సిటీబ్యూరో, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): 34వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శన విజయంతంగా ముగిసింది. తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం)లో 11 రోజుల పాటు సాగిన ఈ ఎగ్జిబిషన్కు సుమారు 5 లక్షలకు పైగా పుస్తక ప్రియులు హాజరయ్యారు. ఈ పుస్తక ప్రదర్శనకు కావాల్సిన అన్ని సదుపాయాలను తెలంగాణ ప్రభుత్వం కల్పించిందని బుక్ ఫెయిర్ ప్రధాన కార్యదర్శి కోయ చంద్రమోహన్ తెలిపారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా పుస్తక పండుగ సజావుగా సాగిందని వారు వెల్లడించారు. ముగింపు సమావేశ అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను కలిసిన పలువురు దివ్యాంగులు వినతిపత్రాన్ని అందజేశారు.
సిటీబ్యూరో, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): సాహిత్యం, సంస్కృతిని పెంపొందించాలని, ఊరూరా గ్రంథాలయాలు నెలకొల్పాల్సిన అవసరం ఎంతో ఉన్నదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం)లో 34వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శన ముగింపు కార్యక్రమానికి మంగళవారం సీజేఐ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణకు గొప్ప చరిత్ర ఉందన్నారు. ఇక్కడ ఎందరో మహానుభావులు కాళోజీ, సురవరం ప్రతాపరెడ్డి లాంటి కవులు, రచయితలు పుట్టి ఈ మట్టి ఘనతను విశ్వవ్యాప్తం చేశారన్నారు. కాఫీ తాగితే వచ్చే ఉత్సాహం పుస్తకం చదివే వస్తుందన్నారు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ నుంచి ‘మరముచ్చట’ పుస్తకాన్ని అడిగి మరీ స్వీకరించారు. కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్గౌడ్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు కేవీ రమణాచారి, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్, బుక్ఫెయిర్ కార్యదర్శి కోయ చంద్రమోహన్, ట్రజరీ రాజేశ్వర్రావు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితంలోని ముఖ్యఘట్టాలను పుస్తక రూపంలో తీసుకురావడమే కాకుండా ప్రత్యేకంగా తెలంగాణ విజయగాథ స్టాల్ను ఏర్పాటు చేయడం అభినందనీయం. తెలంగాణ కోసం డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన కాళేశ్వరం నిర్మాణం వరకు సీఎం కేసీఆర్ జీవితంలోని ప్రతి ఘట్టం ఓ మైలురాయి లాంటిది.వెనుకబడిన ప్రాంతంగా ఉన్న తెలంగాణ ప్రపంచంలోనే పేరెన్నిక గల రాష్ట్రంగా మారడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దక్షత, భవిష్యత్ దార్శనికతయే కారణం. బీసీ కమిషన్ సభ్యుడు సీహెచ్.ఉపేంద్ర
గంగానది సాదృశ్యంగా పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్న గౌరీశంకర్, చంద్రమోహన్ల కృషి అభినందనీయం. పుస్తకం ఎప్పటికీ దాని ప్రాభవం కోల్పోదు. ఇప్పటికీ శతకపద్యాలు, నీతి కథలు చదువుకుంటున్నాం. శ్రీశ్రీ మహాప్రస్థానం ఎప్పటికీ గొప్పగానే ఉంటుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తెలుగువారు ఉండటం మనకు గర్వకారణం. – కేవీ రమణాచారి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు
లక్షలాది మంది సందర్శనతో పుస్తక ప్రదర్శన విజయవంతమైంది. ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రతిఒక్కరి జీవితం సెల్ఫోన్మయంగా మారింది. పుస్తకాలు చదవడంతో ఎంతోమంది గొప్ప వ్యక్తులుగా ఎదిగారు. సీఎం కేసీఆర్ అనేక పుస్తకాలు చదివి అనేక అంశాల్లో పట్టు సాధించారు. పిల్లలకు పుస్తకాలపై మక్కువ పెంచాలి. పుస్తక పఠనంతో క్రమశిక్షణ అలవాటు అవుతుంది – శ్రీనివాస్ గౌడ్, పర్యాటక శాఖ మంత్రి