లక్నో: భార్య అతి ఖర్చులపై భర్త కలత చెందాడు. ఆమెకు మరోకరితో వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడు. ఈ నేపథ్యంలో భార్యను హత్య చేశాడు. (Man Kills Over Spending Wife) స్నేహితుడితో కలిసి మృతదేహాన్ని కాలువలో పడేసే క్రమంలో పోలీసులకు దొరికిపోయాడు. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో ఈ సంఘటన జరిగింది. బుధవారం రాత్రి ఇద్దరు వ్యక్తులు కాలువలో గోనె సంచి పడేయడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయగా మరో వ్యక్తి తప్పించుకుని పారిపోయాడు. కాలువలో పడేసిన గోనె సంచిలో ఉన్న మహిళ మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు.
కాగా, అదుపులోకి తీసుకున్న వ్యక్తిని అర్బాజ్గా పోలీసులు గుర్తించారు. అతడ్ని ప్రశ్నించగా అసలు విషయం బయటపెట్టాడు. ఉత్తరాఖండ్లోని కోట్ద్వార్కు చెందిన 21 ఏళ్ల చాహత్ను ఎనిమిది నెలల కిందట వివాహం చేసుకున్నట్లు తెలిపాడు. పెళ్లి విషయం కుటుంబానికి తెలియకుండా అద్దె ఇంట్లో ఆమెతో కాపురం చేస్తున్నట్లు చెప్పాడు.
మరోవైపు భార్య చాహత్ అతిగా ఖర్చు చేయడంపై అర్బాజ్ కలత చెందాడు. అలాగే ఆమెకు ఎవరితోనో వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడు. స్నేహితుడు షారుఖ్తో తన గోడు చెప్పుకున్నాడు. చాహత్ను హత్య చేయాలని ఇద్దరు కలిసి కుట్ర పన్నారు. భార్య గొంతు నొక్కి అర్బాజ్ హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె గొంతు కోశాడు. మృతదేహాన్ని గుర్తించకుండా ఉండేందుకు చేతులు నరికాడు. డెడ్ బాడీని గోనె సంచిలో ఉంచి ఫ్రెండ్ షారుఖ్తో కలిసి కాలువలో పడేశాడు.
కాగా, బుధవారం రాత్రి అర్బాజ్, షారుఖ్ కలిసి ఆ కాలువ వద్దకు వెళ్లారు. పడేసిన మృతదేహం మునిగిందా లేదా అని పరిశీలించారు. నీరు తక్కువ ఉండటంతో మరింత లోతులో గోనె సంచిని పడేసేందుకు ప్రయత్నించారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అర్జాబ్ దొరికిపోయాడు. దీంతో భార్య హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడు షారుఖ్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.