Vande Bharat : ప్రయాణికుల సౌలభ్యం కోసం తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించేలా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు మహానగరాల్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటికి వచ్చిన ఆదరణతో త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. ఈ రైళ్ల ట్రయల్ రన్ ఆగస్టు 15న ప్రారంభం కానుంది.
తెలంగాణలో సికింద్రాబాద్ నుంచి వైజాగ్, సికింద్రాబాద్ టు తిరుపతి, కాచిగూడ-బెంగళూర్ మూడు వందే భారత్ రైళ్లు నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వందే భారత్ స్లీపర్ రైళ్లను కూడా కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి నడపాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రతిపాదించారు. ఇక కొత్తగా నడుపనున్న వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైళ్లను అత్యంత రద్దీ రూట్లైన కాచిగూడ-విశాఖ, కాచిగూడ-తిరుపతి, సికింద్రాబాద్-పుణె మార్గాల్లో నడపాలని ఉన్నతాధికారులు కోరుతున్నారు.
కొత్త వందే భారత్ స్లీపర్ రైళ్లు 16 బోగీలతో నడపనున్నారు. ఇవి ఏసీ, నాన్ ఏసీ కోచ్లు కావడంతో టికెట్ ధరలు అందరికీ అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.