ.సి.ఎ) ఇందుకు ఉదాహరణ. సరిగ్గా ఇటువంటి చట్టాలనే గుజరాత్, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, కర్ణాటక రాష్ర్టాలు కూడా రూపొందించి అమలు చేస్తున్నాయి. అయితే వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదాన్ని బీఎన్ఎస్2లో చేర్చడం తాజా పరిణామం. బీఎన్ఎస్2లో ఉగ్రవాదానికి సంబంధించిన నిబంధన అచ్చంగా యు.ఎ.పి.ఎ.లో మాదిరిగానే ఉంది. ఇప్పుడు వ్యవస్థీకృత నేరాలను బీఎన్ఎస్2లో చేర్చడం ద్వారా, అన్ని రాష్ర్టాలకు వీటిని వర్తింపజేయడానికి వెసులుబాటు కలిగింది. ఎందుకంటే ఈ నేరాలకు సంబంధించి చాలా రాష్ర్టాలు ఏవిధమైన ప్రత్యేక చట్టాలను రూపొందించలేదు. అయితే ప్రత్యేక చట్టాల కింద ఈ నేరాలను అమలు పరుస్తున్న రాష్ర్టాల్లో వ్యవస్థీకత నేరాలు
డూప్లికేషన్కు గురయ్యే పరిస్థితి ఏర్పడింది.
కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 స్థానంలో ప్రవేశ పెట్టిన భారతీయ నాగరిక్ (రెండవ) సురక్ష
సంహిత 2023, భారతీయ సాక్ష్య (రెండవ) 2023 బిల్లుల్లో ఇటువంటి నేరాలకు (వ్యవస్థీకృత, ఉగ్రవాదం) ప్రత్యేకమైన విధి విధానాలు రూపొందించలేదు. వ్యవస్థీకృత, ఉగ్రవాదంపై రూపొందించిన ప్రత్యేక చట్టాల్లో పేర్కొన్న నిబంధనలకు, సాధారణంగా చేపట్టే నేర ప్రక్రియకు సాన్నిహిత్యం లేకపోవడం గమనార్హం. ఎందుకంటే బెయిల్ మంజూరుకు నిబంధనలను, నేరాన్ని నిందితులు అంగీకరించారంటూ పోలీసులు దాఖలు చేసే అంశాల్లోని అంగీకారయోగ్యతను ప్రశ్నించే వెసులుబాటును ప్రత్యేక చట్టాల్లో తొలగించారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాక్ట్-2009 కింద యు.ఎ.పి.ఎ. కేసులను విచారిస్తున్నారు. ఈ కేసులను ప్రత్యేక కోర్టులు విచారిస్తాయి. బీఎన్ఎస్2 ఉగ్రవాద కేసులను విచారించడానికి సెషన్స్ కోర్టులకు అనుమతినిస్తుంది. దీనివల్ల ఒకే నేరానికి సంబంధించిన కేసుల్లో దర్యాప్తు, విచారణ ప్రక్రియలు భిన్నంగా ఉండటం కొన్ని సమస్యలకు తావిచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఇటువంటి వ్యవస్థీకృత నేరాలకు ఒక ప్రత్యేక క్రిమినల్ ప్రొసీజర్ను భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023లో పొందుపరచాలని స్టాండింగ్ కమిటీ ఆన్ హోమ్ అఫైర్స్-2023 సిఫారసు చేయడం గమనార్హం.
బీఎన్ఎస్2లో వ్యవస్థీకృత స్వల్ప నేరాల (పెట్టీ క్రైమ్)ను చేర్చారు. వాహనాల దొంగతనం, జేబులు కొట్టడం, ప్రశ్నాపత్రాలు అమ్ముకోవడం వంటి నేరాలు దీని పరిధిలోకి వస్తాయి. ఒక గ్యాంగ్ చేసిన స్వల్ప నేరాన్ని వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తారు. నేరం రుజువైతే ఏడాది నుంచి ఏడేళ్ల జైలుశిక్ష జరిమానా విధించవచ్చు. ఇదే నేరానికి ఒక వ్యక్తి పాల్పడినట్లయితే శిక్ష భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు దొంగతనానికి ఒక వ్యక్తి పాల్పడితే మూడేళ్ల వరకు జైలుశిక్ష విధించవచ్చు. ఇదే నేరాన్ని ఒక గ్యాంగ్ చేసినట్లయితే ఏడాదినుంచి ఏడేళ్ల వరకు శిక్షపడుతుంది.
నేర న్యాయ చట్టాల్లో మార్పుల సిఫారసులకు ఏర్పాటైన కమిటీలు
ఇదిలావుండగా పోలీసులు తనిఖీలు, స్వాధీనం వంటి చర్యలు తీసుకున్నప్పుడు వీడియో తీయడం తప్పనిసరి. ఇక ఏడేళ్లు అంతకంటే ఎక్కువ శిక్షార్హమైన నేరాల్లో ఫోరెన్సిక్ను తప్పనిసరి చేయడం మరో పరిణామం.
ఈ సందర్భంగా వీడియోగ్రఫీని తప్పనిసరి చేసింది. కేసును విచారించి, తీర్పు చెప్పడానికి నియమిత కాల వ్యవధిని బీఎన్ఎస్2 నిర్దేశించింది.
8 వర్తమాన కాలానికి అనుగుణంగా ప్రభుత్వం తీసుకొచ్చిన బీఎన్ఎస్2 ప్రజల సుఖశాంతులు, సామాజిక భద్రత, దేశసమైక్యత, సమగ్రతలను పరిరక్షించే లక్ష్యమే పరమావధిగా వుండటంతో, ప్రజలకు న్యాయవ్యవస్థ మరింత చేరువయ్యేందుకు వీలుకలుగుతుందని భావించవచ్చు.
ఎస్ఎస్సీ- సీజీఎల్ -2024
కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (సీజీఎల్)ఎగ్జామ్-2024
నోటిఫికేషన్ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) విడుదల చేసింది.
-జమలాపురపు విఠల్రావు
సీనియర్ జర్నలిస్ట్