జరిగిన కథ : కారణజన్ముడై పుట్టినవాడు శ్రీదర్శనుడు. దురదృష్టవశాత్తూ జూదరి అయ్యాడు. ఆస్తి మొత్తం కోల్పోయాడు. చివరికి ముఖరకుడనే స్నేహితుడి సాయంతో వ్యసనం వదులుకున్నాడు. శ్రీదర్శనుడు, ముఖరకుడు, అతడి చెల్లెలైన పద్మిష్ట కలిసి మాళవ దేశం చేరుకున్నారు. మాళవరాజు క్షయరోగాన్ని పోగొట్టేందుకు శ్రీదర్శనుడు భేతాళవశ్యం చేశాడు.
శ్రీసేన మహారాజుకు క్షయరోగం నయమైపోయింది. కానీ అప్పటికే ఆయన వృద్ధుడు. జబ్బు చేయడం వల్ల ఆయనలో వైరాగ్యభావం అంకురించింది. తన జబ్బు నయం కావడానికి సాయపడిన వారికి ముందుగా అర్ధరాజ్యమిస్తానని ప్రకటించినవాడు కాస్తా.. శ్రీదర్శనుడి ముఖం చూసేసరికి తన రాజ్యం మొత్తాన్ని అతనికే సమర్పించాడు. తాను వానప్రస్థానానికి వెళ్లిపోయాడు.
శ్రీదర్శనుడు రాజైన తరువాత, పద్మిష్టను వివాహం చేసుకున్నాడు. ముఖరకుడు ప్రధానమంత్రి అయ్యాడు. వారు ప్రజారంజకంగా పాలన సాగిస్తుండగా..ఒక వింత జరిగింది.మాళవదేశానికి చెందిన శోభావతీ నగరంలో ఉపేంద్రశక్తి అనే పేరుగల రత్న వర్తకుడు ఒకడు ఉండేవాడు. అతడొకసారి ద్వీపాంతరాలలో వర్తకం చేసి.. చాలా ధనం సంపాదించుకుని ఇంటికి తిరిగివస్తున్నాడు. ఓడ నడిపేందుకు అనువైన గాలికోసం ఎదురుచూస్తూ ఒకచోట రెండు రోజులు ఆగాల్సి వచ్చింది. ఆ సమయంలో అతని దగ్గరికి కొందరు దొంగలు వచ్చారు.
వారివద్ద ఒక మరకత మణిఫలకం ఉంది. ఆ ఫలకంపై ఒక సుందరమైన అమ్మవారి బొమ్మ చెక్కి ఉంది. ఆ విగ్రహంలో అదేం మాయో కానీ.. ఒకవైపు నుంచి చూస్తే లక్ష్మీ స్వరూపం, మరోవైపు నుంచి చూస్తే సరస్వతి, ఇంకొకవైపు నుంచి పార్వతి కనిపిస్తుంది.రత్నాల విలువ తెలిసిన ఉపేంద్రశక్తి ఆ విగ్రహాన్ని అరవైవేల వరహాలకు బేరమాడి కొనుక్కుని, ఓడలో ఎక్కించాడు. కొన్నిదినాలకు శోభావతికి చేరి, భార్యకు ఆ విగ్రహాన్ని చూపాడు. దానిని చూస్తూనే ఆమెలో భక్తిభావం పొంగిపొర్లింది.
“నాథా! ఈ విగ్రహం జీవకళతో తొణికిసలాడుతున్నది. నేను దీనిని పూజించుకుంటాను. నా పూజాగృహంలో ఉంచండి” అని కోరింది.“పిచ్చిదానా! దీనివిలువ మూడుకోట్లకు పైగా ఉంటుంది. అరవైవేల వరహాలు పోసి కొన్నాను. అంత సొమ్ము ఊరికే పోగొట్టుకోమంటావా?! మనం వర్తకులం. మన ధర్మం పాటించాలి కానీ, మూఢభక్తికి పోకూడదు” అని భార్యతో చెప్పి, ఒకసారి విగ్రహం కేసి తదేకంగా చూశాడు.
