న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభల్లో నీట్పై (NEET) వాయిదా తీర్మానాలు తీసుకువస్తామని ప్రతిపక్ష పార్టీలు తెలిపాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో గురువారం జరిగిన ‘ఇండియా’ కూటమి పార్టీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై చర్చ సందర్భంగా నీట్, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, సీబీఐ, ఈడీ దుర్వినియోగం, గవర్నర్ కార్యాలయం వంటి అంశాలను లేవనెత్తుతామని ప్రతిపక్షాలు తెలిపాయి. సోమవారం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద విపక్ష సభ్యులు సమావేశమవుతారని వెల్లడించారు.
కాగా, ‘ఇండియా’ కూటమి సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగం, స్పీకర్ ఎన్నికతోపాటు అన్ని అంశాలపై పార్లమెంటులో చర్చ జరుగుతుందని అన్నారు.
మరోవైపు మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్లో అవకతవకలు, యూజీసీ-నెట్, సీఎస్ఐఆర్ యూజీసీ-నెట్, నీట్-పీజీ పరీక్షల రద్దుపై విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అయితే న్యాయ విచారణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.