సాక్ష్యాలకు సంబంధించి చట్టాన్ని ఏకీకృతం చేసే సంకల్పంతో 1872లో అప్పటి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 పేరుతో ఒక చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం 1872, సెప్టెంబర్ 1నుంచి అమల్లోకి వచ్చింది.
నాటి ప్రముఖ బ్రిటిష్ లాయర్, జడ్జి, రచయిత, తత్వవేత్త సర్ జేమ్స్ ఫిడ్జ్జేమ్ స్టీఫెన్ చేసిన కృషి ఆధారంగా ఈ ఎవిడెన్స్ యాక్ట్ రూపుదిద్దుకుంది. సాక్ష్యాల ఆధారంగా చట్టాన్ని సుసంఘటితం చేయడం వల్ల ఒక కేసుకు సంబంధించిన వాస్తవాలపై కోర్టులు ఒక నిర్దిష్ట అవగాహనకు వచ్చి తీర్పు చెప్పడానికి వీలు కలుగుతుందనేది దీన్ని అమల్లోకి తేవడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.
భారత ప్రజాస్వామ్యంలో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్తో సహా నేరన్యాయ చట్టాలను (క్రిమినల్ లా) సమగ్రంగా సమీక్షించి వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా రూపుదిద్దాలన్న డిమాండ్ స్వాతంత్య్రం వచ్చిన దగ్గరి నుంచి కొనసాగుతూనే ఉంది. నిజానికి లా ఆఫ్ ఎవిడెన్స్ (సాక్ష్యాలకు సంబంధించిన చట్టం) దృఢమైన విధానపరమైన చట్టం కాదు. ఇది ‘విశేషణ చట్టం’ (adjective law) విభాగం కిందికి వస్తుంది. ఇది అర్జీ లేదా మనవి (కోర్టులో) చేసుకునే ప్రక్రియను నిర్వచిస్తుంది. దీని ద్వారానే విధానపరమైన చట్టాలు క్రియాత్మకమవుతాయి. అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలు గత ఐదు దశాబ్దాలుగా దేశం సాధించిన సాంకేతిక ప్రగతికి అనుగుణంగా లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇతర విషయాలకు సంబంధించి ఈ నూతన చట్టం కింది అంశాలను విశదీకరించింది.
1. ఇది ఎలక్ట్రానిక్ రూపంలో సాక్ష్యాన్ని అందించే వెసులుబాటు కల్పిస్తుంది. దీనికి అనువుగా సాక్షులు, నిందితులు, నిపుణులు, బాధితులు తమవద్ద ఉన్న ఎలక్ట్రానిక్ రూపంలోని సాక్ష్యాలతో కోర్టులో ప్రవేశించవచ్చు.
2. కోర్టుకు సమర్పించే డాక్యుమెంట్ల మాదిరిగానే, ఎలక్ట్రానిక్ లేదా డిజిటల్ రికార్డులను అనుమతించడానికి వీలు కల్పించింది.
3. ఇది అనుబంధ సాక్ష్యాల పరిమితిని మరింతగా విస్తరింపజేసింది.
4. అనుమతించదగిన వాస్తవాలకు వాటికి సంబంధించిసర్టిఫికేషన్కు కొన్ని పరిమితులుండాలని ఇది కోరుతున్నది. ప్రవేశపెట్టిన ప్రతిపాదిత బిల్లు మరింత కచ్చితంగా ఉండాలని, ఒక కేసుకు సంబంధించిన వాస్తవాలు, పరిస్థితులను సాక్ష్యాల రూపంలో అంచనా వేయడానికి ఏకీకృత నిబంధనలు అవసరమని ఈ చట్టం పేర్కొంటున్నది.
ఆమోదయోగ్య సాక్ష్యం: న్యాయ వ్యవహారాల్లో భాగస్వాములుగా ఉన్న పార్టీలు మాత్రమే ఆమోదయోగ్య సాక్ష్యాన్ని ఇవ్వగలవు. ఆమోదయోగ్య సాక్ష్యాన్ని రెండు రకాలుగా వర్గీకరించారు. మొదటిది ‘వాస్తవిక అంశాలు’, రెండవది ‘సంగత సత్యాలు’. న్యాయ వ్యవహారంలో ఉనికి, స్వభావం, ఏదైనా హక్కు పరిధి, పాత్ర, దావా అనర్హత లేదా నిరాకృతత్వాలను నిర్ణయించేది వాస్తవిక అంశాలు మాత్రమే. సంగత సత్యాలంటే కేసుకు సంబంధించినవై ఉంటాయి. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ రెండు రకాల సాక్ష్యాలను పేర్కొంది. ఒకటి డాక్యుమెంట్ల రూపంలో సమర్పించేది కాగా రెండవది మౌఖికంగా చెప్పేది.
నిరూపిత వాస్తవం: సమర్పించిన సాక్ష్యాన్ని బట్టి ‘నిజం’ ఉన్నదని లేదా కేసు ఉన్న పరిస్థితుల్లో ఒక వివేకవంతుడైన వ్యక్తి ‘నిజం’ ఉన్నదని భావించినప్పుడు ఏవిధంగా వ్యవహరిస్తాడనేది విశ్వాసంలోకి తీసుకున్నప్పుడు కోర్టు నిరూపిత వాస్తవంగా పరిగణించవచ్చు.
