యాదాద్రిలో మహా కుంభ సంప్రోక్షణ పర్వం
కాళేశ్వర జలాలతో స్వామివారికి అభిషేకం
సుదర్శన, ప్రతిష్ఠామూర్తులకు అగ్నిసంస్కారం
స్వయంభువుల అనుమతితో సంప్రోక్షణ పర్వం
యాగశాలలోకి ప్రవేశించిన ఉత్సవ మూర్తులు
నేటి నుంచి సాప్తాహ్నిక పంచకుండాత్మక యాగం
యాదాద్రి, మార్చి 21: నమో నారసింహాయ మంత్రోచ్చారణ, రుత్విక్కుల వేదఘోష, స్వామివారి పాదాలచెంతకు తరలివచ్చిన కాళేశ్వర జల గలగలల మధ్యన దివ్య మనోహరంగా.. యాదాద్రి నారసింహుడి పునరావిష్కరణ పర్వం సోమవారం ప్రారంభమైంది. స్వామివారి పవిత్ర జన్మ నక్షత్రం సందర్భంగా తెల్లవారుజామున 4 గంటలకు బ్రాహ్మీ ముహూర్తంలో 108 కలశాలతో అష్టోత్తర శత ఘటాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులను సమ్మోహనంగా అలంకరించి బాలాలయంలో ఆస్థానింపజేశారు. అనంతరం మహాకుంభ సంప్రోక్షణకు అంకురార్పణ జరిగింది. వాస్తుహోమం, పర్వగ్నకరణం, రుత్విగ్వరణం, మృత్సంగ్రహణ పూజలతో అటు ప్రధానాలయం, ఇటు బాలాలయంలో పాంచరాత్రాగమం ప్రకారం శాస్ర్తోక్తంగా జరిగింది. ప్రధానాలయంలో స్వయంవ్యక్తమూర్తి అనుమతిని మంత్రపూర్వకంగా తీసుకొని ఆ తరువాత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ముందుగా స్వస్తివాచనం, విష్వక్సేన పూజ, రక్షాబంధనం, పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రాశన అనంతరం అఖండజ్యోతి ప్రజ్వలన చేశారు.
రక్షాబంధనం
‘రక్ష్యా పిక్ష్యాః ఉపేక్షతే’ అన్నట్టుగా స్వామివారి దీక్ష కంకణాన్ని స్వామివారికి, అర్చకులు, రుత్విక్కులు, ఆలయ అధికారులకు ధరింపజేశారు. ఎలాంటి అశూచి, ఆపవిత్రత కలుగకుండా స్వామివారి కైంకర్యాన్ని నిర్విఘ్నంగా జరిగేలా శరీరం సహకరించేందుకు శక్తిని ఇచ్చేందుకు రక్షాబంధనం చేపట్టారు. మంత్రపుష్పనీరాజనాలతో స్వామివారి స్వస్తివాచనం పూర్తి చేశారు. పునర్నిర్మాణం జరిగిన సముదాయాల్లో వాస్తు దోషాలు లేకుండా ఉండేందుకు ప్రధానాలయ ముఖ మంటపంలో వాస్తు హోమం, వాస్తు పూజలు, వాస్తు బలిని నిర్వహించారు. ముఖ మండపంలో వాస్తుమూర్తిని చిత్రీకరించి అష్టబలి నిర్వహించారు. వాస్తు పర్వగ్నకరణంలో భాగంగా విమానగోపురంతోపాటు ఆండాళ్, ఆళ్వారులు, సుదర్శనం, గరుత్మంతుడి విగ్రహం, విష్వక్సేనుడి విగ్రహం, బలిపీఠాలు, ధ్వజస్తంభం అగ్ని సంస్కారం చేపట్టారు.
నారసింహుడి పాదాల చెంతకు గోదావరి జలాలు..
ఎక్కడ గోదారి.. ఎక్కడి యాదాద్రి. త్రివేణి సంగమం నుంచి బయల్దేరి వేములవాడ రాజన్నను.. సిద్దిపేట రంగనాయకుడిని.. కొమురెల్లి మల్లన్నను అభిషేకించి యాదాద్రి లక్ష్మీనరసింహుడి పాదాల చెంతకు చేరుకొన్నది. రెండు రోజుల క్రితం మల్లన్నసాగర్ నుంచి విడుదలైన గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతూ, పరుగులు పెడుతూ యాదాద్రి క్షేత్రాన ఉన్న గండి చెరువులోకి వచ్చి చేరాయి. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత పూజలు నిర్వహించి గండి చెరువుకు నీటిని విడుదల చేశారు. మధ్యాహ్నానికి గండిచెరువులోకి నీళ్లు వచ్చి చేరాయి. యాదాద్రి నారసింహుడి తెప్పోత్సవం, నిత్య కైంకర్యాలు, భక్తులకు నీటి ఇబ్బందులను తీర్చేందుకు
వచ్చిన పుణ్య జలాలను చూసి భక్తజనం మురిసిపోయింది. కాళేశ్వర జలాలతోనే ఆలయం, యాగశాల సంప్రోక్షణ, పుణ్యాహవాచనం, స్వామి అభిషేకాలను నిర్వహించారు.
శోభాయమానంగా యాగశాల ప్రవేశం
సాయంకాలం 6 గంటలకు మృత్సంగ్రహణం, అంకురారోపణం, కుంభస్థాపన కార్యక్రమాలను ఆలయ ప్రధానార్చకులు నల్లంథిఘల్ లక్ష్మీనరసింహాచార్యులతోపాటు యజ్ఞాచార్యులు, ఉప ప్రధానార్చకులు, అర్చక బృందం, రుత్విక్కులు నిర్వహించారు. స్వామివారి యాగశాల ప్రవేశం సందర్భంగా గోవింద నామస్మరణతో బాలాలయ ప్రాంగణం మార్మోగింది. మంగళవారం యాగశాలలోని ఐదు కుండాలలో అగ్ని ప్రతిష్ఠ జరిపి సాప్తాహ్నిక పంచకుండాత్మక యాగాన్ని ప్రారంభించనున్నారు. వేడుకల్లో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి, ఆలయ అనువంశిక ధర్మకర్త బీ నరసింహమూర్తి, ఈవో ఎన్ గీత, సహాయ కార్యనిర్వహణాధికారులు, ఉద్యోగులు, భక్తులు పాల్గొన్నారు.