“దీనిని ఏకమొత్తంగా ఎవడూ కొనలేడు. ముక్కలు కొట్టి అమ్మేస్తాను” అన్నాడు.
వర్తకుని భార్య లెంపలేసుకుంటూ..
“అయ్యయ్యో! ఈ విగ్రహాన్ని చూస్తుంటే ఏదో లోకం నుంచి దిగివచ్చినట్లుంది. ఇంత చక్కని విగ్రహాన్ని పగలగొడితే కళ్లుపోతాయి” అన్నది.“పిచ్చినమ్మకాలు పెట్టుకోబోకు” అంటూ భార్యను కసిరి, అప్పటికప్పుడు ఆ విగ్రహాన్ని పగలకొట్టించడానికి పనివాళ్లను పురమాయించాడు వర్తకుడు.ఆ వచ్చిన వాళ్లకు చేతులు రాలేదు.“అయ్యా! ఇంత చక్కటి విగ్రహాన్ని చేజేతులా పగలకొట్టలేం!” అన్నారు వాళ్లు.వాళ్లను పురుగుల్లా చూసి, వర్తకుడే స్వయంగా సమ్మెట పట్టుకుని వాటం చూసి కొట్టబోయాడు. విచిత్రంగా అప్పుడే అతనికి కళ్లు కనిపించడం మానేశాయి. సమ్మెట కిందపారేసి, కళ్లు నులుముకోసాగాడు.భార్యను పిలిచి, కంట్లో నలకలు పడ్డాయేమో చూడమన్నాడు. ఆమె పరీక్షించి చూసి..
“అయ్యో! తెల్లగుడ్లు పడ్డాయి” అన్నది భయంగా.
“ఒసేయ్.. నీది విషపునోరు. ముందుగానే కళ్లు పోతాయని శపించావు. అన్నంతపనీ జరిగింది. ఇప్పుడేం చేయమంటావో చెప్పి తగలడు” అని విసుక్కున్నాడు వర్తకుడు బాధగా.“అమ్మవారిని పూజించుకుంటానని, చెడు తలపెట్టనని ఒప్పుకొని, లెంపలేసుకుని మొక్కుకోండి” అన్నది అతని భార్య.వర్తకుడు అలాగే చేసేసరికి విచిత్రంగా మళ్లీ కళ్లు వచ్చాయి. ఆనాటినుంచి ఆ ఇల్లాలు ఆ విగ్రహాన్ని పూజించుకుంటూ వస్తున్నది. వర్తకుడు మాత్రం జరుగుతున్నదానికి మనసులో కుళ్లుకుంటూనే ఉన్నాడు. కానీ చేసేదేం లేక ఊరుకున్నాడు.
ఒకరోజున ఆ ఇల్లాలు అమ్మవారి విగ్రహానికి పూజచేసి, నిద్రపోయింది. స్వప్నంలో అమ్మవారు కనిపించి..
“పుత్రీ! మీ ఇంట్లో నాకు పెడుతున్న నైవేద్యం చాలడం లేదు. నన్ను ఏదైనా ఆలయంలో ప్రతిష్ఠించి, నిత్యపూజలు జరిగేలా చూడు” అని సెలవిచ్చింది.
మెలకువ వచ్చిన తరువాత ఆ విషయాన్ని ఆమె భర్తతో చెప్పింది.
“గుడి కట్టించడం అనేది సప్తసంతానాలలో ఒకటని చెబుతారు. మనకెలాగూ పిల్లలు లేరు. ఈ రూపంగా అయినా ఆ లోటు తీరుతుంది” అని చెప్పింది. ఆ మాటతో వర్తకుడు గుండె బద్దలైపోయింది. అంత ఖర్చుకు తన కంఠంలో ప్రాణం ఉండగా ఒప్పుకోలేడు.
అందువల్ల..
