హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 2 (నమస్తే తెలంగాణ)/బడంగ్పేట: రంగారెడ్డి జిల్లా బడంగ్పేట మండలంలో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమవుతున్నా అధికారులు స్పందించడం లేదు. కబ్జాలను గుర్తించిన గ్రామస్థులు తహసీల్దారుకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో మంగళవారం వారు జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు.
ఇటీవల బాలాపూర్లోని సర్వేనంబర్ 74లో కొంత భూమిని ఆక్రమించి కొందరు ప్రహరీ నిర్మాణాలు చేపట్టారు. సుమారు రెండున్నర ఎకరాల వరకు భూమిని కబ్జా చేసేందుకు పథకం రచించడంతో గ్రామస్థులు అప్రమత్తమయ్యారు. దీనిపై బాలాపూర్ తహసీల్దార్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కానీ అధికారులు ఎటువంటి చర్యలూ చేపట్టలేదు. దీంతో గ్రామస్థులు మంగళవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్కు వెళ్లి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ ప్రాంతంలో ఇప్పటికే కబ్జా అయిన భూమి పోగా కనీసం మరో 10 ఎకరాలు ఇంకా ప్రభుత్వ భూమి ఉంటుందని గ్రామస్థులు పేర్కొన్నారు. ఆ భూముల ధర చదరపు గజం 60-70 వేల వరకు పలుకుతున్న నేపథ్యంలో ఎకరా రూ.30 కోట్ల చొప్పున దాదాపు రూ.300 కోట్ల విలువైన భూమి ప్రభుత్వ ల్యాండ్ బ్యాంక్లోకి చేరే అవకాశముంది.
గ్రామ పరిధిలోని సర్వేనంబర్ 74లో 132.02 ఎకరాల ప్రభుత్వ భూమి (గైరాన్ సర్కారి) ఉన్నట్టు ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. ఇందులో 1980 దశకంలో కొంత భూమిని నిరుపేదల ఇండ్ల కోసం వినియోగించారు. మరికొంత భూమిని శ్మశాన వాటికకు కేటాయించారు. 1993-94లో కేంద్ర ప్రభుత్వరంగ ఏఆర్సీఐకి ఇందులో 99 ఎకరాలు కేటాయించారు. అప్పటికే ఆ భూముల్లో కొందరు వ్యవసాయం చేసుకుంటుండటంతో వారికి ఏఆర్సీఐ ఎకరాకు రూ.5వేల చొప్పున పరిహారంతోపాటు వారి కుటుంబంలో ఒకరికి తమ సంస్థలో ఉద్యోగం కూడా కల్పించింది. మిగిలిన భూమిని కాపాడాల్సిన రెవిన్యూ యంత్రాంగం చర్యలు చేపట్టకపోవడంతో ప్రతి ఏటా ఎకరాల కొద్దీ భూమి అన్యాక్రాంతమవుతున్నది.
ఈ కబ్టాపై ‘నమస్తే తెలంగాణ’ బాలాపూర్ తహసీల్దార్ మాధవీరెడ్డిని సంప్రదించగా ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కావటం నిజమేనన్నారు. దీనిపై సర్వే చేపట్టాలని నిర్ణయించామని, సర్వే నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈలోగా అక్రమ నిర్మాణ పనులను నిలిపివేయవచ్చు కదా.. అని ప్రశ్నించగా తమకు తగిన సిబ్బందిలేరని అన్నారు. ప్రస్తుతం ధరణి పోర్టల్లో ఈ సర్వేనంబర్లో 132.05 ఎకరాలను ప్రభుత్వ భూమిగా చూపుతున్నప్పటికీ.. నిషేధిత జాబితాలో అసలు ఈ సర్వే నంబరే లేకపోవడం గమనార్హం. ఇదే విషయాన్ని తహసీల్దార్ ముందు ప్రస్తావించగా.. ఇప్పటికిప్పుడు తమ వద్ద సమాచారం లేదని, ఎందుకు నిషేధిత జాబితాలో చేర్చలేదో తెలుసుకుంటామని చెప్పారు.