NEET | న్యూఢిల్లీ: నీట్ అక్రమాలపై శుక్రవారం పార్లమెంట్ దద్దరిల్లింది. ప్రవేశ పరీక్ష నిర్వహణలో జరిగిన అక్రమాలపై వెంటనే ప్రభుత్వం చర్చ చేపట్టాలని లోక్సభ, రాజ్యసభల్లో విపక్ష ఎంపీలు పట్టుబట్టారు. దీంతో ఉభయ సభలు సోమవారానికి వాయిదాపడ్డాయి. లోక్సభలో వాయిదా అనంతరం మధ్యాహ్నం తిరిగి సమావేశమైన తర్వాత కూడా ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన కొనసాగించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా ఈ అంశంపై చర్చించవచ్చని స్పీకర్ ఓంబిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విపక్ష సభ్యులకు తెలిపారు.
పార్లమెంట్కు కొన్ని నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉన్నదని స్పీకర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ స్పందిస్తూ విద్యార్థులకు అవేమీ తెలియదని, వారు తమకు న్యాయం చేయాలని మాత్రమే కోరుతున్నారని పేర్కొన్నారు. అటు రాజ్యసభలోనూ ఇదే సీన్ కనిపించింది. పలుమార్లు సభ వాయిదా పడింది. నీట్ అంశంపై తక్షణం చర్చకు చైర్మన్ ధన్ఖర్ అనుమతించకపోవడంతో ప్రతిపక్ష పార్టీల ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రతిపక్ష నేత ఖర్గే పోడియం వద్దకు వచ్చి ఆందోళన చేయడంపై చైర్మన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
నీట్ను రద్దు చేయాలని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. ప్లస్ టూ పరీక్షలో వచ్చే మార్కుల ఆధారంగా మెడికల్ కోర్సుల్లో విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు అవకాశం ఇవ్వాలని కోరింది. అయితే బీజేపీ సభ్యులు ఈ తీర్మానాన్ని వ్యతిరేకించి, సభ నుంచి వాకౌట్ చేశారు. బీజేపీ మిత్ర పక్షం పీఎంకే ఈ తీర్మానానికి మద్దతునిచ్చింది.