Raksha Bandhan | సోదర సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్. ప్రతి శ్రావణ పౌర్ణమి రోజున తోడబుట్టిన అన్నాతమ్ముళ్లతో తమ పేగుబంధం కలకాలం నిలవాలని అక్కాచెల్లెళ్లంతా కోరుకుంటారు. ఈ సందర్భంగా సోదరుల నోరు తీపి చేసి.. సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తారు. అయితే, రాఖీపండుగ సందర్భంగా సోదర సోదరీమణులు కుటుంబంతో కలిసి ఆలయాలకు వెళ్లి పూజలు నిర్వహిస్తూ.. భగవంతుడి ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. అయితే, సోదర సోదరీమణులు కలిసి ఈ ఆలయానికి వెళ్లడం మాత్రం నిషేధం ఉన్నది. హిందూ మతానికి పుట్టినిల్లు అయిన భారత్లోనే ఈ ఆలయం ఉన్నది. ఈ ఆలయం ఎక్కడ ఉందో.. ఎందుకీ నిషేధం అమలులో ఉందో తెలుసుకుందాం రండి..!
ఎంతో ప్రత్యేకత ఉన్న ఈ ఆలయం ఛత్తీస్గఢ్లో ఉన్నది. ఈ ఆలయంలోకి అన్నాచెల్లెల్లు, అక్కాతమ్ముడు కలిసి వెళ్లడంపై నిషేధం ఉన్నది. ఛత్తీస్గఢ్ బలోదాబజార్లోని కస్డోల్ సమీపంలోని నారాయణపూర్ గ్రామంలోని శివాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి దర్శనం కోసం సోదర సోదరీమణులు కలిసి వెళ్లకూడదు. ఈ ఆలయాన్ని ఏడు, ఎనిమిదో శతాబ్దకాలంలో కాలచూరి పాలకులు నిర్మించారు. ఆలయం ఎరుపు, నలుపు ఇసుకరాయితో నిర్మించారు. ఆలయ స్తంభాలపై అనేక అందమైన శిల్పాలను చెక్కారు. ఆలయంలో 16 స్తంభాలు ఉండగా.. ప్రతి ఒక్కదానిపై శిల్పాలను తీర్చిదిద్దారు. దేవాలయంలోనే చిన్న మ్యూజియం సైతం ఉన్నది. ఇక్కడ తవ్వకాల్లో దొరికిన విగ్రహాలను అందులో భద్రపరిచారు.
అన్నా చెల్లెల్లు, అక్కాతమ్ముళ్లు కలిసి వెళ్లకుండా నిషేధించిన ఏకైక ఆలయం ఇదే. దీనికి వెనుక ఓ కథ ప్రచారంలో ఉన్నది. ఆలయ నిర్మాణం రాత్రి సమయంలో జరిగేది. ఈ ఆలయాన్ని ఆరు నెలల్లోనే నిర్మించారు. ఈ ఆలయానికి గిరిజన ఆచారాలతో ముడిపడి ఉన్నది. శిల్ప నారాయణ్ రాత్రిపూట ప్రతిరోజూ నగ్నంగా ఆలయాన్ని నిర్మించే వారు. ఆలయాన్ని నిర్మిస్తున్న నారాయణ్కు ప్రతి రోజూ ఆయన భార్య భోజనం తీసుకువచ్చేది. కానీ, ఒక నాటి సాయంత్రం నారాయణ్ భార్యకు బదులుగా ఆయన సోదరి భోజనాన్ని తీసుకొని ఆలయ నిర్మాణ ప్రాంతానికి వచ్చింది. దీంతో అవమానంగా భావించిన ఆయన.. గుడి శిఖరంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో సోదర సోదరీమణులు ఆలయంలోకి ప్రవేశం నిషేధించారు. ఈ ఆలయం నిర్మాణ శైలి సైతం ప్రసిద్ధి చెందింది. ఆలయంపై హస్తప్రయోగం, శృగారానికి సంబంధించిన తదితర శిల్పాలు చెక్కి ఉంటాయి. దాంతో అన్నాచెల్లెల్లు కలిసి రావడం కాస్త అసౌకర్యానికి గురయ్యే ఛాన్స్ ఉంటుంది.