SOM Distilleries | హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): మధ్యప్రదేశ్కు చెందిన వివాదాస్పద సోం డిస్టిలరీస్ అండ్ బ్రూవరీస్ కంపెనీ మరో పెద్ద వివాదంలో చిక్కుకుని తాత్కాలిక మూసివేతకు గురైంది. బడికి వెళ్లాల్సిన చిన్నారులతో మద్యం తయారీ పరిశ్రమలో వెట్టిచాకిరీ చేయిస్తున్న ఈ సంస్థ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్(ఎన్సీపీసీఆర్)కు అడ్డంగా దొరికిపోయింది. 39 మంది బాలురు, 20 మంది బాలికలకు ఎన్సీపీసీఆర్ విముక్తి కల్పించింది. ఎన్సీపీసీఆర్ అధికారులు చిన్నారుల చేతులను పరీక్షించగా.. హానికరమైన రసాయనాలు, మద్యం ముడి పదార్థాలతో చిన్నారుల అరచేతులు పూర్తిగా బొబ్బలెక్కిపోయాయి. కాలినట్టుగా గాయాలయ్యాయి. ఇవి చూసిన ఎన్సీపీసీఆర్ అధికారులే చలించిపోయారు. వెంటనే చిన్నారులను వైద్య పరీక్షల కోసం దవాఖానలకు తరలించారు. జువైనల్ జస్టీస్, బాండెడ్ లేబర్ చట్టాల కింద ఎన్సీపీసీఆర్.. సోం కంపెనీపై కేసు నమోదు చేసింది.
మూతబడ్డ ఫ్యాక్టరీ.. కుప్పకూలిన షేర్లు
చిన్నారులతో వెట్టిచాకిరీ చేయిస్తున్న ఘటన వెలుగులోకి రావడంతో రైసెన్ జిల్లాలోని డిస్టిలరీస్ పరిశ్రమ అనుమతులను తాత్కాలికంగా రద్దు చేస్తూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పరిశ్రమ మూతబడింది. కాగా, ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని ఈ సంస్థ చేతులు దులుపుకునే ప్రయత్నం చేసింది. తమతో పనిచేసే అసోసియేట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేసే కార్మికుల వయస్సు ధ్రువీకరణ చేయకపోవడం కాంట్రాక్టర్ తప్పని, సంబంధిత అధికారులు, ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని వివరణ ఇచ్చింది. మధ్యప్రదేశ్లో సోం డిస్టిలరీస్ కంపెనీని మూసివేశారనే వార్తలతో ఈ కంపెనీ షేర్ల విలువ భారీగా పడిపోయింది. ఎల్ఎస్ఈజీ డేటా ప్రకారం.. సోం డిస్టలరీ కంపెనీ షేర్ల విలువ గురువారం ఒక్కరోజే 9% పడిపోయింది. ఈ వారంలో 15% క్షీణించింది.
తెలంగాణలో అనుమతులు..ఆరోపణలతో రద్దు
వివాదస్పదమైన సోం డిస్టిలరీస్ సంస్థకు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ ఇటీవల అనుమతులు ఇవ్వడం రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపింది. దీంతో సోం సంస్థ ఇవ్వజూపిన కమీషన్లపై వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ డిమాండ్ చేశారు. ఆ సంస్థ వద్ద కాంగ్రెస్ మూడుసార్లు రూ.25 లక్షల చొప్పున విరాళాలు తీసుకున్నదని క్రిశాంక్ ఇటీవల చెప్పారు. నకిలీ మద్యం తయారు చేసి మరణాలకు కారణమయ్యిందనే ఆరోపణలు ఉన్న సంస్థకు అనుమతులు ఇవ్వడాన్ని ఆయన ఎండగట్టారు. ఈ కంపెనీ మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి రూ.575 కోట్ల మేర ఎగ్గొట్టిన వైనాన్ని వెలుగులోకి తెచ్చారు. దీంతో వెనక్కుతగ్గిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇచ్చిన అనుమతులను తాత్కాలికంగా రద్దు చేసింది.