హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మించనున్న సీతమ్మసాగర్ బహుళార్ధక ప్రాజెక్టును 15 నెలల్లోనే పూర్తిచేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలోనే ఈ ప్రాజెక్టును కూడా యుద్ధప్రాతిపదికన 2023 మార్చినాటికి పూర్తి చేయాలని సంకల్పించింది. కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని అధికారులకు, గుత్తేదార్లకు నిర్దేశించింది. సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్ ప్రగతిభవన్ నుంచి వర్చువల్గా తెలంగాణ సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రజత్కుమార్తో, ఇతర ఇంజినీరింగ్ అధికారులతో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సీతారామ, సీతమ్మసాగర్ ప్రాజెక్టుల పురోగతిపై సుదీర్ఘంగా చర్చించారు. ఆయా ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు నిర్ణీత గడువును విధించారు. సీతమ్మసాగర్ బరాజ్, హైడ్రోపవర్ ప్రాజెక్టును కాళేశ్వరం తరహాలోనే యుద్ధప్రాతిపదికన కొనసాగించి 2023 మార్చినాటికి పూర్తి చేయాలని చెప్పారు. రోజువారీగా ఎంతమేరకు కాంక్రీట్వర్క్, ఎర్త్వర్క్ తదితర పనులను పూర్తిచేశారనే దానిపై జలసౌధతోపాటు, సీఎంవో కార్యాలయానికి నివేదించాలని స్మితా సబర్వాల్ ఆదేశించారు.
సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిని కూడా ఆమె అడిగి తెలుసుకున్నారు. ప్యాకేజీల వారీగా సీతారామ లిఫ్ట్ స్కీమ్ పనులను సమీక్షించారు. ప్రాజెక్టు పనులు ఈ ఏడాది జూన్ నాటికే పూర్తికావాల్సి ఉండగా, కరోనా, ఇతర సాంకేతిక కారణాల రీత్యా జాప్యమవుతున్నట్లు ఇంజినీర్లు, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు చెప్పారు. సమావేశంలో ఈఎన్సీ (జనరల్) మురళీధర్, ఈఎన్సీ (ఓఅండ్ఎం) నాగేందర్రావు, సీఈ (కొత్తగూడెం) శ్రీనివాస్రెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు.