భారతీయ నాగరిక్ సురక్షా (రెండవ) సంహిత (ఇండియన్ సివిల్ ప్రొటెక్షన్ కోడ్) జూలై 1నుంచి అమల్లోకి రానున్నది. 2023, ఆగస్టు 11న కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టారు. దీన్ని డిసెంబర్ 23న ఉపసంహరించుకొని, స్టాండింగ్ కమిటీ పరిశీలించి చేసిన కొన్ని సిఫారసులను ఇందులో చేర్చి భారతీయ నాగరిక్ సురక్ష (రెండవ) సంహిత 2023 పేరుతో డిసెంబర్ 12న లోక్సభలో కేంద్రం ప్రవేశపెట్టింది. డిసెంబర్ 20న లోక్సభ, 21న రాజ్యసభ ఈ బిల్లుకు ఆమోదం తెలుపగా డిసెంబర్ 25న రాష్ట్రపతి దీనికి
ఆమోదముద్ర వేశారు.
వేగంతోపాటు సమర్థవంతంగా పనిచేసే న్యాయవ్యవస్థ ఉత్తమ పరిపాలనలో భాగం. సంక్లిష్టమైన లీగల్ ప్రక్రియల కారణంగా నేడు కోర్టుల్లో క్రిమినల్ కేసులు పెద్దసంఖ్యలో పెండింగ్లో ఉంటున్నాయి. కేసుల్లో దోష నిర్ధారణ చాలా తక్కువ స్థాయిలో ఉండటం, లీగల్ వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానాన్ని తగినంతగా వినియోగించకపోవడం, దర్యాప్తులో విపరీత జాప్యం, ఫోరెన్సిక్ను అవసరమైన రీతిలో ఉపయోగించకపోవడం వంటివి సత్వర న్యాయ నిర్ణయానికి పెద్ద అడ్డంకులుగా మారాయి. వీటివల్ల నిరుపేదల జీవితాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇటువంటి సమస్యల పరిష్కారానికి పౌరులే కేంద్రంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కొనసాగించడం తక్షణావసరం. ‘సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్’ మంత్రంతో ముందుకు సాగుతున్న కేంద్ర ప్రభుత్వం ప్రతి పౌరుడికి సత్వర న్యాయం అందించడానికి కృతనిశ్చయంతో ఉన్న నేపథ్యంలో క్రిమినల్ చట్టాల ఫ్రేమ్వర్కును సమగ్రంగా సమీక్షించి, అందరికి అందుబాటులో వుండే, సత్వర న్యాయాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం 1973 నాటి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష (రెండవ) సంహిత (ఇండియన్ సివిల్ ప్రొటెక్షన్ కోడ్) పేరుతో కొత్త చట్టాన్ని తీసుకు వచ్చింది.
ఇండియన్ పీనల్ కోడ్, మరే ఇతర క్రిమినల్ నేరాలకు సంబంధించిన చట్టాల పరిధి కిందికి వచ్చే కేసుల్లో నిందితుడి అరెస్ట్, దర్యాప్తు, పరిశోధన, నేర విచారణ విధానాలను కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్1973 నియంత్రిస్తుంది. క్రిమినల్ కేసుల్లో విచారణ జరపడానికి అవసరమైన యంత్రాంగాన్ని ఈ కోడ్ సమకూరుస్తుంది. ఫిర్యాదు నమోదు, విచారణ జరపడం, ఆదేశాలు జారీ చేయడం, ఈ ఆదేశాలకు వ్యతిరేకంగా అప్పీలును దాఖలు చేయడం వంటి ప్రక్రియలకు అవసరమైన విధానాలు ఈ కోడ్లో పొందుపరిచి ఉన్నాయి. ఇదిలా ఉండగా నేరంపై దర్యాప్తు, సమాచారాన్ని సేకరించి సమర్పించడం, సమన్లు జారీ చేయడం వంటి అంశాల్లో సాంకేతికత, ఫోరెన్సిక్ సైన్సును వినియోగించడానికి నూతన చట్టం వెసులుబాటు కల్పిస్తుంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ సమాచార సదుపాయాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు. దర్యాప్తునకు, విచారణకు, తీర్పు చెప్పడానికి నియమిత కాలాన్ని నిర్దేశించడం బీఎన్ఎస్ఎస్2లోని ప్రత్యేకత. బాధితులకు ఎఫ్.ఐ.ఆర్. కాపీని అందజేయడం, దర్యాప్తులో ప్రగతిని డిజిటల్ మాధ్యమం ద్వారా ఎప్పటికప్పుడు వారికి తెలియజేయాలని ఈ చట్టం నిర్దేశిస్తున్నది. ఏడు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడే కేసుల్లో ప్రభుత్వం కేసును ఉపసంహరించుకునే ముందు, బాధితులకు దీని గురించి వినే అవకాశాన్ని కల్పించడాన్ని ఈ చట్టం తప్పనిసరి చేసింది. పెట్టీ తక్కువ తీవ్రత కలిగిన కేసుల్లో శీఘ్ర విచారణ జరపాలని బీఎన్ఎస్ఎస్2 స్పష్టం చేస్తున్నది. నిందితుడిని వీడియో కాన్ఫరెన్స్ వంటి ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా విచారించవచ్చు. ఇందుకు అనుగుణంగా మెజిస్టీరియల్ లైన్ను కూడా క్రమబద్ధీకరించారు.
