‘సిరులు కురిపించే సింగరేణి బొగ్గు బ్లాకుల వేలం వద్దే వద్దు.. ఎంతో మంది కార్మికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించే కల్పతరువును ప్రైవేటుపరం చేయొద్దు.. ఏళ్లనాటి సంస్థను నిర్వీర్యం చేయొద్దు.. కార్మికుల భవిష్యత్ను అగమ్యగోచరంగా మార్చే విధానాలను వెంటనే వెనక్కి తీసుకోవాలి.. కేంద్ర ప్రభుత్వం బ్లాకుల వేలంపై నిర్ణయం మార్చుకునేంతవరకు పోరాటం చేస్తాం..’ అంటూ కార్మిక సంఘాలు నినదించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఆందోళనబాట పట్టాయి. కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, టేకులపల్లి ప్రాంతాల్లో బీఆర్ఎస్, టీబీజీకేఎస్, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వేర్వేరుగా మోదీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి 12 వరకు దశలవారీ ఆందోళనలు చేపట్టనున్నట్లు సంఘ నాయకులు తెలిపారు.
ఇల్లెందు, జూలై 3 : బొగ్గు గనుల వేలం ఆలోచనను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని భద్రాద్రి జిల్లా గ్రంథాల య సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్ పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ జాఫర్ హుస్సేన్, దిండిగాల రాజేందర్లు మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుమ్మక్కై తెలంగాణ రాష్ట్రంలోని బొగ్గు బ్లాకులను వేలం వేసేందుకు కుట్రలు చేస్తున్నాయన్నారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న ఇల్లెందు ప్రాంతాన్ని నిర్వీర్యం చేసేందుకు పాలకులు పన్నుతున్న కుట్రలను బీఆర్ఎస్ పార్టీ సమర్థవంతంగా ఎదుర్కొంటుందన్నారు. రాష్ట్రంలోని బెల్ట్ ప్రాంతాలైన ఆరు జిల్లాల్లో దశలవారీగా ఆందోళనలు చేపట్టి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, బీఆర్ఎస్కు ఉద్యమాలు కొత్తేమీ కాదన్నారు. కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకుడు సిలివేరి సత్యనారాయణ, నాయకులు పరుచూరి వెంకటేశ్వరరావు, అబ్దుల్ నభి, మునిగంటి శివ, గిన్నారపు రాజేశ్, సాతాల హరికృష్ణ, డేరంగుల పోశం, ఎస్కే ఖాజా, ఆదూరి రవి, సత్యనారాయణ, చాంద్పాషా, లలిత్పాసి, రవికాంత్, భూక్యా మంగయ్య, భూక్య వెంకన్న, మానియా తదితరులు పాల్గొన్నారు.
టేకులపల్లి, జూలై 3 : బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా ఈ నెల 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఆందోళనలు చేపట్టనున్నట్లు ఏఐటీయూసీ బ్రాంచ్ సహాయ కార్యదర్శి కొంగర వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం కోయగూడెం ఉపరితల గనిలో ఉదయం షిఫ్ట్లో గేట్ మీటింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బొగ్గు గనులను ప్రభుత్వరంగ సంస్థలైన సింగరేణి, కోలిండియాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. గనుల వేలానికి వ్యతిరేకంగా ఈ నెల 5వ తేదీ నుంచి 12 వరకు దశలవారీ ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా 5న కలెక్టర్ కార్యాలయం ముట్టడి, 6 నుంచి 12 వ తేదీ వరకు స్థానిక జీఎం కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్మికులు యూనియన్లకు అతీతంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీజేఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గుగులోతు కృష్ణ, ఫిట్ సహాయ కార్యదర్శి బానోత్ బాలాజీ, షేక్ సర్వర్, సామల శ్రీనివాస్, వెంకటనర్సయ్య, అశోక్, ఇబ్రహీం, నవీన్కుమార్, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెం సింగరేణి, జూలై 3 : తెలంగాణ రాష్ట్రంలోని బొగ్గు బావులన్నింటినీ సింగరేణి సంస్థకే అప్పగించాలని, కేంద్ర ప్రభుత్వం బొగ్గు బావుల ప్రైవేటీకరణను వెంటనే విరమించుకోవాలని టీబీజీకేఎస్, బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కొత్తగూడెం పట్టణంలోని సింగరేణి హెడ్డాఫీస్ ఎదుట బుధవారం ఆందోళన నిర్వహించారు. అనంతరం కేంద్ర, ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలు దహనం చేశారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ కూసన వీరభద్రం, గడప రాజయ్య, తుమ్మ శ్రీనివాస్, బూర్గుల రవి, విజయ్, జీఎస్ శ్రీనివాస్, సూర్యనారాయణ, సూరజ్, జైపాల్, శివ, అరుణ్, అశోక్, వెంకటేశ్వర్లు, చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, వైస్ చైర్మన్ వేల్పుల దామోదర్, కౌన్సిలర్లు వేణుగోపాల్, ప్రసాద్, చుంచుపల్లి ఎంపీపీ బాదావత్ శాంతి, కొట్టి వెంకటేశ్వర్లు, తొగరు రాజశేఖర్, సంకుబాపన అనుదీప్, అన్వర్ పాషా, ఖాజా, గౌస్, మజీద్ పాల్గొన్నారు.
మణుగూరు టౌన్ : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బొగ్గు గనులను వేలం వేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కూనవరం రైల్వే గేట్ సమీపంలో బుధవారం మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు నాగెల్లి ఆధ్వర్యంలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్ పాలనా పగ్గాలు చేపట్టిన 12 రోజుల్లోనే బొగ్గు గనుల వేలానికి శ్రీకారం చుట్టడం సరికాదన్నారు. దీనికి పరోక్షంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. 2017లో 5 కోల్ బ్లాక్లను, ఒడిశాలో రెండు లిగ్నెంట్ గనులను తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై అభ్యంతరం తెలిపితే అక్కడ నామినేషన్ పద్ధతిలో కేటాయించారని గుర్తు చేశారు. నామినేషన్ పద్ధతిలో సింగరేణికి కేటాయించడం వల్ల కలిగే ఇబ్బంది ఏమిటో చెప్పాలన్నారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణి గనులను సింగరేణి సంస్థకు కేటాయించే వరకు టీబీజీకేఎస్ పోరాటాలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఇజ్రాయిల్, రమేశ్, బంగారి పవన్, పద్దం శ్రీనివాస్, ఇమ్రాన్, ముఖేశ్, హరిప్రసాద్, మహేశ్, మురళి, కృష్ణ సుమన్, రామకృష్ణ, వినయ్, రేవన్, రాజేశ్, రమేశ్, కోటి, పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
టేకులపల్లి, జూలై 3 : రాష్ట్రంలోనే అతి పెద్దదైన సింగరేణి సంస్థ మనుగడ కొనసాగాలంటే కోయగూడెం పిట్ 3ని సింగరేణి సంస్థకే కేటాయించాలని గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూక్య నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. బుధవారం కోయగూడెం ఉపరితల గనిలో జరిగిన పిట్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఐఎన్టీయూసీ పిట్ సెక్రటరీ అశోక్కుమార్ ఆధ్వర్యంలో కేవోసీ బొగ్గు గనుల వేలాన్ని నిరసిస్తూ గురువారం సాయంత్రం 4 గంటలకు ఇల్లెందు జీఎం కార్యాలయం ఎదుట మహా ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో బ్రాంచ్ సెక్రటరీ అన్వర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజు, బాసు, రామకృష్ణ, అశోక్, భావ్సింగ్ తదితరులు పాల్గొన్నారు.