Artificial Intelligence | న్యూఢిల్లీ, జూలై 1: ఈ ఏడాది జాబ్ మార్కెట్ను శాసించే కృత్రిమ మేథ (ఏఐ) నైపుణ్యాలపై అమెరికాకు చెందిన ఎంప్లాయ్మెంట్ వెబ్సైట్ ‘ఇండీడ్’ తాజాగా సర్వే నిర్వహించింది. ఏఐ జాబ్స్కు అవసరమయ్యే టాప్-15 ఏఐ నైపుణ్యాల్ని నివేదిక వెల్లడించింది. 42శాతం కంపెనీలు మెషిన్ లెర్నింగ్, 40 శాతం యాజమాన్యాలు పైథాన్ స్కిల్స్ను అభ్యర్థుల్లో ఉండాలని కోరాయి. ఏఐ (36), కమ్యూనికేషన్ స్కిల్స్ (23), నేచురల్ ల్యాంగ్వేజ్ ప్రాసెసింగ్(20), టెన్సార్ ఫ్లో (19), డాటా సైన్స్(17), ఏడబ్ల్యూఎస్(14), డీప్ లెర్నింగ్(14), జావా(11), అజ్యూర్(11), ఇమేజ్ ప్రాసెసింగ్(10), ఎస్క్యూఎల్(10), పైటార్చ్(9), అజైల్(8) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఏఐ వల్ల రాబోయే కాలంలో మరిన్ని ఉద్యోగాలు కొత్తగా వస్తాయని 85శాతం కంపెనీలు అంచనా వేస్తున్నాయని నివేదిక పేర్కొన్నది. ‘ఏఐ నైపుణ్యాల్ని పెంచుకోవటంపై భారత్ మరింత దృష్టి సారించాలి. ఉద్యోగులు ఏఐ స్కిల్స్ పొందటంలో కంపెనీలు వారికి సహకారం అందించాలి’ అని ఇండీడ్ ఇండియా సేల్స్ హెడ్ శశికుమార్ అన్నారు. భారత్లో ఏఐ మార్కెట్ 2027 నాటికి 17 బిలియన్ డాలర్లకు (రూ.1.4 లక్షల కోట్లు) చేరుకుంటుందని నాస్కామ్, బీసీజీ అంచనావేస్తున్నాయి. ఏటా 25 నుంచి 35శాతం వృద్ధి ఈ రంగంలో ఉంటుందని చెబుతున్నాయి. ఈ అంచనాలు నిజమవ్వాలంటే, భారతీయ కంపెనీలు ఏఐ స్కిల్స్ను గుర్తించాల్సి వుంది. దానికి అనుగుణంగా నియామకాలు చేపట్టాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.