న్యూఢిల్లీ, జూలై 2: దేశంలో సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన 3 కొత్త క్రిమినల్ చట్టాల గురించి మాట్లాడేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నిరాకరించారు. మున్ముందు ఈ అంశం న్యాయ పరిధిలో ఉంటుందని చెప్పారు. ఢిల్లీలోని కర్కడూమ, శాస్త్రి పార్క్, రోహిణిలో దిగువ కోర్టు భవన నిర్మాణాలకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా కొత్త క్రిమినల్ చట్టాల అమలుపై అడిగిన ఓ ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ‘నేను ఇక్కడికి వచ్చిన పనికి, కొత్త క్రిమినల్ చట్టాలకు సంబంధం లేదు. ఇవి సుప్రీంకోర్టుతోపాటు ఇతర హైకోర్టుల పరిధిలోకి రాబోతున్న సమస్యలని మీకు తెలుసు. కోర్టుల ముందుకు వచ్చే అవకాశం ఉన్న ఏ అంశంపైనా నేను మాట్లాడకూడదు’ అని స్పష్టం చేశారు. ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్ సైతం ఇదే విధంగా స్పందించారు. ఈ చట్టాలకు సంబంధించిన అనేక కేసులు తన ముందుకు వచ్చే అవకాశం ఉన్నందున వాటి గురించి మాట్లాడటం సరికాదన్నారు.
వాతావరణ మార్పులను విస్మరించకూడదు
ఢిల్లీలో ఇటీవల ఎండలు మండిపోవడం, ఆ వెంటనే భారీ వర్షం కురవడంపై జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ మార్పులను ఎవరూ విస్మరించకూడదని, కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ హరిత జీవన విధానాన్ని (గ్రీన్ లైఫ్ైస్టెల్ను) అలవర్చుకోవాల్సిన అవసరం ఉన్నదని ఉద్ఘాటించారు. ఈ ఏడాది ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, ఒకే రోజు తీవ్రమైన వడగాడ్పులను, రికార్డు స్థాయి భారీ వర్షాన్ని చవిచూడాల్సి వచ్చిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పులను ఎవరూ విస్మరించడానికి వీల్లేదని పేర్కొంటూ.. మన మౌలిక వసతులు మన వాస్తవిక జీవనాన్ని ప్రతిబింబించేలా ఉండాలని స్పష్టం చేశారు.