డెహ్రాడూన్: బాలికపై అత్యాచారం జరిపి హత్య చేసిన కేసులో బీజేపీ నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి బీజేపీ బహిష్కరించింది. (BJP Expels Leader) బీసీ కమిషన్లో నామినేటెడ్ సభ్యుడైన అతడ్ని ఆ పదవి నుంచి కూడా తొలగించారు. బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో ఈ సంఘటన జరిగింది. మూడు రోజుల కిందట 13 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.
కాగా, కుమార్తె మొబైల్ ఫోన్కు కాల్ చేయగా బీజేపీ నేత ఆదిత్య రాజ్ సైనీ మాట్లాడినట్లు బాలిక తల్లి ఆరోపించింది. ఆమె తన వద్ద ఉన్నట్లు అతడు చెప్పాడని, ఆ తర్వాత మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యిందని తెలిపింది. మరునాడు ఆదిత్య రాజ్ సైనీ ఇంటికి వెళ్లగా తన కుమార్తె కనిపించలేదని చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్న తనను చంపుతానని బీజేపీ నేత బెదిరించినట్లు బాలిక తల్లి ఆరోపించింది.
మరోవైపు బహద్రాబాద్ ప్రాంతంలో పతంజలి రీసెర్చ్ సెంటర్ సమీపంలోని హైవే పక్కన బాలిక మృతదేహాన్ని మంగళవారం గుర్తించారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత ఆదిత్య రాజ్ సైనీ, అతడి అనుచరుడు అమిత్ సైనీ తన కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేశారని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారిద్దరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కాగా, దర్యాప్తు కోసం ఐదు పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. చివరకు బీజేపీ నేత ఆదిత్య రాజ్ సైనీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు.