Blue Origin | న్యూఢిల్లీ, జూలై 1: కేవలం రూ.200 చెల్లించి (2.5 డాలర్లు) పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవటం ద్వారా అంతరిక్షంలో అడుగుపెట్టే అవకాశాన్ని పొందొచ్చు. రాకేశ్శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా చరిత్ర సృష్టించవచ్చు. ఇది నిజం! అమెరికాకు చెందిన ‘అంతరిక్ష అన్వేషణ, పరిశోధన ఏజెన్సీ’ (సెరా) భారతీయులకు అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది.
వివిధ దేశాలకు చెందిన ఆరుగురు పౌరులను వ్యోమగాములుగా తీర్చిదిద్ది… అంతరిక్షంలో పంపేందుకు సెరా మానవ సహిత ‘స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రాం’ను చేపట్టింది. ‘బ్లూ ఆరిజన్’ కంపెనీ (అమెరికా బిలియనీర్ జెఫ్ బెజోస్కు చెందినది) తయారుచేసిన ‘న్యూ షెషర్డ్ రాకెట్’ ద్వారా వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపనున్నది.
ఇందుకు సంబంధించి వ్యోమగాముల ఎంపిక మొదలైందని, భారత పౌరసత్వం ఉన్న పౌరులెవ్వరైనా దరఖాస్తు చేసుకోవచ్చునని ‘సెరా’ తెలిపింది. ఆగస్టులో రిజిస్ట్రేషన్ ఉంటుందని, రూ.200 చెల్లిస్తే సరిపోతుందని ప్రకటించింది. అనంతరం పబ్లిక్ వోటింగ్, మూడు దశల్లో ‘ఎలిమినేషన్’తో భారత్ ప్రతినిధిగా ఒకరిని వ్యోమగామిగా ఎంపిక చేస్తారు. రాకెట్ ద్వారా వ్యోమగాముల్ని భూమి నుంచి 100 కిలోమీటర్ల ఎత్తులో ఉండే అంతరిక్షంలోకి తీసుకెళ్తారు. అక్కడ వారు 11 నిమిషాలపాటు గడిపేందుకు అవకాశముంటుంది.