Governor Ananda Bose | హైదరాబాద్, జూలై 4 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన రాజ్భవన్ ఉద్యోగిని సుప్రీంకోర్టులో సంచలన పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగంలో గవర్నర్లకు రక్షణ కల్పించడం వల్లే తనకు అన్యాయం జరిగినట్టు ఆమె వాపోయారు. గవర్నర్ విధుల్లో లైంగిక వేధింపులు కూడా ఉన్నాయా? అని ఆమె ప్రశ్నించారు. ఈ మేరకు గవర్నర్ పదవిలో ఉన్నవారికి రక్షణ కల్పిస్తున్న ఆర్టికల్ 361(2)ను ఆమె పిటిషన్లో సవాల్ చేశారు. తనకు తగిన న్యాయం జరుగడానికి ఈ విషయంలో సుప్రీంకోర్టు ప్రత్యేక మార్గదర్శకాలు ఇవ్వాల్సిందిగా పిటిషనర్ అభ్యర్థించారు.
‘గవర్నర్ పదవిలో ఉంటే లైంగిక వేధింపులు చేయడానికి అనుమతి ఉన్నట్టేనా? రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 (2) ఇలాంటివారిని రక్షించడానికే ఉన్నదా? ఒకవేళ, అదే నిజమైతే, ఆయన గవర్నర్ బాధ్యతల నుంచి దిగిపోయేవరకూ నాకు న్యాయం జరుగబోదు. దానికోసం ఎంతకాలం నేను వేచిచూడాలి?’ అంటూ బాధిత మహిళ తన పిటిషన్లో ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, శాశ్వత ఉద్యోగం ఇప్పిస్తానని తనకు ఆశబెట్టి ఏప్రిల్ 24, మే 2న గవర్నర్ రాజ్భవన్లో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించారు. గవర్నర్పై ఎఫ్ఐఆర్ నమోదుకు కలకత్తా హైకోర్టు అడ్డుచెప్పడంతో, బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
రాష్ట్రపతికి, గవర్నర్కు వ్యతిరేకంగా అతని/ఆమె పదవీకాలంలో ఉన్నప్పుడు ఎటువంటి సివిల్, క్రిమినల్ ప్రొసీడింగ్స్ను అనుమతించకుండా రాజ్యాంగంలోని 361 (2) అధికరణం రక్షణ కల్పిస్తున్నది. దీనిపై కోర్టుల్లోనూ విచారణ జరుపడానికి వీల్లేదు.