హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముఖరా(కె) గ్రామంపై మరోమారు ప్రశంసల జల్లు కురిపించింది. గ్రీన్ పంచాయత్లో ముఖరా(కె) గ్రామం ఆదర్శంగా నిలిచిందని దీన్ని ఓ మార్గంగా తీసుకుని ముందుకు సాగాల్సిందిగా కేంద్ర పంచాయతీరాజ్శాఖ పేర్కొంది. అంతరించిపోతున్న పచ్చదనాన్ని కాపాడేందుకు గ్రామవాసులకు అవగాహన కల్పించాలని తెలిపింది. గ్రామ పంచాయితీలో గ్రీన్ ల్యాండ్ స్కేపింగ్ నిర్మించడానికి, మెరుగుపరచడానికి ముందుకు వెళ్లే మార్గాన్ని ఈ గ్రామం చూపుతుందంది.
దీనిపై ఎంపీ సంతోష్ కుమార్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. మనం చేసే మంచి పనులతో ఏం పొందవచ్చో ఇది నిరూపించిందన్నారు. ముఖరా(కె) గ్రామ సర్పంచ్కి, ప్రజలకు అభినందనలు అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో గ్రామం ఎల్లప్పుడు ముందుంటుందని కొనియాడారు. గ్రామం కృషిని గుర్తించి, సాధించిన పురోగతిని హైలెట్ చేసినందుకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఎంపీ పేర్కొన్నారు.