Paris Olympics | ముంబై, జూన్ 26: మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి పారిస్ ఒలింపిక్స్ సమీపంలో ‘ఇండియా హౌజ్’ ఏర్పాటవుతున్నది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) భాగస్వామ్యంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తున్నది. ఒలింపిక్స్లో వందేండ్ల భారత ప్రాతినిథ్యాన్ని స్మరించుకుంటూ దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భారతీయ చరిత్ర, టెక్నాలజీ-డిజిటలైజేషన్లో సాధిస్తున్న ప్రగతి, సాంస్కృతిక, క్రీడా వారసత్వ విశేషాలనూ ప్రదర్శించనున్నారు.
ఈ మేరకు బుధవారం ఐవోఏ అధ్యక్షురాలు పీటీ ఉష, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) సభ్యురాలు నీతా అంబానీ తెలిపారు. ఇక పారిస్లోని పార్క్ డీ లా విలేట్ వద్ద ఉండే ఈ ఇండియా హౌజ్.. ఒలింపిక్స్ క్రీడలకు వెళ్లే జాతీయ బృందానికి ఓ సొంతిల్లు అనుభూతిని కలిగిస్తుందన్న ఆశాభావాన్నీ ఈ సందర్భంగా వారు వ్యక్తం చేశారు. అలాగే క్రీడా ప్రముఖులను కలుసుకునేందుకు సందర్శకులకూ ఓ వేదిక అవుతుందని చెప్పారు. కాగా, జూలై 26న పారిస్లో ఒలింపిక్స్ మొదలవుతున్న విషయం తెలిసిందే. ఆగస్టు 11 వరకు ఇవి జరుగుతాయి.