పోలీసులు సమర్పించే నేరాంగీకార వాంగ్మూలాలు: ఒక పోలీసు అధికారి ఎదుట నేరాన్ని ఒప్పుకోవడం, పోలీసు కస్టడీలో నేరాంగీకారాన్ని స్వీకారయోగ్యమైనవిగా పరిగణించరు. అయితే వీటిని ఒక మేజిస్ట్రేట్ రికార్డు చేసినట్లయితే అర్హమైనవిగా పరిగణిస్తారు. నిందితుడు పోలీసు కస్టడీలో వెల్లడించిన సమాచారం ఆధారంగా ఒక నిజాన్ని వెలికితీయగలిగినప్పుడు, సదరు సమాచారాన్ని అంగీకారయోగ్యమైనదిగా పరిగణించవచ్చు. అయితే ఆ సమాచారం కనుగొన్న నిజానికి మాత్రమే సంబంధించినదై ఉండాలి.
డాక్యుమెంట్ల రూపంలో సాక్ష్యాలు: ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ రాత ప్రతులు, మ్యాప్లు, క్యారికేచర్లను డాక్యుమెంటరీ సాక్ష్యాలుగా పరిగణించింది. అయితే బీఎస్బీ2 ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను కూడా డాక్యుమెంటరీ సాక్ష్యంగా చేర్చింది. నిజప్రతి (ఒరిజినల్ డాక్యుమెంట్) అందులో భాగాలుగా ఉన్న ఎలక్ట్రానిక్ రికార్డులు, వీడియో రికార్డులను ప్రాథమిక సాక్ష్యాలుగా పరిగణిస్తారు. ద్వితీయ ప్రాధాన్య సాక్ష్యాలుగా డాక్యుమెంట్లు, మౌఖిక సాక్ష్యాలను పరిగణిస్తారు. అయితే ఇవి నిజప్రతిలో ఉన్న అంశాలేనని నిరూపించాలి. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో పేర్కొన్న ఈ వర్గీకరణను బీఎస్బీ2 కొనసాగించింది.
మౌఖిక సాక్ష్యం: ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం, కేసు విచారణ సందర్భంగా కోర్టులో మౌఖికంగా వెల్లడించే అంశాలను మౌఖిక సాక్ష్యంగా పరిగణిస్తారు. బిఎస్బి2 ఈ మౌఖిక సాక్ష్యాన్ని ఎలక్ట్రానిక్ రూపంలో ఇవ్వడానికి అనుమతిస్తుంది. దీని ప్రకారం సాక్షులు, నిందితులు, బాధితులు ఎలక్ట్రానిక్ సాధనాల ద్వారా తమ సాక్ష్యాలను చెప్పవచ్చు.
ఎలక్ట్రానిక్ లేదా డిజిటల్ సాక్ష్యాల స్వీకారయోగ్యత: కంప్యూటర్లలో ఆప్టికల్ లేదా మ్యాగ్నటిక్ మీడియా రూపంలో నిక్షిప్తమైన లేదా ప్రచురించిన సమాచారాన్ని డాక్యుమెంటరీ సాక్ష్యంగా పరిగణిస్తారు. అటువంటి సమాచారాన్ని కొన్ని కంప్యూటర్లలో నిక్షిప్తం చేయవచ్చు. ఎలక్ట్రానిక్, డిజిటల్ రికార్డులకు, పేపర్ రికార్డులతో సమాన ప్రాధాన్యతను బీఎస్బీ2 కల్పిస్తోంది. సెమీకండక్టర్ మెమరీ లేదా స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్ల వంటి కమ్యూనికేషన్ ఉపకరణాల్లో నిక్షిప్తమైన సమాచారాన్ని కూడా ఎలక్ట్రానిక్ రికార్డులుగా బీఎస్బీ2 పరిగణిస్తుంది. ఈమెయిల్స్, సర్వర్ లాగ్స్, స్మార్ట్ ఫోన్స్, లొకేషనల్ ఎవిడెన్స్ మరియు వాయిస్ మెయిల్స్ కూడా ఎలక్ట్రానిక్ రికార్డుల పరిధిలోకే వస్తాయి.
ద్వితీయ ప్రాధాన్య సాక్ష్యం: లిఖితపూర్వక, మౌఖిక అంగీకారాలను, డాక్యుమెంట్లను పరిశీలించే నైపుణ్యమున్న వ్యక్తి డాక్యుమెంట్ను పరిశీలించిన తర్వాత ఇచ్చే సాక్ష్యాన్నిబీఎస్బీ2 ద్వితీయ ప్రాధాన్య సాక్ష్యంగా పరిగణిస్తుంది.
ఉమ్మడి విచారణ: ఒకే నేరానికి సంబంధించి ఒకరికంటే ఎక్కువ మంది వ్యక్తులను విచారిస్తే దాన్ని ఉమ్మడి విచారణ అంటారు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఒక కేసుకు సంబంధించి ఉమ్మడి విచారణ సందర్భంగా ఒక నిందితుడు నేరాన్ని అంగీకరించినప్పుడు, మరో నిందితుడిపై దీని ప్రభావం రుజువైతే, ఇద్దరూ నేరాన్ని అంగీకరించినట్టుగా పరిగణిస్తారు. బీఎస్బీ2 ఈ నిబంధనను మరింత విస్తృతంగా వివరించింది. ఒక కేసుకు సంబంధించి కొంతమంది నిందితులను విచారించినప్పుడు, వారిలో ఒక నిందితుడు పరారీలో ఉన్నా, అరెస్ట్ వారెంట్కు స్పందించకపోయినా అతడు కూడా ఈ ఉమ్మడి విచారణలో భాగంగానే పరిగణించాలని బీఎస్బీ2 స్పష్టం చేసింది.
మిగతా రేపటి నిపుణలో..
– జమలాపురపు విఠల్రావు
సీనియర్ జర్నలిస్ట్