గ్రూప్స్ ప్రత్యేకం జాగ్రఫీ
1. హిందూ మహాసముద్రం వేడెక్కడం వల్ల కలిగే ప్రభావాలు?
‘ఉష్ణమండల హిందూ మహాసముద్ర భవిష్యత్తు అంచనాలు’ అనే అధ్యయనం హిందూ మహాసముద్రం అధికంగా వేడెక్కుతుందని అంచనా వేసింది.
అధ్యయనంలోని కీలక అంశాలు
1) వాతావరణ నమూనాలు, హిందూ మహాసముద్రంలో (IO) 1950-2020 మధ్య ఉష్ణోగ్రత శతాబ్దానికి 1.20C పెరగ్గా, 2020-2100 నాటికి 1.7-3.80C చొప్పున పెరుగుతుందని పేర్కొంది.
2) వాయవ్య హిందూమహాసముద్రంలోని అరేబియా సముద్రం గరిష్టంగా వేడెక్కుతుందని అంచనా వేసింది.
3) సముద్రపు వెంట వీచే వేడిగాలులు సంవత్సరానికి 20 రోజుల నుంచి సంవత్సరానికి 220-250 రోజులకు భారీగా పెరుతాయని అంచనా వేసింది. ఇది ఉష్ణమండల హిందూ మహాసముద్రంలోను సమీప-శాశ్వత వేడి గాలుల స్థితిలోకి నెట్టివేస్తుంది.
4) అధిక ఉద్గారాల దృష్ట్యా 1980-2020 మధ్యకాలంలో 260C-280Cతో పోలిస్తే 2100 నాటికి హిందూ మహాసముద్రం బేసిక్లో కనీస సగటు ఉష్ణోగ్రత 280C కంటే ఎక్కువగా ఉంటుందని అధ్యయనం అంచనా వేసింది.
హిందూ మహాసముద్రం వేడెక్కడం వల్ల కలిగే సమస్యలు
1) ఉష్ణ శాతం ఉష్ణ విస్తరణకు దోహదం చేస్తుంది. ఇది సముద్ర మట్టం పెరుగుదలకు దారితీస్తుంది.
2) సముద్ర ఉష్ణ తరంగాల వల్ల పగడపు దీవుల వినాశనం, ఇతర జలరాశులకు ముప్పు, కెల్ప్ అడవులకు (తక్కువ లోతులో పెరిగే ఆల్గే) ప్రమాదం, అలాగే తుఫాన్ తీవ్రత పెరగడం వంటి అనేక సమస్యలు ఉత్పన్నం కావడం.
3) ఇండియన్ ఓషన్ డైపోల్ (IOD) సంఘటనల తరచుదనం పెరుగుతుంది. సానుకూల IOD పశ్చిమ IOకు వెచ్చని నీటిని తీసుకువస్తుంది. ప్రతికూల IOD వెచ్చని జలాలను తూర్పు IOకు తీసుకువస్తుంది. సానుకూల IOD భారత ఉపఖండంలో వర్షపాతానికి అనుకూలంగా ఉంటుంది.
4) సముద్ర ఆమ్లీకరణ పెరుగుదల, నికర ప్రాథమిక ఉత్పాదకతలో క్షీణత సంబంధిత సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి.
1) ప్రపంచ వ్యాప్తంగా కర్బన ఉద్గారాలను తగ్గించడం.
2) స్థితిస్థాపక మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టడం
3) స్థిరమైన పద్ధతుల ద్వారా సముద్ర పర్యావరణ వ్యవస్థలను పరిరక్షించడం.
4) అంచనా సామర్థ్యాలను మెరుగుపరచడం.
5) ఆహార భద్రత కోసం ఉత్తమ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం.
2) కార్బన్ వ్యవసాయ పద్ధతులను అమలు చేయడంలో సవాళ్లు, ముఖ్యంగా భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎదురయ్యే సమస్యలు.