ముఖ్యంగా ఏడేళ్లు అంతకంటే ఎక్కువ శిక్ష పడే కేసుల్లో బీఎన్ఎస్ఎస్2 ఫోరెన్సిక్ విచారణను నిర్దేశిస్తుంది. ఇటువంటి కేసుల్లో ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనా స్థలానికి వచ్చి, ఫోరెన్సిక్ సాక్ష్యాలను సేకరించి వివరాలు నమోదు చేయాలి. అన్ని రకాల విచారణలు, దర్యాప్తులు, న్యాయ ప్రక్రియలు ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే కొనసాగించాలి. డిజిటల్ సాక్ష్యాలను కలిగివుండే ఎలక్ట్రానిక్ సమాచార పరికరాలను దర్యాప్తు, విచారణలో అనుమతిస్తారు. ఒకవేళ నేరస్థుడు విచారణను తప్పించుకోవడానికి పారిపోయి ఇప్పట్లో అరెస్ట్ సాధ్యం కాకపోతే అతని పరోక్షంలోనే విచారణ కొనసాగించేందుకు ఈ నూతన చట్టం అనుమతిస్తుంది. దర్యాప్తు, న్యాయప్రక్రియల్లో, మాదిరి సంతకాలు (స్పెసిమెన్ సిగ్నేచర్లు), వేలి ముద్రలు, కంఠస్వర నమూనాలను సేకరించవచ్చు. ఇంకా అరెస్ట్ చేయని వ్యక్తి నుంచి కూడా పై నమూనాలను సేకరించవచ్చు.
బీఎన్ఎస్ఎస్2, పదిహేను రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తుంది. మొత్తం 60 నుంచి 90 రోజుల వరకు విధించే జ్యుడీషియల్ కస్టడీలో తొలి 40 నుంచి 60 రోజుల కాలంలో పోలీసు కస్టడీని పదిహేను రోజుల పాటు విడతలుగా విధించవచ్చు. ఈ మొత్తం కాలంలో ఒకవేళ పోలీసులు తమ కస్టడీ కాలాన్ని ముగించకపోతే నిందితుడికి బెయిల్ లభించే అవకాశం ఉండదు. నేర కార్యకలాపాల ద్వారా సంపాదించిన ఆస్తిని జప్తు చేసే అధికారాలకు, మనీలాండరింగ్ నిరోధక చట్టంలో పేర్కొన్న రక్షణలు ఏవీ ఉండవు. ఒక కేసులో అరెస్టయిన నిందితుడు, ఆ నేరానికి విధించే శిక్షలో సగానికంటే ఎక్కువకాలం నిర్బంధంలో గడిపితే, అతనికి బెయిల్ ఇవ్వడానికి సి.ఆర్.పి.సి. అనుమతిస్తుంది. అయితే ఎక్కువ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడికి బీఎన్ఎస్ఎస్2 బెయిల్ అనుమతించదు. వివిధ కేసులు, వేర్వేరు సెక్షన్ల కింద నమోదై ఉండటం వల్ల బెయిల్ ఇచ్చే పరిధి కుచించుకు పోతుంది. వ్యవస్థీకృత నేరాలు, సుప్రీంకోర్టు ఆదే శాలను ధిక్కరించిన కేసుల్లో నిందితులకు బేడీలు వేయడానికి ఈ చట్టం అనుమతిస్తుంది. ప్రజల భద్రతకు సంబంధించి సి.ఆర్.పి.సి.లో పేర్కొన్న నిబంధనలను బీఎన్ఎస్ఎస్2లో యథాతథంగా ఉంచారు. విచారణ ప్రక్రియ, ప్రజల భద్రత అనేవి ప్రత్యేకమైన క్రియలు కనుక, వీటిని ఒకే చట్టం కింద లేక వేర్వేరు చట్టాల కింద నియంత్రించాలా, అనే విషయం ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. సి.ఆర్.పి.సి.లో మార్పుల విషయంలో గతంలో నియమించిన ఉన్నత స్థాయి కమిటీలు, శిక్షలు, నిందితుల హక్కుల విషయంలో చేసిన సిఫారసులను బీఎన్ఎస్ఎస్2లో చేర్చలేదు.
