న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిధిగా ప్రధాని మోదీ(PM Modi) పాల్గొన్నారు. సుమారు 3 వేల మందికిపైగా విద్యార్థులు ఈ ఈవెంట్కు హాజరయ్యారు. దీంట్లో 587 మంది పీహెచ్డీ స్కాలర్లు ఉన్నారు. వారికి డిగ్రీ పట్టాలను అందజేశారు. తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. పరం ప్రాగ్యా .. హై పర్ఫార్మెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సూపర్కంప్యూటింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఐఐటీ ఢిల్లీ సోనిపేట్ క్యాంప్లో ఈ సెంటర్ను ఆవిష్కరించారు. అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, భారత టెక్నాలజీ రంగంలో ఏఐ ప్రాముఖ్యతను తెలిపారు. విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. యూనివర్సిటీని వీడుతున్న విద్యార్థులకు ఆయన కంగ్రాట్స్ చెప్పారు. విద్యార్థుల కుటుంబాలు, టీచర్లు, మెంటర్లను ఆయన మెచ్చుకున్నారు. డిగ్రీలతోనే కాదు, ఎంతో అనుభవం విద్యార్థులు వర్సిటీని వీడుతున్నట్లు ప్రధాని తెలిపారు.
ఐఐటీలో చదువుకోవడం వల్ల.. సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించే సామర్థ్యం విద్యార్థులకు వచ్చినట్లు చెప్పారు. దేశానికి సేవ చేయాల్సిన బాధ్యత కూడా ఆ విద్యార్థులపై ఉందని ప్రధాని పేర్కొన్నారు. కోవిడ్19 మహమ్మారి వేళ జరిగిన ఐఐటీ ఢిల్లీ స్నాతకోత్సవంలో వర్చువల్గా పాల్గొన్నానని, ఇప్పుడు భౌతికంగా ఇక్కడకు రావడం సంతోషంగా ఉందన్నారు. సాంకేతిక రంగంలో చాలా విప్లవాత్మక రీతిలో మార్పులు జరుగుతున్నాయని, రాబోయే 20 నుంచి 30 ఏండ్లలో ప్రపంచం మరోలా కనిపిస్తుందన్నారు. టెక్నాలజీ, పరిశ్రమలు, ప్రొఫెషన్స్ ఎప్పుడూ మారుతుంటాయని, కానీ ఎప్పుడూ నేర్చుకోవడమే కీలకమైన అంశంగా మిగులుతుందన్నారు. ఎవరైతే కొత్త విషయాలను నేర్చుకుంటారో, వారే విజేతలుగా నిలుస్తారని ప్రధాని అన్నారు. కొత్తగా ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించే ధైర్యాన్ని విద్యార్థులు ప్రదర్శించాలన్నారు. అవరోధాలను అవకాశాలుగా మార్చుకోవాలన్నారు.
అకాడమిక్ జీవితంతో పాటు క్యాంపస్ బయటి ప్రపంచం గురించి వివరిస్తూ. ఐఐటీ పరీక్షల్లో కచ్చితమైన సిలబస్ ఉంటుందని, కానీ జీవితమనే పరీక్షలో మాత్రం, అన్నీ సిలబస్లో లేని అంశాలే ఉంటాయన్నారు. కానీ ఉత్సుకతతో ఉండాలని ఆయన విద్యార్థులను ఎంకరేజ్ చేశారు. వ్యవస్థీకృత సిద్ధాంతాలను ప్రశ్నిస్తూనే.. వాటికి తగిన పరిష్కారాన్ని కనుగొనే ధైర్యాన్ని కలిగి ఉండాలన్నారు. స్పేస్ టెక్నాలజీ, సెమీకండక్టర్స్, డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లు, క్రిటికల్ మినరల్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఎనర్జీ స్టోరేజ్ లాంటి రంగాలు విస్తృతంగా వ్యాపిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
దేశంలోని యువత ఆవిష్కరణల వల్ల స్టార్టప్ వ్యవస్థ, డిజిటల్ ఎకానమీ బలోపేతం అయ్యిందన్నారు. పరిశోధనా రంగం మరో కీలకమైన అంశమన్నారు. ప్రైమ్మినిస్టర్స్ రీసర్చ్ ఫెల్లోషిప్, ద రీసెర్చ్, డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్, అనుసంధాన్ నేషనల్ రీసర్చ్ ఫౌండేషన్ వ్యవస్థలను వాడుకోవాలన్నారు. పరిశోధనా, అధ్యయన వ్యవస్థలను బలోపేతం చేసేందుకు యువ పరిశోధకులు మరింత పట్టుదలతో ఉండాలన్నారు. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే, విద్యార్థుల కెరీర్ దానిలో భాగస్వామ్యం కావాలన్నారు. కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సమయంలో.. జాతీయ ప్రయోజనాల గురించి ఆలోచించాలన్నారు.
జీతాలు, ఉద్యోగాలు, కంపెనీలు, ఘనతల గురించి విద్యార్థులు మిగితా వారితో పోల్చుకోవద్దు అని, ముఖ్యమంగా సోషల్ మీడియాలో ఇలాంటివి చేయకూడదని ప్రధాని మోదీ విద్యార్థులను హెచ్చరించారు. జీవితం అంటే లీడర్బోర్డు కాదు అని, మీ పోటీ ఇతర వ్యక్తులతో కాదు అని, మీతో మీరే పోటీపడాలని అన్నారు. స్వంత ప్రగతిపై ఫోకస్ పెట్టాలని, నిరంతరం నేర్చుకోవాలని, జీవితంలో కొత్తది నేర్చుకునేందుకు ఎప్పుడూ ఉత్సుకతతో ఉండాలన్నారు.