1) రొటేషనల్ పద్ధతిలో పశువులను మేపడం: వివిద పచ్చిక బయళ్లకు పశువులను మార్చుతూ మేపడం వల్ల భూమి సహజ సారాన్ని నిలుపుకోవడానికి వీలు కల్పిస్తుంది. అధికంగా మేపడాన్ని నిరోధిస్తుంది. పశువుల నుంచి మీథేన్ ఉద్గారాలను కూడా తగ్గిస్తుంది.
2) ఆగ్రోఫారెస్ట్రీ: చెట్లు, పొదలను పంటలతో అనుసంధానించడం (సిల్వోపాస్టర్ , అల్లీ క్రాసింగ్) రైతులకు అదనపు ఆదాయ మార్గాలను అందిస్తూ పంట నుండి కార్బన్ను పూర్తిగా శోషిస్తుంది.
3) పరిరక్షణ వ్యవసాయం : భూమిని దున్నకపోవడం, పంట మార్పిడి దున్నడానికి బదులుగా మొక్కలు నాటడం (కవర్క్రాపింగ్), పంటవ్యర్థాల నిర్వహణ వంటి పద్ధతులు మృత్తికా క్రమక్షయాన్ని తగ్గిస్తాయి. సేంద్రీయ పదార్థాన్ని పెంచుతాయి. గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గిస్తాయి.
4) సమగ్ర పోషక నిర్వహణ: కృత్రియ ఎరువులకు బదులుగా సేంద్రీయ ఎరువులు, కంపోస్ట్ను ఉపయోగించడం వల్ల ఉద్గారాలు తగ్గుతాయి. భూసారం పెరుగుతుంది.
5) ఆగ్రో-ఎకాలజీ: పంటల వైవిధ్యీకరణ, ఒకేసారి రెండు రకాల పంటల పెంపకం వల్ల పర్యావరణ వ్యవస్థను మెరుగుపరచవచ్చు. రసాయన ఎరువుల అవసరాన్ని తగ్గిస్తుంది. తద్వారా ఉద్గారాలు తగ్గుతాయి.
6) పశువుల నిర్వహణ: రొటేషన్ పద్ధతిలో పశువులను మేపడం, నాణ్యమైన దాణాను అందించడం, జంతు వ్యర్థాలను సరిగా పారవేయడం వంటి పద్ధతులు పాటించడం వల్ల పశువుల నుంచి మీథేన్ ఉద్గారాలను తగ్గించవచ్చు. పచ్చిక బయళ్లు కార్బన్ నిల్వ సామార్థ్యాలను పెంచవచ్చు.
కార్బన్ వ్యవసాయం అమలు చేయడంలో సవాళ్లు-సమస్యలు
1) పరిమిత నీటి లభ్యత
నీటి కొరత ఉన్న ఉష్ణ, పొడ ప్రాంతాల్లో, నీటి డిమాండ్ పెరగడం వల్ల కవర్ క్రాపింగ్ వంటి పద్ధతులు అచరణ సాధ్యం కాకపోవచ్చు.
2) ఆర్థిక పరిమితులు
చిన్న తరహ రైతులకు వారి ఆర్థిక స్థోమత రీత్యా స్థిరమైన భూ నిర్వహణ పద్ధతుల్లో పెట్టుబడులు పెట్టడానికి సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి వారికి ఆర్థిక సహాయం అవసరం.
3) భౌగోళిక వైవిధ్యం
మృత్తిక రకం, పంట ఎంపిక, నీటి లభ్యత వంటి అంశాలపై ఆధారపడి కార్బన్ వ్యవసాయం ప్రభావం మారుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని విస్తృతంగా అవలంభించడం సమస్యతో కూడుకున్న పని.
4) విధాన పరమైన పద్ధతి
తగినంత విధాన ఛట్రాలు లేకపోవడం అవగాహన లేకపోవడం వల్ల కార్బన్ వ్యవసాయ పద్ధతులను విస్తృతంగా అవలంభించడంలో అనేక అటంకాలు ఎదురవుతున్నాయి.
