BS Yediyurappa : లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ నేత యడ్యూరప్పకు ఉచ్చు బిగుస్తున్నట్లే ఉంది. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. దాంతో ఆ కేసును కొట్టి వేయాలని కోరుతూ యడ్యూరప్ప కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. యడ్యూరప్ప పిటిషన్పై కర్ణాటక హైకోర్టు విచారణ చేపట్టాల్సి ఉంది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ కేసు విషయంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ ఓ మహిళ, ఆమె కుమార్తె ఇద్దరూ డాలర్స్ కాలనీలోని యడ్యూరప్ప నివాసానికి వెళ్లారు. అక్కడ తన కుమార్తెను యడ్యూరప్ప లైంగికంగా వేధించారని సంచలన ఆరోపణలు చేస్తూ.. ఆ మహిళ మార్చి నెలలో సదాశివ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
గంటల వ్యవధిలో కర్ణాటక డీజీపీ అలోక్ మోహన్ ఆ కేసును విచారణ నిమిత్తం సీఐడికి బదిలీ చేశారు. జూన్ 17న సీఐడీ అధికారులు యడ్యూరప్పను మూడు గంటలపాటు విచారించారు. ఆయనపై పోక్సో కేసు నమోదు చేశారు. ఆ కేసుపై మాజీ సీఎం యడ్యూరప్ప స్పందిస్తూ.. ‘నాపై కుట్రలకు పాల్పడే వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని’ అన్నారు.
తాజాగా ఈ కేసు దర్యాప్తు వేగవంతంగా జరగడం లేదని బాధితురాలి కుటుంబసభ్యులు కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో యడ్యూరప్ప కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అనూహ్యంగా నిన్న సాయంత్రం సీఐడీ అధికారులు యడ్యూరప్పపై 750 పేజీల ఛార్జ్షీట్ వేశారు. ఈ నేపథ్యంలో తనపై నమోదైన పోక్సో కేసును కొట్టి వేయాలని యడ్యూరప్ప పిటిషన్ వేయడం చర్చనీయాంశమైంది.