హనుమకొండ, జూన్ 27 : వరంగల్ సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం వరంగల్ నగరంలో పర్యటించనున్న నేపథ్యంలో గురువారం హనుమకొండ కలెక్టరేట్లో మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్ తర్వాత రెండో రాజధాని వరంగల్ నగర అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టిపెట్టారన్నారు. సీఎం రేవంత్రెడ్డి పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుంచి నేరుగా హెలీక్యాప్టర్ ద్వారా వరంగల్లోని కాకతీయ టెక్స్టైల్ పార్ చేరుకొని సందర్శిస్తారని, అక్కడే ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలిస్తారన్నారు. అనంతరం వరంగల్ సెంటర్ జైల్ ఆవరణలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించి సమీక్షిస్తారని తెలిపారు. ఆ తర్వాత వరంగల్ నగర అభివృద్ధిపై(కుడా పరిధిలో) హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహిస్తారని పేర్కొన్నారు.
అలాగే కలెక్టరేట్లో ప్లాంటేషన్తో పాటు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభిస్తారన్నారు. అలాగే స్మార్ట్సిటీ పథకంలో భాగంగా చేపట్టినవి, ప్రగతిలో ఉన్నవి, ఇంకా చేపట్టాల్సిన పనులపై రివ్యూ చేస్తారని తెలిపారు. సమీక్షలో ముఖ్యంగా వరంగల్ పాత మాస్టర్ప్లాన్ను మార్చాల్సిన అవసరం ఉందని, సకాలంలో పూర్తి కాని కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు నిధులు మంజూరు చేయాలనే అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఔటర్ రింగ్రోడ్డు, ఇన్నర్ రింగ్రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ కేబుల్, వాటర్ సమస్యలను సైతం సీఎం దృష్టికి తీసుకెళ్లి వాటి ప్రాముఖ్యతను వివరించనున్నట్లు చెప్పారు. ప్రధానంగా వరంగల్ బస్స్టేషన్ నిర్మాణం, వరంగల్ కార్పొరేషన్ కొత్త భవన నిర్మాణం, వెటర్నరీ యూనివర్సిటీ ఏర్పాటు, ఆయుర్వేద ఆసుపత్రి అభివృద్ధి, స్టేడియం ఏర్పాటు, దేవూనూరు గుట్టలను ఎకో టూరిజంగా అభివృద్ధి, అలాగే ఖిలా వరంగల్ని మరింత అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షించే అంశాలను సైతం సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. అలాగే ఎంజీఎంలోని సమస్యలను సైతం సీఎంకు వివరించి పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే మామునూర్ ఎయిర్పోర్టు అంశాన్ని సైతం సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు మంత్రి సురేఖ పేర్కొన్నారు. హైదరాబాద్-వరంగల్ వరకు ఇండస్ట్రియల్ కారిడార్గా మార్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని సీఎం చూస్తున్నారని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యేలు రాజేందర్రెడ్డి, నాగరాజు పాల్గొన్నారు.
మీడియా సమావేశానికి ముందు హనుమకొండ కలెక్టరేట్లో మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డి, నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్యశారదా, కార్పొరేషన్ కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే, ఇతర ఉన్నతాధికారులతో మంత్రులు కొండా సురేఖ, సీతక సమావేశమయ్యారు. వరంగల్ నగర అభివృద్ధి, సీఎం పర్యటన సందర్భంగా సమీక్షించాల్సిన ఎజెండా అంశాలపై చర్చించి, పర్యటన ఏర్పాట్లపై ఆరా తీశారు. ప్రొటోకాల్ను జాగ్రత్తగా పర్యవేక్షించడంతో పాటు ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా పకడ్బందీగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.