5) సాంకేతిక అడ్డంకులు
సాంకేతిక పరిజ్ఞానానికి పరిమితి ప్రాప్యత, కార్బన్ ఫార్మింగ్ పద్ధతుల గురించి తగినంత సమాచారం లేకపోవడం వల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో దీన్ని ఎక్కువగా పాటించుట లేదు.
కార్బన్ వ్యవసాయాన్ని ప్రోత్సహించే కొన్ని ప్రపంచ కార్యక్రమాలు
1) కార్బన్ ట్రేడింగ్ : చికాగో ైక్లెమేట్ ఎక్స్చేంజ్, ఆస్ట్రేలియాలోని కార్బన్ ఫార్మింగ్ ఇనిషియేటివ్ వంటి కార్యక్రమాలు కార్బన్ ట్రేడింగ్ ద్వారా వ్యవసాయంలో కార్బన్ ఉపశమన కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నాయి.
2) 4 ఫర్ 1000 ఇనిషియేటివ్: కాప్21 వాతావరణ చర్యల సమయంలో ప్రారంభించిన ఈ కార్యక్రమం, హరిత గృహ వాయు ఉద్గారాలను తగ్గించడంలో మృత్తికకు సంబంధించిన కార్బన్ శోషణ పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించింది.
3) వ్యవసాయ కార్బన్ ప్రాజెక్టులు : ప్రపంచ బ్యాంకు మద్దతుతో కెన్యా వ్యవసాయ కార్బన్ ప్రాజెక్టు వంటి కార్యక్రమాల ద్వారా అభివృద్ది చెందుతున్న దేశాల్లో వాతావరణ సమస్యలు ఆహార భద్రత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.
ముగింపు
భారతదేశంలో వాతావరణ రహిత, ఉద్గార రహిత వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించి కార్బన్ వ్యవసాయాన్ని చేపట్టే అవకాశాలు ప్రత్యేకించి విస్తృతమైన వ్యవసాయ భూమి ఉన్న ప్రాంతాల్లో మెండుగా ఉన్నాయి. విస్తృత కార్యక్రమాలు, వ్యవసాయ పరిశోధనల ద్వారా కార్బన్ను శోషణ చేయడానికి సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. అలాగే కార్బన్ క్రెడిట్ సదుపాయం ద్వారా రైలుపై భారం తగ్గుతుంది. ఆదాయం కూడా పెరుగుతుంది.
3. హిందూ మహాసముద్ర పరితలాలు వేడక్కడానికి ద్వి ధ్రువత డైపోల్ అని, దీనికి ఎల్నినోకు మధ్య సంబంధాన్ని వివరించండి?
జవాబు: హిందూ మహా సముద్ర ఉపరితలం పశ్చిమ తూర్పు భాగాల్లో భిన్న రకాలుగా వేడెక్కడాన్ని ద్విధ్రువత(డైపోల్)గా వ్యవహరిస్తారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో డైపోల్ మళ్లీ ఏర్పడుతుందని అంతర్జాతీయ వాతావరణ పరిశోధన సంస్థలు చెబుతున్నాయి. తూర్పు కంటే పశ్చిమ భాగం ఎక్కువ వేడెక్కితే బలమైన నైరుతి రుతుపవనాలు ఏర్పడతాయి. భారత్కు భారీ వర్షాలు తీసుకువస్తాయి. మనదేశంలో 70 శాతం వర్షాలు నైరుతి రుతుపవనాల కారణంగానే కురుస్తున్నాయి.
పశ్చిమ హిందూ మహా సముద్రం బాగా వేడెక్కినపుడు నీరు భారీ స్థాయిలో ఆవిరై వర్షా మేఘాలు ఏర్పడతాయి. అవి తూర్పు ఆఫ్రికాతో పాటు పశ్చిమ భారతానికి వర్షాలు తీసుకొస్తాయి. ఆస్ట్రేలియా, తూర్పు ఆసియాలో వర్షాభావం ఏర్పడతాయి. అయితే ఈ డైపోల్ ప్రక్రియను వాతావరణ మార్పులు బలంగా ప్రభావితం చేస్తున్నాయి.