“పిచ్చిదానా! గుడి కట్టిస్తే ఇంకేమైనా ఉందా? అది దొంగసొమ్ము. పట్టుబడితే శిక్ష తప్పదు. అందువల్ల ఓ పనిచేస్తాను. ఈ దేవీ విగ్రహాన్ని మహారాజుకు ఇచ్చేస్తాను. ఆయనే ఏదైనా చేయనీయి” అంటూ భార్య ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా.. ఆ విగ్రహాన్ని తీసుకుపోయి శ్రీదర్శనుడికి బహుమతిగా సమర్పించాడు. ఆ విగ్రహ చాతుర్యాన్ని గమనించిన శ్రీదర్శనుడు ఆ వర్తకుడికి రెండు గ్రామాలను బహుమతిగా ఇచ్చాడు. ఆ తరువాత తన కోటకు ఎదురుగా గొప్ప దేవీ ఆలయాన్ని నిర్మించాడు. అందులో విగ్రహాన్ని ప్రతిష్ఠించి.. నిత్యం దేవిని అర్చించేవాడు.
ఆ దేవీ విగ్రహం వచ్చింది మొదలు రాజ్యంలో కరువు కాటకాలు లేకుండా పోయాయి. వానలు సకాలంలో పడసాగాయి. పంటలు చక్కగా పండుతున్నాయి. ప్రజలందరూ సుఖజీవనులై, నీతివర్తనులై మసలుకోసాగారు. ఇదంతా దేవీ మహిమే అని ప్రచారం జరిగింది. దాంతో ఆ గుడి ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా మారిపోయింది.
ఇలా ఉండగా ఒకనాటి తెల్లవారుజామునే శ్రీదర్శనుడు తన మిత్రుడైన ముఖరకుణ్ని వెతుక్కుంటూ వచ్చాడు. అప్పటికింకా ముఖరకుడు పక్కమీదనుంచి లేవనే లేదు. ఎదురుగా కనిపించిన మహారాజును చూసి నిర్ఘాంతపోయిన ముఖరకుడు..
“ఏమిటి?” అని ప్రశ్నించేలోపుగా అతనే చెప్పాడు..
“మిత్రమా! నేను జూదంలో సర్వమూ కోల్పోయి ప్రాణత్యాగం చేయాలని సంకల్పించినప్పుడు నువ్వు భూనందన మహారాజు కథ చెప్పావు కదా! ఆ మహారాజు కలలో కనిపించిన చిన్నదాన్ని పొందడం కోసం పాతికేళ్లు తపస్సు చేశాడు. చివరికి పొందగలిగాడు. సరిగ్గా ఇప్పుడు నా విషయంలో కూడా అలాగే జరిగింది” అన్నాడు.
“ఏమైంది మిత్రమా!” అని అడిగాడు ముఖరకుడు.
“నిన్నరాత్రి నా కలలో ఒక దివ్యాంగన కనిపించింది. ఆమె నా ఒంటిమీద హారాలను తాను ధరించి.. తన నగలను నాచేత ధరింప చేసింది. చూడు వీటిని..” అంటూ చూపాడు.
“నిజమే! ఇవి ఆడవాళ్ల నగలే..” అని ఆశ్చర్యం వ్యక్తంచేశాడు ముఖరకుడు. మళ్లీ తనే.. “అయితే నువ్వు కూడా భూనందన మహారాజులాగా కలలో కనిపించిన సుందరిని చేపట్టగలవు” అన్నాడు.
“కానీ ఆయనలాగా తపస్సు చేసే శక్తిమాత్రం నాకు లేదు సుమా! ఎలా నెరవేరుతుందో మరి కల?! అంతా దేవి దయ” అని ఆ పూటకు వెళ్లిపోయాడు శ్రీదర్శనుడు.
అది జరిగిన మూడోనాడు ప్రతీహారి వచ్చి..“మహారాజా! మీకోసం ఎవరో యోగిపుంగవులు వేచి ఉన్నారు. మీ సెలవైతే మీ ఎదుటకు తీసుకువస్తాను” అన్నాడు.“యోగులను ఆటంకపరచ కూడదురా శుంఠా! వెంటనే తీసుకురా” అని కసురుకున్నాడు శ్రీదర్శనుడు.ఆ యోగిని ఉచితాసనంపై కూర్చోబెట్టి తగినరీతిగా సత్కరించిన తరువాత..
