Rahul Gandhi : రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా విపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారం లోక్సభ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మోదీ సర్కార్ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ఈ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగంపై దాడి జరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని రక్షించేందుకు తాము పోరాడుతున్నామని అన్నారు.
ఇండియా కూటమి నేతలను ప్రభుత్వ ప్రోద్భలంతో ఈడీ, సీబీఐ వేధిస్తున్నాయని ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి విపక్ష నేతలను వేధిస్తూ వారిని జైల్లో పెట్టి హింసిస్తున్నారని అన్నారు. శివుడి ఫొటోను చూపుతూ తాను శివుడి నుంచి ప్రేరణ పొందానని అన్నారు. శివుడి ఫొటోను, రాజ్యాంగ ప్రతిని సభలో చూపడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు.
కేంద్రం ఆదేశాలతో తనను టార్గెట్ చేశారని దయ్యబట్టారు. నా సభ్యత్వాన్ని రద్దు చేసి, ఎంపీ పదవినీ, ఇంటినీ లాక్కున్నారని అన్నారు. విపక్షంలో ఉన్నందుకు గర్వపడుతున్నామని అన్నారు. ఓ సినిమాతో మహాత్మా గాంధీ అంటే ప్రపంచానికి తెలిసిందని ప్రధాని మోదీ అన్నారని, ఆయన అజ్ఞానాన్ని అర్ధం చేసుకున్నారా అని ప్రశ్నించారు.
తాను మరో అంశం గమనించానని, ధైర్యం గురించి మాట్లాడేది కేవలం ఒక మతం కాదు. అన్ని మతాలు ధైర్యం గురించి మాట్లాడతాయని అన్నారు. అధికారం, సంపద కేంద్రీకరణ, పేదలు, దళితులపై దమనకాండ గురించి ప్రశ్నించిన వారిని అణిచివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలు, రైతుల సమస్యలు కేంద్రానికి పట్టవని అన్నారు.
Read More :