తూర్పు హిందూ మహాసముద్రం వేడెక్కితే భారత్లో పెద్దగా వర్షాలు కురవవు. కాబట్టి దాన్ని ప్రతికూల డైపోల్ అంటారు. హిందూ మహాసముద్రం ఇలా భిన్న రకాలుగా వేడెక్కడాన్ని 1999లో ఎన్.హెచ్.సాజి నాయకత్వంలోని భారతీయ వాతావరణ శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. హిందూ మహాసముద్రంలో డైపోల్ ఎల్నినో, లానినా పరిమాణాన్ని తలపిస్తుంది.
పసిఫిక్ మహాసముద్రంలో మధ్య తూర్పు ప్రాంతాల్లో ఎల్నినో ఏర్పడుతుంది. రెండు నుంచి ఏడేళ్లకు ఒక సారి సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత, వాయు సంపీడనంలో మార్పు వచ్చి ఎల్నినో ఏర్పడుతుంది. ఈ పరిమాణాన్ని ఎల్నినో దక్షిణ డోలనం(ఎన్సో) అంటారు. ఎన్సోకు, హిందూ సముద్ర డైపోల్కు మధ్య పోలికలున్నాయి. ఎన్సో మాదిరిగానే డైపోల్ కూడా ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేస్తోంది.
పెరుగుతున్న కర్బన ఉద్గారాల ప్రభావం: హిందూ మహాసముద్రంలో ద్విద్రువత(డైపోల్) ఎందుకు ఏర్పడుతుందనే దాని మీద శాస్త్రజ్ఞులు వివిధ సిద్ధాంతాలను ప్రతిపాదించారు. హిందూ మహాసముద్రంలో స్థానిక జల-వాయు ఉష్ణోగ్రత పీడనాల్లో తేడాల వల్ల డైపోల్ ఏర్పడుతుందని సూచించారు.
దీనికి పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఎన్సో డోలనానికి మధ్య సంబంధం ఉందని పేర్కొన్నారు. పశ్చిమ తూర్పు హిందూ మహాసముద్ర జలాల్లో స్థానిక వాయు జల పరిస్థితుల్లో తేడాల వల్ల డైపోల్ ఏర్పడినట్లు గుర్తించారు.
ఉష్ణమండల హిందూ మహాసముద్రంలో ఆసాధారణ వేగంతో వీచే గాలులు సముద్ర జలాన్ని పైకి ఎగదోసి వర్ష మేఘాలు ఏర్పడటానికి కారణమవుతాయి. ధ్రువాల వద్ద చల్లని నీరు సముద్రజాలాల్లోరి జారినప్పుడు శీతల గాలులు ఏర్పడి ఉష్ణ మండలం వైపు పయనిస్తాయి. వీటిని తూర్పు నుంచి వీచే వాణిజ్య పవనాలు (ఈస్టర్లీలు) అంటారు. ఉష్ణమండల హిందూ మహా సముద్రంలోని తూర్పు భాగానికి ఈస్టర్లీలు చేరుకున్నప్పుడు చల్లని నీరు పైకి ఉబికి వస్తుంది. దీన్ని సమతుల్య పరుస్తూ పశ్చిమ హిందూ మహా సముద్రంలో వేడి గాలులు పైకి లేస్తాయి. సానుకూల హిందూ మహా సముద్ర డైపోల్ బలమైన నైరుతీ రుతు పవనాలను సృష్టించి భారతదేశానికి వర్షాలను తీసుకొస్తుంది.
