West Bengal | కోల్కతా: శాసనసభ నిర్వహణ పూర్తిగా గవర్నర్పై ఆధారపడి ఉండదని పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ బిమన్ బెనర్జీ వ్యాఖ్యానించారు. శుక్రవారం నుంచి శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు ప్రకటిస్తూ గురువారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘అసెంబ్లీ నిస్సహాయంగా ఉండదు. ప్రతీది గవర్నర్ చేతుల్లో ఉండదు. రాజ్యాంగ నిబంధనలు ఉంటాయి. వాటిని అందరూ పాటించాల్సిందే’ అని ఆయన గవర్నర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు తృణమూల్ ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారంపై ప్రతిష్టంభన నేపథ్యంలో స్పీకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇటీవలి ఉప ఎన్నికల్లో సయంతిక బంద్యోపాధ్యాయ్, రయత్ హుస్సేన్ సర్కార్ విజయం సాధించారు. ఫలితాలు వచ్చి నెల రోజులు అవుతున్నా వీరి ప్రమాణస్వీకారం మాత్రం జరగలేదు. రాజ్భవన్లో ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా గత వారం వీరిద్దరిని గవర్నర్ అనందబోస్ ఆహ్వానించారు. అయితే తాము అసెంబ్లీలోనే ప్రమాణం చేస్తామని వారు పట్టుబడుతున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఆరు రోజులుగా నిరసన దీక్ష చేస్తున్నారు. ఈ వివాదం కొనసాగుతుండగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని స్పీకర్ ప్రకటించారు. అసెంబ్లీ నిర్వహణ పూర్తిగా గవర్నర్పై ఆధారపడి ఉండదని స్పష్టం చేశారు. తనకు సంబంధం లేకుండా అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై గవర్నర్ ఎలా స్పందిస్తారనేది చూడాల్సి ఉంది.