“తమరు వచ్చిన పని సెలవివ్వండి మహాత్మా!” అని కోరాడు శ్రీదర్శనుడు.“రాజా! మాది మణిద్వీపం. ఇక్కడికి నాలుగు సముద్రాల అవతల ఉన్నది. అనంగచంద్రుడనే మహారాజు మా ద్వీపాన్ని పాలిస్తున్నాడు. నేను ఆయన పురోహితుణ్ని. మా మహారాజుకు అనంగలతిక అనే కూతురున్నది. ఆమె ఎంతో ఇష్టంగా పూజించుకుంటున్న దేవీ విగ్రహం దొంగలపాలైంది. దానిని వెతుక్కుంటూ బయల్దేరిన నాకు.. ఆ విగ్రహం మీ కోటముందే కొలువై ఉందని తెలిసింది. దయచేసి మా విగ్రహాన్ని మాకు అప్పగించేస్తే వెళ్లిపోతాను” అన్నాడు.
ఆ మాటతో శ్రీదర్శనుడు ఒక్కక్షణం మ్రాన్పడిపోయాడు. కొద్దిగా తేరుకుని..“మహాత్మా! అమ్మవారిని కొద్దిరోజుల కిందటే ఇక్కడ ప్రతిష్ఠించాం. ఆమెనిప్పుడు మా రాజ్య ప్రజలందరూ కొలుచుకుంటున్నారు. మేం ప్రతిష్ఠించిన దైవాన్ని మేమే మా చేజేతులా పెరికి ఇవ్వాలనడం న్యాయమా?! ఆ విగ్రహాన్ని మేం దొంగిలించలేదు. ఆమె తనంతతానుగా మా దగ్గరికి వచ్చింది. మీరు, మీ ప్రభువులు కూడా ఇక్కడికే వచ్చి అమ్మను దర్శించుకోవచ్చు. అందుకభ్యంతరం లేదు” అని పలికాడు.
“మహారాజా! మా అనంగచంద్రుడు సామాన్యుడు కాదు. నీపై యుద్ధం ప్రకటించగలడు. తరువాత నీ ఇష్టం” అన్నాడు పురోహితుడు.
“సంతోషం స్వామీ! మేము మా చేతులతో విగ్రహాన్ని పెరకలేం. ఆయనే వచ్చి, మాపై గెలిచి విగ్రహాన్ని పెరికితే మా తప్పుండదు. మీరెలా అనుకుంటే అలాగే కానివ్వండి” అని రెండుచేతులూ ఎత్తి నమస్కరించాడు శ్రీదర్శనుడు.
ఆ యోగి ఆగమేఘాలమీద మణిద్వీపానికి వెళ్లాడు. తన ప్రభువుకు, అనంగలతికకు ఈ విషయాన్ని తెలియచేశాడు.
“మాళవరాజ్యంపై దండయాత్ర ప్రారంభించండి” అని అప్పటికప్పుడు అనంగచంద్రుడు తన సైన్యాధ్యక్షుణ్ని ఆజ్ఞాపించాడు.
సముద్రమధ్యంలో ఉన్న రాజ్యం కనుక.. సైన్యాన్ని తరలించడం కష్టతరమైన ప్రక్రియ. ఆ ప్రక్రియ మొదలయ్యేలోపుగానే రాకుమార్తె అనంగలతిక, తన చెలికత్తెతో పాటు.. పురోహితుణ్ని వెంటపెట్టుకుని మారువేషంలో మాళవ రాజ్యానికి చేరుకుంది.
తన ఇష్టదైవానికి జరుగుతున్న ఉత్సవాలను, మహావైభోగాలను తిలకించి చాలా సంతోషించింది.
“గురుదేవా! ఈవిడ మన ఊరిలో ఉంటే ఇంత వైభవం ఉండదు కదా!” అన్నది.
రాకుమార్తె మనసు మారుతున్నదని తెలిసి, గురువు సంతోషించాడు. అంతలో అక్కడికి శ్రీదర్శనుడు వచ్చాడు. అతణ్ని చూడగానే అనంగలతిక గుర్తించింది. ఒకనాడు తన స్వప్నంలో ఈ మహాపురుషుణ్ని ఆమె చూసింది. తన నగలను అతనికి ధరింపచేసి, అతని నగలను తాను దాల్చింది. అనంగలతిక తన నగలను శ్రీదర్శనుడి ఒంటిపై చూడగానే గుర్తించింది. కానీ శ్రీదర్శనుడు ఆమెను చూడలేదు.
