కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద్ బోస్(CV Ananda Bose) పరువునష్టం కేసు నమోదు చేశారు. కోల్కతా హైకోర్టులో ఆయన ఆ పిటీషన్ ఫైల్ చేశారు. రాజ్భవన్కు వెళ్లేందుకు మహిళలు భయపడుతున్నారని ఇటీవల మమతా ఆరోపించారు. ఆ ఆరోపణలను ఖండిస్తూ గవర్నర్ ఆనంద్ బోస్ పరువునష్టం కేసు దాఖలు చేశారు. ప్రజాప్రతినిధులు తప్పుడు అభిప్రాయాలను క్రియేట్ చేయరాదు అని ఆయన అన్నారు. రాజ్భవన్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీఎంసీ నేతలపైన కూడా పరువునష్టం కేసును దాఖలు చేశారాయన.
రాజ్భవన్లో గవర్నర్ బోస్ .. వేధింపులకు పాల్పడినట్లు కాంట్రాక్టు మహిళా ఉద్యోగి ఒకరు మే 2వ తేదీన ఫిర్యాదు చేశారు. ఆ కేసులో కోల్కతా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ అంశంపై స్పందించేందుకు టీఎంసీ రాజ్యసభ ఎంపీ డోలా సేన్ రియాక్ట్ అయ్యేందుకు నిరాకరించారు. అసలు ఏం జరిగిందన్న దానిపై పార్టీ నాయకత్వంతో చర్చించాలని, ఇది చాన్నా సున్నితమైన అంశమని సేన్ తెలిపారు.
గవర్నర్ ఆనంద్ బోస్ తీసుకున్న నిర్ణయాన్ని సీనియర్ బీజేపీ నేత రాహుల్ సిన్హా సమర్థించారు. ఆ నిర్ణయం ఎప్పుడో తీసుకోవాల్సి ఉందని అన్నారు. ఆయన పూర్తి మద్దతు ఇస్తున్నట్లు సిన్హా వెల్లడించారు. గవర్నర్ బోస్, సీఎం మమతా బెనర్జీ మధ్య జరుగుతున్న వివాదం రాష్ట్రానికి మేలు చేయడం లేదని సీపీఎం నేత సుజన్ చక్రవర్తి తెలిపారు.