నిజానికి ఇండియన్ పీనల్ కోడ్ (1860) నిర్వహణ కోసం కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (సి.ఆర్.పి.సి) పేరుతో విధానసంబంధ చట్టాన్ని 1973లో కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. నేరాలకు సంబంధించిన దర్యాప్తు, విచారణ, బెయిల్ మంజూరు వంటి అంశాలను ఇది వివరిస్తుంది. సి.ఆర్.పి.సి. మొట్టమొదటిసారి మనదేశంలో 1861లో అమల్లోకి తెచ్చారు. ముఖ్యంగా బహుళ చట్టవ్యవస్థలు అమల్లో ఉన్న నేపథ్యంలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారం కోసం సి.ఆర్.పి.సి. రూపకల్పన జరిగింది. తర్వాతి కాలంలో అనేకసార్లు దీనిలో సమయానుకూలంగా మార్పులు చేసుకుంటూ వచ్చారు. చివరకు 1973లో సి.ఆర్.పి.సి.ని రద్దుచేసి, యాంటిసిపేటరీ బెయిల్ వంటి కొత్త అంశాలతో నూతన సి.ఆర్.పి.సి.ని కేంద్రం అమల్లోకి తెచ్చింది. 2005లో మళ్లీ దీన్ని కేంద్ర ప్రభుత్వం సవరించి, ‘ప్లీ ఆఫ్ బార్గెయినింగ్’, అరెస్టయిన వ్యక్తుల హక్కులు వంటి అంశాలను చేర్చింది. సంవత్సరాలుగా సుప్రీంకోర్టు సి.ఆర్.పి. సి.కి విభిన్న మార్గాల్లో వ్యాఖ్యానించడమే కాకుండా దీని అనువర్తనాన్ని సవరిస్తూ వచ్చింది. వీటిల్లో ముఖ్యమైనవి
1. విచారణకు అర్హమైన కేసుల్లో ఎఫ్.ఐ.ఆర్. నమోదు తప్పనిసరి
2. ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసుల్లో అరెస్ట్ మినహాయింపు
3. బెయిల్ ఇవ్వదగిన నేరాల్లో బెయిల్ తప్పనిసరిగా మంజూరు చేయాలి.
ఇవే కాకుండా కస్టడీల్లో చేసే విచారణకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. ఇదే సమయంలో విచారణ మరింత వేగంగా జరగాలన్న అంశాన్ని నొక్కి చెప్పింది. అయినప్పటికీ బ్యాక్లాగ్లు, విచారణలో ఆలస్యం వంటి సమస్యలు నేరన్యాయ వ్యవస్థలో కొనసాగుతూనే ఉన్నాయి.
విచారణ ఖైదీలు: ఒక కేసులో విధించే శిక్షాకాలంలో సగం కంటే ఎక్కువ సమయం నిర్బంధంలో ఉన్న నిందితుడిని వ్యక్తిగత పూచీకత్తుపై తప్పనిసరిగా విడుదల చేయాలి. అయితే మరణశిక్ష పడే కేసుల్లో నిందితులకు ఇది వర్తించదు. బీఎన్ఎస్ఎస్2 దీనికి అదనంగా కొన్ని అంశాలను చేర్చింది.
