హైదరాబాద్: హైదరాబాద్ కోఠీలో ఉన్న గోకుల్ చాట్లో (Gokul Chat) బాంబు పేలుళ్లు సంభవించి 17 ఏండ్లు పూర్తయ్యింది. 2007, ఆగస్టు 25న కోఠి గోకుల్ చాట్, లుంబినీ పార్కు వద్ద జరిగిన బాంబు పేలుళ్లులో చాలా మంది అమరులయ్యారు. చాలా మంది గాయపడ్డారు. గాయపడిన బాధితుల్లో సయ్యద్ రహీం ఒకరు. రహీం కన్నుపోయింది. ఈ పేలుళ్ల ఘటనను గుర్తు చేసుకుంటూ ఆదివారం మిగతా బాధితులతో కలిసి సయ్యద్ రహీం కొవ్వొత్తులతో నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2007, ఆగస్టు 25న జరిగిన జంట పేలుళ్లలో 42 మంది అమాయక ప్రజలు మృత్యువాత పడ్డారని, సుమారు 300లకు పైగా తీవ్రంగా గాయపడి నేటికి మానని గాయంగానే మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పేలుళ్లు జరిగిన రోజే మరణించినా బాగుండేదని, గాయాలతో జీవించలేని పరిస్థితిలో ఉన్నామన్నారు.
ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి తమలాంటి బాధితులకు న్యాయం చేయాలన్నారు. ప్రతి ఏడాది ఆగస్టు 25న బాంబు పేలుళ్ల బాధితులు కలిసి ఈ ఘటనలో అమరులైన వారికి నివాళులర్పిస్తున్నామన్నారు. ఈ పేలుళ్లలో తాను ఒక కన్ను పూర్తిగా కోల్పోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉన్న నగరంలో జరిగిన ఉగ్ర దాడితో నెత్తుటి మరకలు నేటికి చెదిరిపోలేదన్నారు. బాంబు పేలుళ్ల బాధితుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు స్పందించి డబుల్ బెడ్రూం ఇండ్లు, బస్పాస్ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు.