హాథ్రాస్: యూపీలోని హాథ్రాస్లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. భోలే బాబా నిర్వహించిన సత్సంగ్లో ఈ విషాదం చోటుచేసుకున్నది. భోలే బాబా అసలు పేరు నారాయణ్ సాకార్ హరి. తనను తాను దేవుడికి శిష్యుడిగా ప్రకటించుకొని ఆధ్యాత్మిక ప్రసంగాలు ఇస్తుంటాడు. తొక్కిసలాటలో మృతిచెందిన వారంతా ఈయన భక్తులే.
నారాయణ్ హరి స్వస్థలం యూపీలోని ఈటా జిల్లాలో బహదూర్ గ్రామం. గతంలో ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)లో పనిచేసినట్లు ఆయనే చెప్పుకున్నారు. ఆధ్యాత్మిక జీవితం కోసం 26 ఏండ్ల క్రితం ఉద్యోగాన్ని వదిలేశానని చెబుతుంటాడు. ఆయన అనుచరులు అలీగఢ్లో ప్రతి మంగళవారం సత్సంగ్ నిర్వహిస్తుంటారు. కాషాయ వస్త్రాలు ధరించకుండా, సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ.. ఆధ్యాత్మిక ప్రసంగాలు చేయటం ఈయన స్టెల్.
ఖరీదైన అద్దాలు, తెల్లని సూట్, టై ధరించి ఈయన నిర్వహించే ‘సత్సంగ్’ కార్యక్రమాలకు పశ్చిమ యూపీలో భక్తులు పెద్ద ఎత్తున ఉన్నారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీతోపాటు దేశవ్యాప్తంగా భోలే బాబాకు లక్షల మంది అనుచరులు ఉన్నారు.
భోలే బాబాను సూరజ్ పాల్ సింగ్ అని కూడా కొందరు భక్తులు పిలుస్తుంటారు. యూపీ పోలీసు శాఖలో హెడ్ కానిస్టేబుల్గా చేశాడు. ఆ శాఖతో అనుసంధానమైన ఇంటెలిజెన్స్ యూనిట్లో సుమారు 18 ఏళ్లు పనిచేసినట్లు చెప్పుకుంటాడు. 1999లో స్వచ్ఛంధ పదవీవిరమణ తీసుకున్నాడు. సూరజ్ పాల్ సింగ్ ణుంచి నారాయణ్ సాకార్ హరిగా అతని పేరు మార్చుకున్నాడు. ఆ తర్వాత సత్సంగ్లు నిర్వహించడం మొదలుపెట్టాడు. ఆధ్యాత్మికత, ప్రపంచ శాంతి దిశగా తన మనసు మారినట్లు ఆయన తన అనుచరులకు చెప్పేవాడు.
తన స్వంత ఊళ్లో ఓ గుడిసెలో సూరజ్ పాల్ జీవించేవాడు. అయితే యూపీ అంతటా అతను సత్సంగ్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవాడు. యూపీతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్లోనూ ఆయనకు ఫాలోయింగ్ ఉన్నది. ఫాలోవర్లు ఇచ్చే డబ్బును ఎప్పుడూ వారికే ఖర్చు చేస్తుంటానని అతను సత్సంగ్లలో చెపుతుంటారు.
భోలే బాబా మీడియాకు దూరంగా ఉంటాడు. కోవిడ్ సమయంలోనూ అతను సత్సంగ్ నిర్వహించి వివాదానానికి కారణమయ్యాడు. 2022లో కోవిడ్ డెల్టా వేరియంట్ విజృభిస్తున్న సమయంలో అతను ఫరుకాబాద్లో సత్సంగ్ నిర్వహించాడు. 50 మందికే అనుమతి ఇస్తే 50వేల మంది ఆ మీటింగ్కు హాజరయ్యారు.
పాదాలను తాకే ప్రయత్నంలోనే..
సత్సంగ్ ముగుస్తుండగా తొక్కిసలాట చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. భోలే బాబా వెళ్తుండగా ఆయనను దగ్గరగా దర్శనం చేసుకునేందుకు, ఆయన పాదాలు తాకేందుకు, ఆయన పాదాలు తాకిన మట్టిని తీసుకునేందుకు భక్తులు పోటీ పడ్డారని తెలుస్తున్నది. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగిందని చెప్తున్నారు.