1. జీవితఖైదు విధించే నేరాలు
2. ఒక వ్యక్తిపై ఒకటికంటే ఎక్కువ కేసులు విచారణలో ఉన్నప్పుడు, ఈ రకమైన విడుదల సాధ్యం కాదని స్పష్టం చేసింది.
వైద్య పరీక్షలు: అత్యాచారంతో సహా వివిధ కేసులకు వైద్య పరీక్షలను సి.ఆర్.పి.సి. అనుమతిస్తోంది. కనీసం ఎస్.ఐ. స్థాయి పోలీసు అధికారి అభ్యర్థన మేరకు నిందితులకు వైద్య పరీక్షలను రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీస్నర్ నిర్వహించవచ్చు. అయితే ఏ పోలీసు అధికారి అయినా వైద్య పరీక్షలకు
అభ్యర్థించే అవకాశాన్ని బీఎన్ఎస్ఎస్2 కల్పిస్తుంది.
ఫోరెన్సిక్ విచారణ: కనీసం ఏడేళ్లు శిక్షపడే కేసుల్లో ఫోరెన్సిక్ విచారణను బీఎన్ఎస్ఎస్2 తప్పనిసరి చేసింది. ఇటువంటి కేసుల్లో నేరం జరిగిన ప్రదేశానికి ఫోరెన్సిక్ నిపుణులు వచ్చి, ఫోరెన్సిక్ సాక్ష్యాలను సేకరిస్తారు. తాము సేకరించిన వివరాలను మొబైల్ ఫోన్లు లేదా మరే ఇతర ఎలక్ట్రానిక్ పరికరంలోనైనా వారు రికార్డు చేయవచ్చు. ఏదైనా ఒక రాష్ట్రం అటువంటి ఫోరెన్సిక్ సదుపాయం కలిగిలేకపోతే, మరో రాష్ట్రంలో ఉన్న ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.
సంతకాలు, వేలిముద్రలు: ఏ వ్యక్తినైనా సంతకం లేదా చేతి రాతను చూపాలని మేజిస్ట్రేట్ కోరేందుకు సి.ఆర్.పి.సి. అనుమతిస్తోంది. అయితే దీన్ని మరింత విస్తరించి ఒక వ్యక్తి వేలిముద్రలు, కంఠస్వర నమూనాలను కూడా తీసుకోవడానికి బీఎన్ఎస్ఎస్2 అనుమతించింది. ఇంకా అరెస్ట్ కాని వ్యక్తినుంచి ఈ నమూనాలను సేకరించేందుకు బీఎన్ఎస్ఎస్2 అనుమతిస్తుంది.
నేరాల విభజన: సి.ఆర్.పి.సి నేరాలను రెండు రకాలుగా విభజించింది. మొదటిది గుర్తించదగినవి కాగా రెండవది గమనార్హం కానివి. గుర్తించదగిన కేసుల్లో పోలీసులు నిందితుడిని ఏ విధమైన వారెంట్ లేకుండా అరెస్ట్ చేసి విచారించవచ్చు. అదే గమనార్హం కాని కేసుల్లో వారెంట్ తప్పనిసరి. కొన్ని కేసుల్లో బాధితుడు లేదా థర్డ్ పార్టీ ఫిర్యాదు చేయవచ్చు.
నేరాల స్వభావం: సి.ఆర్.పి.సి. వివిధ రకాల క్రిమినల్ నేరాలను వివరించింది. ఇవి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన నుంచి హత్య వరకు ఉన్నాయి. ఇందులో బెయిల్ ఇవ్వదగ్గ, బెయిల్ నిరాకరించే నేరాల మధ్య తేడాను స్పష్టంగా వివరించివుంది. పోలీసు కస్టడీలో ఉన్న నిందితుడు ఏయే నేరాల్లో బెయిల్ పొందే హక్కు కలిగి ఉంటాడో కూడా ఇందులో పేర్కొనిఉంది.
– జమలాపురపు విఠల్రావు
సీనియర్ జర్నలిస్ట్