పెరుగుతున్న కర్బన ఉద్గారాలతో భూ వాతావరణం వేడెక్కుతున్నందువల్ల సానుకూల డైపోల్ చాలా తరచుగా సంభవించే అవకాశం ఉంది. 1961, 1994, 1997లో చాలా తీవ్రమైన డైపోల్స్ ఏర్పడ్డాయి. కాలుష్యం వల్ల వాతావరణంలో బొగ్గుపులుసు వాయువు శాతం పెరగడానికి డైపోల్స్కు మధ్య ఉన్న సంబంధాన్ని తేల్చడానికి భారత్, చైనా, ఆస్ట్రేలియా, జపాన్ శాస్త్రవేత్తలు కంప్యూటర్ నమూనాలను ఉపయోగించారు. వారి అధ్యయన పలితాలు 2014లో శాస్త్ర వైజ్ఞానిక పత్రిక పేపర్లో ప్రచురితమయ్యాయి. గతంలో సగటున ప్రతి 17 సంవత్సరాలకు ఒకసారి సానుకూల డైపోల్స్ ఏర్పడితే ఒక నుంచి కర్బన ఉద్గారాల కారణంగా ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి డైపోల్ ఏర్పడవచ్చునని కంప్యూటర్ నమూనా తెలుపుతుంది.
తీవ్ర కష్టనష్టాలు
ముద్ర ఉపరితల జలాల ఉష్ణోగ్రత 1951-2015 మధ్య దశాబ్దానికి సగటున 0.15 డిగ్రీల సెల్సియస్ చొప్పున పెరిగింది. పశ్చిమ హిందూ మహాసముద్రంలో 1982-2018 మధ్య 66 సముద్ర గర్భ ఉష్ణ ప్రభంజనాలు(హీట్వేవ్స్) సంభవించాయి. ఉత్తర బంగాళాఖాతంలో హీట్వేవ్స్లు రెండు మూడింతలు అధికమయ్యాయని భూ శాస్త్రవేత్తలు తెలియజేశారు.
అధిక ఉష్ణోగ్రత వల్ల సముద్ర జలాలు వ్యాకోచించాయి. దీనికి తోడు ధ్రువాలు, పర్వతాల్లోని హిమానీనదాలు కరిగి అపార పరిమాణంలో నీరు సముద్రాల్లో చేరుతుంది. ఫలితంగా సముద్ర మట్టాలు పెరుగుతాయి. దీని వల్ల భారత్, బంగ్లాదేశ్లు తీవ్ర కష్ట నష్టాలను ఎదుర్కొవలసి వస్తుంది. రానున్న 50 ఏళ్లలో సముద్ర మట్టాలు పెరుగుదల వల్ల ప్రపంచంలో 25 శాతం మడ అడవులు నీట మునుగుతాయి. సముద్ర తీరాల నుంచి జనం లోతట్టు ప్రాంతాలకు తరలిపోవలసి వస్తుంది. సముద్ర మట్టాల పెరుగుదల వల్ల ఇప్పటికే పశ్చిమ బెంగాల్లోని సుందరవనాలు, ఒడిశా, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ రాష్ర్టాలు తీరంలో భూమి కోత ముప్పును ఎదుర్కొంటున్నాయి. కోల్కతా, చెన్నై, ముంబై నగరాలకు ఈ ప్రమాదం ఎక్కువగా ఉంది. 2050 కల్లా హిందూ మహాసముద్ర తీరంలోని దేశాల్లో తరచూ వరదలు సంభవించే అవకాశం ఉంది. సముద్ర మట్టాలు పెరిగితే దాన్ని తట్టుకోవడానికి నెదర్లాండ్స్ తరహాలో కరకట్టలు తదితర నిర్మాణాలను చేపట్టాల్సి ఉంది. ఈ క్రమంలో భావి తరాల భవిత కోసం కర్బన ఉద్గారాలను కట్టడి చేస్తూ భూతాపాన్ని నియంత్రించాల్సిన బాధ్యత ప్రపంచ దేశాలన్నింటినిపైనా ఉందన్న సంగతి ప్రభుత్వాలు గుర్తించాలి.
– జీ గిరిధర్ సివిల్స్ ఫ్యాకల్టీ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ 9966330068