ఈ విషయాన్ని ఆమె చెలికత్తె ద్వారా పురోహితునికి తెలియచేసింది. అనంగలతిక ఇచ్చిన హారాన్ని తీసుకుని, పురోహితుడు శ్రీదర్శనుడితో రాయబారం నిర్వహించాడు.
తన స్వప్నం నిజమైందని తెలిసి శ్రీదర్శనుడు సంతోషం పట్టలేకపోయాడు. అనంగలతికను తన ప్రియభార్యగా చేపట్టడానికి వెనువెంటనే అంగీకారం తెలియచేశాడు. ఈలోగా మణిద్వీపంనుంచి సైన్యాలు వచ్చాయనే వార్త తెలియవచ్చింది. పురోహితుడు ముందుగా నగరు శివార్లలోకి వెళ్లి యుద్ధాన్ని విరమింప చేశాడు.
శ్రీదర్శనుడు – అనంగలతిక వివాహం మహావైభవంగా జరిగింది.కాలగర్భంలో కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. శ్రీదర్శనుడికి ఇద్దరు భార్యల వల్ల ఇద్దరు పుత్రులు, మరికొందరు పుత్రికలు కలిగారు.ఒకనాడు భార్యలతో అంతఃపురంలో వినోదిస్తుండగా వాకిట్లో ఎవరో బ్రాహ్మణుడు ఏడుస్తున్న సవ్వడి వినిపించింది. ఆ ఆక్రందన విని శ్రీదర్శనుడు భార్యాసమేతుడై బయటికి వచ్చాడు.
అప్పుడా బ్రాహ్మణుడు..
“నాలో అగ్నిదీప్తి పుడుతూనే అట్టహాసయుక్తితో ప్రజ్వరిల్లి ధూమరేఖలు ఎగసిపడతాయి. నేను చేపట్టిన ఈ దహనంతో కాలమనే మేఘం వల్ల కమ్మిన చీకట్లు చల్లారిపోతాయి” అని అర్థం వచ్చే పద్యం చదివి, అంతర్ధానమైపోయాడు.శ్రీదర్శనుడికి ఆ పద్యభావం ఏమిటో ఒక్కముక్కా అర్థం కాలేదు. కానీ, అతని భార్యలైన పద్మిష్ట, అనంగలతిక ఒక్కసారిగా విరుచుకు పడిపోయారు. నాడి అందలేదు. వైద్యులు వారిద్దరూ మృతిచెందినట్లుగా ప్రకటించారు. ఒకేసారి ఇద్దరు భార్యలనూ పోగొట్టుకున్న దుఃఖంలో శ్రీదర్శనుడు సొమ్మసిల్లి పడిపోయాడు. స్నేహితుడైన ముఖరకుడే జరగాల్సిన కార్యక్రమమంతా దగ్గరుండి జరిపించాడు.
మూడోనాటికి శ్రీదర్శనుడికి స్వస్థత చేకూరింది. అతనికి రాజ్యంపై ఆశ నశించింది. వారసులకు సింహాసనం అప్పగించి, వానప్రస్థానానికి వెళ్లిపోయాడు. నిర్జనారణ్యంలో పళ్లు, కందమూలాలు తింటూ తీవ్ర తపోదీక్షలో మునిగిపోయాడు.ఒకనాడు ఒక రావిచెట్టు నీడలో కూర్చుని ఉండగా.. ఇద్దరు దివ్యకన్యలు ఆ చెట్టు దిగి వచ్చారు. వాళ్లను చూసి శ్రీదర్శనుడు ఆశ్చర్యపోయాడు. “ఎవరు మీరు? ఇక్కడికెలా వచ్చారు?” అని ప్రశ్నించాడు.
(వచ్చేవారం.. నలకూబరుని శాపం)
అనుసృజన: నేతి సూర్యనారాయణ శర్మ